BRICS: విశాఖలో బ్రిక్స్ సదస్సుకు సర్వం సిద్ధం.. నేటి నుంచి విదేశీ ప్రతినిధుల రాక
ఈ వార్తాకథనం ఏంటి
అంతర్జాతీయ స్థాయిలో మరో కీలక సదస్సుకు విశాఖపట్టణం సిద్ధమవుతోంది. ఈ నెల 22, 23 తేదీల్లో నగరంలో బ్రిక్స్ దేశాల యువజన, క్రీడా మంత్రుల సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సదస్సులో పాల్గొనే విదేశీ ప్రతినిధుల రాక గురువారం నుంచి ప్రారంభం కానుంది. బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేసియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల నుంచి ఐదుగురు మంత్రులతో పాటు 50 మంది ఉన్నతస్థాయి అధికారులు విశాఖకు రానున్నారు. సదస్సులో భాగంగా ఆయా దేశాల ప్రతినిధులు యువత, క్రీడలకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.
వివరాలు
ఈ అంశాలపై సమావేశంలో చర్చలు
ప్రధానంగా యువతకు మెరుగైన విద్యా అవకాశాలు కల్పించడం, నైపుణ్యాలను అభివృద్ధి చేయడం, ఆవిష్కరణలను ప్రోత్సహించడం, యువత సాధికారత వంటి అంశాలపై సమావేశంలో చర్చలు జరగనున్నాయి.
అలాగే క్రీడల అభివృద్ధి, క్రీడల్లో సాంకేతికత వినియోగం, క్రీడా పరిశ్రమను మరింత బలోపేతం చేయడం, సామర్థ్య నిర్మాణం వంటి అంశాలపైనా సభ్య దేశాలు తమ అభిప్రాయాలను పంచుకోనున్నాయి.
దీంతోపాటు సంప్రదాయ, స్వదేశీ క్రీడలను పరిరక్షించడం, వాటికి మరింత ప్రోత్సాహం అందించడం వంటి అంశాలు కూడా సదస్సులో ప్రాధాన్యం పొందనున్నాయి.
వివిధ దేశాల మంత్రులు, ఉన్నతాధికారుల రాకతో విశాఖలో అంతర్జాతీయ స్థాయి సమావేశాల సందడి నెలకొననుంది.