NSE IPO: ఎన్ఎస్ఈ ఐపీఓ తేదీలు ఖరారు.. సెప్టెంబరు 17 నుంచి సబ్స్క్రిప్షన్
ఈ వార్తాకథనం ఏంటి
మదుపర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (NSE) పబ్లిక్ ఇష్యూ (IPO)కు సంబంధించిన తేదీలు ఖరారయ్యాయి. ఈ ఐపీఓకు సెప్టెంబరు 17న సబ్స్క్రిప్షన్ ప్రారంభం కానుంది. షేరు ధరల శ్రేణిని రూ.1,700 నుంచి రూ.1,785గా నిర్ణయించారు. ఒక్కో షేరు ముఖ విలువ రూ.1గా ఉంది. ఒక్క లాట్లో ఎనిమిది షేర్లు ఉంటాయి. ఈ లెక్కన రిటైల్ ఇన్వెస్టర్లు ఒక లాట్కు దరఖాస్తు చేసుకోవాలంటే రూ.14,280 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.
వివరాలు
ఐపీఓ తేదీలు ఇవే..
సబ్స్క్రిప్షన్ ప్రారంభం: సెప్టెంబరు 17
సబ్స్క్రిప్షన్ ముగింపు: సెప్టెంబరు 21
షేర్ల కేటాయింపు: సెప్టెంబరు 22
డీమ్యాట్ ఖాతాల్లో షేర్ల జమ: సెప్టెంబరు 23
స్టాక్ మార్కెట్లో లిస్టింగ్: సెప్టెంబరు 24
వివరాలు
రూ.22,561.57 కోట్ల విలువతో..
ఎన్ఎస్ఈ ఐపీఓ అప్పర్ ప్రైస్ బ్యాండ్ వద్ద రూ.22,561.57 కోట్ల విలువను నమోదు చేయనుంది.
ఈ నేపథ్యంలో దేశంలో రెండో అతిపెద్ద ఐపీఓగా నిలిచే అవకాశం ఉంది. మొత్తం షేర్లలో 35 శాతాన్ని రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించారు.
క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బిడ్డర్లకు 50 శాతం షేర్లను రిజర్వ్ చేశారు.
మిగిలిన వాటాను నాన్-ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు అందుబాటులో ఉంచనున్నారు.
అర్హత కలిగిన ఎన్ఎస్ఈ ఉద్యోగులకు ఒక్కో షేరుపై రూ.170 డిస్కౌంట్ లభించనుంది.
వివరాలు
12.64 కోట్ల షేర్లు ఆఫర్ ఫర్ సేల్ ద్వారా..
ఈ పబ్లిక్ ఇష్యూలో మొత్తం 12.64 కోట్ల ఈక్విటీ షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (OFS) పద్ధతిలో విక్రయించనున్నారు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), బ్యాంక్ ఆఫ్ బరోడా, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్ తదితర సంస్థలు తమ వాటాలను విక్రయించనున్నాయి.
వీటిలో ఎస్బీఐ వాటా గణనీయంగా ఉండనుంది. ఆ సంస్థ ఒక్కటే 2.48 కోట్ల షేర్లను విక్రయించనుంది.
తొలుత 14.89 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించాలని భావించినప్పటికీ.. ఆ తర్వాత ఇష్యూ పరిమాణాన్ని 15 శాతం తగ్గించారు.
వివరాలు
దశాబ్దం తర్వాత కార్యరూపం..
ఎన్ఎస్ఈ ఐపీఓ వాస్తవానికి దాదాపు పదేళ్ల క్రితమే రావాల్సి ఉంది. అయితే కో-లొకేషన్ వివాదం కారణంగా పబ్లిక్ ఇష్యూ ప్రక్రియ సుదీర్ఘకాలం వాయిదా పడింది.
ఇటీవలే ఈ ఐపీఓకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి ఆమోదం లభించడంతో ముందడుగు పడింది.