Page Loader
Trump Tariffs on India: ట్రంప్‌ టారిఫ్‌ ప్రకటన.. భారత్‌లో ఈ రంగాలపై ఎక్కువ ప్రభావం.. అవి ఏంటంటే..? 

Trump Tariffs on India: ట్రంప్‌ టారిఫ్‌ ప్రకటన.. భారత్‌లో ఈ రంగాలపై ఎక్కువ ప్రభావం.. అవి ఏంటంటే..? 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 03, 2025
12:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

అంచనాలకు మించి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌పై భారీ టారిఫ్‌లు విధించారు. భారత్‌ తమకు ముఖ్యమైన వాణిజ్య భాగస్వామి అని ప్రకటిస్తూ, ఒకవైపు సుంకాల పెంపును ప్రకటించారు. అమెరికా ఉత్పత్తులపై ఇతర దేశాలు విధిస్తున్న టారిఫ్‌లతో పోలిస్తే, తాము కేవలం సగం మాత్రమే వసూలు చేస్తున్నామని వెల్లడించారు. భారత ఉత్పత్తులపై సగటున 52% సుంకం విధించబడుతుండగా, అమెరికా 26% మాత్రమే విధిస్తున్నట్లు ట్రంప్‌ పేర్కొన్నారు. ఈ నిర్ణయం కొన్ని కీలక రంగాలపై ప్రభావం చూపనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా వ్యవసాయం, ఔషధ పరిశ్రమలు దీని ప్రభావాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది.

వివరాలు 

వ్యవసాయం, డెయిరీ, సీఫుడ్‌ రంగాలపై ప్రభావం 

గ్లోబల్‌ ట్రేడ్‌ రీసెర్చ్‌ ఇనిషియేటివ్‌ (GTRI) విశ్లేషణ ప్రకారం, ట్రంప్‌ టారిఫ్‌ల ప్రభావం వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిపై అధికంగా ఉండనుంది. భారత రొయ్యలు, ఇతర సీఫుడ్‌ ఉత్పత్తులకు అమెరికా ప్రధాన దిగుమతిదారుగా ఉంది. 2024లో, భారతదేశం అమెరికాకు 2.58 బిలియన్‌ డాలర్ల విలువైన చేపలు, ప్రాసెస్డ్‌ సీఫుడ్‌ ఎగుమతి చేసింది. తాజా సుంకాల పెంపుతో, అమెరికా మార్కెట్‌లో వీటి ధరలు పెరిగి, వినియోగం తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

వివరాలు 

డెయిరీ ఉత్పత్తులపై ప్రభావం 

ట్రంప్‌ తాజా నిర్ణయంతో భారత డెయిరీ ఉత్పత్తులపై సుంకం 38.23% కి పెరుగుతోంది. దీంతో వెన్న, నెయ్యి, పాలపొడి తదితర ఉత్పత్తుల ధరలు పెరగనున్నాయి. ప్రస్తుతం భారతదేశం నుంచి అమెరికాకు 181.49 మిలియన్‌ డాలర్ల డెయిరీ ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. అదనంగా, ప్రాసెస్డ్‌ ఫుడ్‌, చక్కెర, కోకో ఎగుమతులపై కూడా ఈ నిర్ణయం ప్రభావం చూపే అవకాశం ఉంది.

వివరాలు 

టెక్స్‌టైల్స్‌, బంగారం పరిశ్రమపై ప్రభావం 

భారతదేశం నుంచి అమెరికాకు 11.88 బిలియన్‌ డాలర్ల విలువైన బంగారం, వెండి, వజ్రాభరణాలు ఎగుమతి అవుతున్నాయి. తాజా పెంపుతో వీటిపై టారిఫ్‌ 13.32% కు చేరనుంది. ఇది అమెరికా మార్కెట్లో ఆభరణాల ధరలను పెంచే అవకాశం ఉంది. టెక్స్‌టైల్‌ రంగంలో భారతదేశం నుంచి 9.6 బిలియన్‌ డాలర్ల విలువైన దుస్తులు, ఫ్యాబ్రిక్స్‌ అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి. మొత్తం భారత టెక్స్‌టైల్‌ ఎగుమతుల్లో 28% అమెరికాకు చెందినదే. తాజా సుంకాల పెంపుతో, భారత టెక్స్‌టైల్‌ ఉత్పత్తుల ధరలు పెరగడం, మార్కెట్‌ పోటీ తగ్గడం జరగవచ్చు.

వివరాలు 

చెప్పుల పరిశ్రమకు దెబ్బ 

పాదరక్షల రంగంలో భారతదేశం నుంచి 457.66 మిలియన్‌ డాలర్ల విలువైన ఉత్పత్తులు అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి. అమెరికా-భారత్‌ మధ్య సుంకాల వ్యత్యాసం 15.56% గా ఉంది. దీంతో భారతీయ చెప్పుల ధరలు పెరగడంతో, వినియోగదారులు ఇతర దేశాల ఉత్పత్తులను ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. ఎలక్ట్రానిక్స్‌ రంగంపై ప్రభావం 2024లో, భారతదేశం నుంచి అమెరికాకు 14.39 బిలియన్‌ డాలర్ల విలువైన ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి. తాజా సుంకాల పెంపుతో, అమెరికా మార్కెట్‌లో భారత ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల ధరలు పెరగనున్నాయి. ముఖ్యంగా, బాయిలర్లు, టర్బైన్స్‌, కంప్యూటర్లు మొదలైన వాటి ధరలపై ఇది ప్రభావం చూపవచ్చు.

వివరాలు 

భారత ప్రభుత్వం ఈ అంశంపై వ్యూహాలు రూపొందించే అవకాశం

అమెరికా విధించిన తాజా టారిఫ్‌ల ప్రభావం భారతదేశ వాణిజ్య రంగంపై స్పష్టంగా పడనుంది. ముఖ్యంగా వ్యవసాయం, డెయిరీ, టెక్స్‌టైల్‌, బంగారం, ఎలక్ట్రానిక్స్‌ రంగాలకు ఇది గట్టి దెబ్బ అని చెప్పొచ్చు. భారత ప్రభుత్వం ఈ అంశంపై మరిన్ని వ్యూహాలను రూపొందించే అవకాశం ఉంది.