Oil prices: గల్ఫ్లో ఉద్రిక్తతలు.. వారంలో 12% పెరిగిన చమురు ధరలు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరగడంతో అంతర్జాతీయ చమురు మార్కెట్లో భారీ కదలిక కనిపిస్తోంది. గల్ఫ్ ప్రాంతం నుంచి ముడి చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడే అవకాశాలపై ఆందోళనలు వ్యక్తమవుతుండటంతో శుక్రవారం చమురు ధరలు మరోసారి పెరిగాయి. ఈ వారంలోనే బ్రెంట్,డబ్ల్యూతీఐ (WTI) ముడి చమురు ధరలు దాదాపు 12 శాతం వరకు పెరిగాయి. శుక్రవారం ట్రేడింగ్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 1.25 శాతం పెరిగి 85.28 డాలర్లకు చేరగా, అమెరికా వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) చమురు ధర 1.3 శాతం పెరిగి బ్యారెల్కు 79.98 డాలర్ల వద్ద ట్రేడైంది. దీంతో బ్రెంట్ వరుసగా మూడో వారంలో, డబ్ల్యూతీఐ వరుసగా రెండో వారంలో లాభాలను నమోదు చేసే దిశగా సాగుతున్నాయి.
వివరాలు
హర్ముజ్ జలసంధి పరిస్థితిపై మార్కెట్లో ఆందోళనలు
ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన హర్ముజ్ జలసంధి పరిస్థితిపై మార్కెట్లో ఆందోళనలు పెరుగుతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే ముడి చమురులో దాదాపు ఐదోవంతు ఈ సముద్ర మార్గం ద్వారానే రవాణా అవుతుంది.
ఈ మార్గంలో ఎలాంటి అంతరాయం ఏర్పడినా ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
గత నెలలో ఇరు దేశాల మధ్య తాత్కాలికంగా ఉద్రిక్తతలు తగ్గినప్పటికీ, తాజాగా అమెరికా ఇరాన్పై వైమానిక దాడులు ప్రారంభించింది.
బుధవారం రెండువిడతల్లో జరిగిన దాడుల్లో ప్రధానంగా ఇరాన్ దక్షిణ తీర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోగా,గురువారం కూడా దాడులు కొనసాగాయి.
వరుసగా ఆరోరోజు కూడా ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని బలహీనపరిచే లక్ష్యంతో దాడులు కొనసాగించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది.
వివరాలు
జోర్డాన్లోని అమెరికా వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా దాడులు
దీనికి ప్రతిగా ఇరాన్ కూడా క్షిపణులు, డ్రోన్లతో అమెరికా సైనిక స్థావరాలపై ఎదురుదాడులు చేసింది.
ముఖ్యంగా జోర్డాన్లోని అమెరికా వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగినట్లు సమాచారం.
ఈ పరిణామాలతో ఘర్షణ మరింత విస్తరించే ప్రమాదం ఉందనే భయాలు పెరిగాయి.
ఈ ఉద్రిక్త పరిస్థితులు గల్ఫ్ ప్రాంతంలోని చమురు ఉత్పత్తి, ఎగుమతులు, సముద్ర మార్గాలపై ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
అంతర్జాతీయ ఇంధన సంస్థ (IEA) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫాతిహ్ బిరోల్ మాట్లాడుతూ చమురు భద్రత ఇప్పటికీ ప్రపంచానికి అత్యంత కీలక అంశమేనని పేర్కొన్నారు.
రాబోయే కొన్ని వారాల్లో పరిస్థితులు మెరుగుపడకపోతే ఆందోళన చెందాల్సిందేనని ఆయన అన్నారు.
వివరాలు
రెడ్సీ సముద్ర మార్గంలో చమురు రవాణాను అడ్డుకునేందుకు యత్నాలు
ఇదే సమయంలో అమెరికా దాడులు ఇరాన్ కీలక విద్యుత్ మౌలిక సదుపాయాలపై కొనసాగితే, రెడ్సీ సముద్ర మార్గంలో చమురు రవాణాను అడ్డుకునేలా సిద్ధంగా ఉండాలని హౌతి మిత్ర బలగాలకు ఇరాన్ సూచించినట్లు రాయిటర్స్కు సమాచారం అందింది.
రెడ్సీతో పాటు బాబ్ అల్-మండెబ్ జలసంధి కూడా మధ్యప్రాచ్యం,యూరప్,ఆసియాలను కలిపే అత్యంత కీలక వాణిజ్య మార్గంగా ఉంది.
ప్రస్తుతం చమురు సరఫరాలో ఎలాంటి ప్రత్యక్ష అంతరాయం చోటుచేసుకోకపోయినా,భౌగోళిక రాజకీయ ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని ట్రేడర్లు ముందుగానే ధరలను పెంచుతున్నట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
ఉద్రిక్తతలు కొనసాగితే వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) ముడి చమురు ధర బ్యారెల్కు 80 డాలర్ల మార్క్ను దాటవచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
వివరాలు
కొత్త చెల్లింపు ఆధారిత డేటా సేవ ప్రారంభించిన ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్
అయితే ఈ ధరల పెరుగుదల దీర్ఘకాలం కొనసాగాలంటే వాస్తవంగా చమురు సరఫరాపై ప్రభావం పడాల్సి ఉంటుందని వారు పేర్కొంటున్నారు.
మరోవైపు ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ కొత్త చెల్లింపు ఆధారిత డేటా సేవను ప్రారంభించింది.
దీని ద్వారా ట్రూత్ సోషల్లో డొనాల్డ్ ట్రంప్కు సంబంధించిన పోస్టులు బ్యాంకులు, ట్రేడింగ్ సంస్థలకు వేగంగా అందుబాటులోకి రానున్నాయి.
వివరాలు
అమెరికా-ఇరాన్ ఘర్షణపైనే ప్రపంచ మార్కెట్ దృష్టి
అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ముఖ్యంగా ట్రంప్ వ్యాఖ్యలు గతంలో చమురు మార్కెట్పై ప్రభావం చూపిన నేపథ్యంలో ఈ సేవపై కూడా పెట్టుబడిదారులు ఆసక్తి చూపుతున్నారు.
ప్రస్తుతం మాత్రం ప్రపంచ మార్కెట్ దృష్టి మొత్తం అమెరికా-ఇరాన్ ఘర్షణపైనే ఉంది.
ఈ ఉద్రిక్తతలు మరింత పెరిగి హోర్ముజ్ జలసంధి, రెడ్సీ వంటి కీలక చమురు రవాణా మార్గాలపై ప్రభావం చూపుతాయా లేదా అన్నదే చమురు ధరల తదుపరి దిశను నిర్ణయించనుంది.