Loading...
NSE IPO: 17 నుంచి ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ.. రూ.22,569 కోట్ల ఇష్యూ
17 నుంచి ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ.. రూ.22,569 కోట్ల ఇష్యూ

NSE IPO: 17 నుంచి ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ.. రూ.22,569 కోట్ల ఇష్యూ

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 12, 2026
09:49 am

ఈ వార్తాకథనం ఏంటి

నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ) రూ.22,569 కోట్ల తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ) ఈ నెల 17న ప్రారంభం కానుంది. ఈ ఇష్యూ 21న ముగియనుంది. ఒక్కో షేరుకు ధరల శ్రేణిని రూ.1,700-1,785గా నిర్ణయించారు. యాంకర్‌ మదుపర్లు ఈ నెల 16న బిడ్లు దాఖలు చేయవచ్చు. రిటెయిల్‌ మదుపర్లు కనీసం 8 షేర్లకు దరఖాస్తు చేసుకోవాలి. ఒక్క లాట్‌కు రూ.14,280 చెల్లించాల్సి ఉంటుంది. సెప్టెంబరు 24న బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ (బీఎస్‌ఈ)లో ఎన్‌ఎస్‌ఈ షేర్లు నమోదయ్యే అవకాశం ఉంది.

వివరాలు

వాటా విక్రయిస్తున్న సంస్థలు ఇవే

ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ పూర్తిగా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) రూపంలో రానుంది. ప్రస్తుత వాటాదారులు దాదాపు 12.64 కోట్ల ఎన్‌ఎస్‌ఈ షేర్లను విక్రయిస్తున్నారు. తొలుత ఆయా సంస్థలు 14.9 కోట్ల షేర్లను విక్రయించాలని భావించగా.. ఇప్పుడు ఆ సంఖ్య 15 శాతం తగ్గింది. షేర్ల విక్రయ పరిమాణం తగ్గడంతో ఐపీఓ ద్వారా సమీకరించే నిధుల మొత్తం కూడా తగ్గింది. ఇష్యూ గరిష్ఠ ధర రూ.1,785గా పరిగణిస్తే.. మొత్తం ఐపీఓ విలువ రూ.22,569 కోట్లుగా ఉంటుంది. అయితే ఈ నిధులన్నీ వాటాలను విక్రయిస్తున్న సంస్థలకే దక్కుతాయి. ఎన్‌ఎస్‌ఈకి ఈ నిధుల్లో ఎలాంటి వాటా లభించదు. ఐపీఓ గరిష్ఠ ధర ఆధారంగా ఎన్‌ఎస్‌ఈ విలువ రూ.4.2 లక్షల కోట్లుగా ఉండనుంది.

వివరాలు

రిటెయిల్‌ మదుపర్లకు 35% షేర్లు

ఇంతకుముందు అంచనా ప్రకారం ఎన్‌ఎస్‌ఈ విలువ రూ.5 లక్షల కోట్లుగా ఉండాల్సి ఉంది.

ఎన్‌ఎస్‌ఈ ఐపీఓలో అర్హత కలిగిన సంస్థాగత మదుపర్ల (క్యూఐబీలు) కోసం 50 శాతం షేర్లను కేటాయించారు.

సంస్థాగతేతర మదుపర్లకు 15 శాతం, రిటెయిల్‌ మదుపర్లకు 35 శాతం వాటాను కేటాయించారు.

అర్హులైన ఉద్యోగుల కోసం రూ.70 కోట్ల విలువైన షేర్లను ప్రత్యేకంగా రిజర్వ్‌ చేశారు. వారికి ఒక్కో షేరుపై రూ.170 రాయితీని కూడా అందిస్తున్నారు.

ADVERTISEMENT

వివరాలు

ఎన్‌ఎస్‌ఈలో ఈ షేర్ల ట్రేడింగ్‌ ఉండదు

ఐపీఓ పూర్తయిన తర్వాత ఎన్‌ఎస్‌ఈ షేర్లు తమ సొంత ట్రేడింగ్‌ ప్లాట్‌ఫామ్‌పై ట్రేడ్‌ చేసేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి ఎలాంటి అనుమతులు కోరలేదని ఎన్‌ఎస్‌ఈ ఎండీ, సీఈఓ ఆశిష్‌ కుమార్‌ చౌహాన్‌ స్పష్టం చేశారు.

ప్రజల పొదుపును మూలధనంగా మార్చాలనే ఎన్‌ఎస్‌ఈ వ్యవస్థాపక లక్ష్యం పూర్తిగా నెరవేరిందని ఆయన పేర్కొన్నారు.

ADVERTISEMENT

వివరాలు

26 కంపెనీలకు భారీ లబ్ధి

ఎన్‌ఎస్‌ఈలో వాటాలు కలిగి ఉన్న 26 నమోదిత కంపెనీలకు ఈ ఐపీఓ ద్వారా గణనీయమైన లబ్ధి చేకూరనుంది.

ధరల శ్రేణిలో గరిష్ఠ ధర అయిన రూ.1,785 ఆధారంగా లెక్కిస్తే.. ఈ 26 కంపెనీల వద్ద ఉన్న ఎన్‌ఎస్‌ఈ వాటాల విలువ దాదాపు రూ.94,619 కోట్లుగా ఉంటుంది.

వీటిలో లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) వద్ద ఉన్న 26.53 కోట్ల ఎన్‌ఎస్‌ఈ షేర్ల విలువే రూ.47,351 కోట్లుగా ఉంటుంది.

ఎల్‌ఐసీకి ఎన్‌ఎస్‌ఈలో 10.72 శాతం వాటా ఉంది. అయితే ఐపీఓలో తన వాటాను విక్రయించకుండా ఎన్‌ఎస్‌ఈలో దీర్ఘకాలిక పెట్టుబడులను కొనసాగించాలని ఎల్‌ఐసీ నిర్ణయించుకుంది.

వివరాలు

రెండో అతిపెద్ద ఐపీఓగా ఎన్‌ఎస్‌ఈ

దేశంలో ఇప్పటివరకు వచ్చిన అతిపెద్ద ఐపీఓల్లో ఎన్‌ఎస్‌ఈ ఇష్యూ రెండో స్థానంలో నిలవనుంది.

హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా రూ.27,870 కోట్ల ఐపీఓతో ప్రస్తుతం ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉంది.

ఎన్‌ఎస్‌ఈ రూ.22,569 కోట్ల ఐపీఓ.. హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా తర్వాత దేశంలో రెండో అతిపెద్ద ఐపీఓగా నిలవనుంది.

2022లో వచ్చిన లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) రూ.21,000 కోట్ల ఐపీఓను ఎన్‌ఎస్‌ఈ అధిగమించనుంది.

ADVERTISEMENT