Loading...
Meta: చిన్నారుల భద్రతపై ఆరోపణలు.. 16.68 బిలియన్ డాలర్లు చెల్లించిన మెటా
చిన్నారుల భద్రతపై ఆరోపణలు.. 16.68 బిలియన్ డాలర్లు చెల్లించిన మెటా

Meta: చిన్నారుల భద్రతపై ఆరోపణలు.. 16.68 బిలియన్ డాలర్లు చెల్లించిన మెటా

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 27, 2026
11:23 am

ఈ వార్తాకథనం ఏంటి

పిల్లల భద్రతకు సంబంధించిన ఆరోపణలపై సోషల్ మీడియా దిగ్గజం మెటా కీలక నిర్ణయం తీసుకుంది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ మాతృ సంస్థ అయిన మెటా.. అమెరికాలోని 29 రాష్ట్రాలు దాఖలు చేసిన వ్యాజ్యాలను పరిష్కరించుకునేందుకు భారీ సెటిల్‌మెంట్‌కు అంగీకరించింది. ఇందులో భాగంగా గరిష్ఠంగా 16.68 బిలియన్ డాలర్ల వరకు చెల్లించేందుకు సిద్ధమైంది. కాలిఫోర్నియాలో కొనసాగుతున్న ఫెడరల్ విచారణలో ఈ ఒప్పందం కుదిరింది. చిన్నారులను ఆకర్షించేలా ప్లాట్‌ఫామ్‌ల రూపకల్పన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లను చిన్నారులు వాటికి అలవాటు పడేలా ఉద్దేశపూర్వకంగా రూపొందించారని అమెరికాలోని ఆయా రాష్ట్రాలు ఆరోపించాయి. ప్లాట్‌ఫామ్‌ల భద్రతా ప్రమాణాల విషయంలో వినియోగదారులను తప్పుదోవ పట్టించిందని కూడా పేర్కొన్నాయి. మైనర్ల రక్షణకు తగిన చర్యలు తీసుకోవడంలో మెటా విఫలమైందనే ఆరోపణలు ఈ కేసులో ప్రధానంగా ఉన్నాయి.

వివరాలు 

మైనర్ల వ్యక్తిగత డేటా సేకరణపై ఆరోపణలు

చిన్నారుల నుంచి వారి వ్యక్తిగత సమాచారాన్ని అక్రమంగా సేకరించిందని కూడా మెటాపై ఆరోపణలు వచ్చాయి.

అంతేకాకుండా, ఆ డేటాను మెషీన్ లెర్నింగ్, జనరేటివ్ ఏఐ మోడళ్లకు శిక్షణ ఇచ్చేందుకు ఉపయోగించినట్లు రాష్ట్రాలు ఆరోపించాయి.

దీంతో పిల్లల గోప్యత, డేటా భద్రత అంశాలు ఈ న్యాయపోరాటంలో కీలకంగా మారాయి.

టీనేజర్ల కోసం కీలక మార్పులు

సెటిల్‌మెంట్‌లో భాగంగా అమెరికాలోని టీనేజ్ యూజర్ల కోసం మెటా పలు మార్పులు చేయనుంది.

యువత సోషల్ మీడియాను ఉపయోగించే సమయాన్ని నియంత్రించేలా రోజువారీ వినియోగ పరిమితులు విధించనుంది.

అలాగే రాత్రి వేళల్లో ప్లాట్‌ఫామ్‌లను యాక్సెస్ చేయకుండా నిరోధించే చర్యలను కూడా చేపట్టనుంది. యువతపై సోషల్ మీడియా ప్రభావాన్ని తగ్గించడమే ఈ మార్పుల ప్రధాన ఉద్దేశం.

వివరాలు 

తప్పు చేయలేదన్న మెటా

అయితే ఈ సెటిల్‌మెంట్‌కు అంగీకరించినప్పటికీ, తాము ఎలాంటి తప్పు చేయలేదని మెటా స్పష్టం చేసింది.

ఈ వ్యవహారంలో తమపై ఎలాంటి చట్టపరమైన బాధ్యత లేదని పేర్కొంది. కేసును ముగించేందుకు చేసుకున్న ఒప్పందంగా మాత్రమే దీనిని సంస్థ అభివర్ణించింది.

ప్రీ-మార్కెట్‌లో మెటా షేర్లకు జోష్

భారీ సెటిల్‌మెంట్ వార్త వెలువడిన తర్వాత మెటా షేర్లలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ప్రీ-మార్కెట్ ట్రేడింగ్‌లో సంస్థ షేర్లు 4.4 శాతం మేర పెరిగాయి.

కేసు పరిష్కారానికి మార్గం సుగమం కావడాన్ని మార్కెట్ వర్గాలు సానుకూలంగా స్వీకరించినట్లు ఇది సూచించింది.

ADVERTISEMENT

వివరాలు 

ఇతర టెక్ సంస్థలపై కేసులు కొనసాగింపు

మెటాతో సంబంధం ఉన్న ఈ ప్రధాన న్యాయపోరాటం ముగిసినప్పటికీ.. యువతపై సోషల్ మీడియా ప్రభావానికి సంబంధించిన వివాదాలు పూర్తిగా సమసిపోలేదు.

మెటాతో పాటు స్నాప్, ఆల్ఫాబెట్‌కు చెందిన యూట్యూబ్, బైట్‌డాన్స్‌కు చెందిన టిక్‌టాక్ వంటి ప్రముఖ టెక్ సంస్థలపై కూడా ఇలాంటి కేసులు కొనసాగుతున్నాయి.

దీంతో పిల్లలు, టీనేజర్ల సోషల్ మీడియా వినియోగం, వారి భద్రత, వ్యక్తిగత డేటా రక్షణ అంశాలు టెక్ కంపెనీలకు మరింత కీలకంగా మారుతున్నాయి.

ADVERTISEMENT