Loading...
Oil prices: 110 డాలర్లకు చేరువలో క్రూడాయిల్‌.. భారత్‌కు పెరగనున్న ఇంధన భారం
110 డాలర్లకు చేరువలో క్రూడాయిల్‌.. భారత్‌కు పెరగనున్న ఇంధన భారం

Oil prices: 110 డాలర్లకు చేరువలో క్రూడాయిల్‌.. భారత్‌కు పెరగనున్న ఇంధన భారం

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 11, 2026
10:17 am

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు మరింత తీవ్రం అవుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు వేగంగా పెరుగుతున్నాయి. హర్ముజ్‌ జలసంధితో పాటు కీలకమైన సముద్ర మార్గాల్లో వరుసగా దాడులు జరుగుతుండటం, చమురు రవాణాకు అంతరాయం ఏర్పడే ప్రమాదం కనిపించడం మార్కెట్లలో ఆందోళన పెంచుతోంది. ఫలితంగా వరుసగా రెండో రోజు కూడా క్రూడాయిల్‌ ధరలు భారీగా ఎగిశాయి. గురువారం ఒక్కరోజే 6 శాతానికి పైగా పెరిగిన ధరలు.. శుక్రవారం కూడా అదే జోరును కొనసాగించాయి.

వివరాలు 

బ్రెంట్‌ క్రూడ్‌ 110 డాలర్లకు చేరువ

అంతర్జాతీయ బెంచ్‌మార్క్‌ బ్రెంట్‌ క్రూడాయిల్‌ ధర బ్యారెల్‌కు 108.68 డాలర్లకు చేరింది.

అంటే 110 డాలర్ల కీలక స్థాయికి అది అత్యంత సమీపంలో ఉంది.

అమెరికా వెస్ట్‌ టెక్సాస్‌ ఇంటర్మీడియట్‌ (WTI) క్రూడ్‌ ధర కూడా బ్యారెల్‌కు 103.45 డాలర్లకు చేరుకుంది.

ఈ రెండు ప్రధాన బెంచ్‌మార్క్‌లు మే మధ్య తర్వాత తొలిసారిగా ఒక వారాన్ని 100 డాలర్లకు పైగా ముగించే దిశగా పయనిస్తున్నాయి.

వివరాలు 

యుద్ధం ముదరడంతో సరఫరాపై అనిశ్చితి

పశ్చిమాసియాలో ఇటీవల మళ్లీ తీవ్రరూపం దాల్చిన పోరుతో ప్రపంచ చమురు సరఫరాపై అనిశ్చితి పెరిగింది.

ముఖ్యంగా కీలక సముద్ర మార్గాల్లో చమురు ట్యాంకర్లు, ఇతర వాణిజ్య నౌకలపై దాడుల సంఖ్య పెరుగుతుండటం మార్కెట్‌ను కలవరపెడుతోంది.

గురువారం బ్రెంట్‌, WTI రెండింటి ధరలు 6 శాతానికిపైగా పెరిగాయి. వారాంత లెక్కన చూస్తే ఈ రెండు సూచీలు దాదాపు 13 శాతం మేర లాభపడ్డాయి.

ఇరాన్‌-అమెరికా మధ్య యుద్ధం ఏడో నెలలోకి ప్రవేశించినా ఉద్రిక్తతలు తగ్గే సంకేతాలు కనిపించడం లేదు.

ఇరు దేశాలు వెనక్కి తగ్గే ఉద్దేశం లేదన్న సంకేతాలు ఇస్తుండటంతో.. ఈ ఘర్షణ మరికొంతకాలం కొనసాగే అవకాశాలపై అంచనాలు పెరుగుతున్నాయి.

అదే జరిగితే ప్రపంచ చమురు సరఫరాపై మరింత ఒత్తిడి ఏర్పడొచ్చన్న భయాలు వ్యక్తమవుతున్నాయి.

ADVERTISEMENT

వివరాలు 

హర్ముజ్‌ నుంచి ఎర్ర సముద్రం వరకు ఆందోళన

ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన మార్గాల్లో ఒకటైన హర్ముజ్‌ జలసంధి మీదుగా నౌకల రాకపోకలు ఇప్పటికే పరిమితమయ్యాయి.

ఇదే సమయంలో యెమెన్‌లో ఇరాన్‌కు అనుకూలంగా ఉన్న హౌతీలు మొచా పోర్టుపై నియంత్రణ సాధించడం ఎర్ర సముద్రం మీదుగా జరిగే రవాణాపైనా కొత్త ఆందోళనలకు కారణమైంది.

సెప్టెంబర్‌ 10న ఒమన్‌ సమీపంలో రెండు నౌకలు గుర్తుతెలియని ప్రాజెక్టైళ్ల దాడికి గురైనట్లు యూకే మారిటైమ్‌ ట్రేడ్‌ ఆపరేషన్స్‌ వెల్లడించింది.

ఇరాన్‌ సమీపంలోని సముద్ర మార్గాల్లో ఉద్రిక్తతలు పెరగడం, అమెరికా ఐదు ఇరానియన్‌ చమురు ట్యాంకర్లపై దాడి చేయడం, ఆ తర్వాత ఇరాన్‌ కూడా పలు నౌకలపై దాడులు చేసినట్లు ప్రకటించడం.. చమురు రవాణాపై ముప్పును మరింత పెంచాయి.

ADVERTISEMENT

వివరాలు 

చైనా కొనుగోళ్లతో పెరుగుతున్న ఒత్తిడి

మరోవైపు సౌదీ అరేబియాలోని ఇంధన మౌలిక వసతులపై హౌతీలు చేస్తున్న దాడులు కూడా మార్కెట్‌లో ఆందోళన కలిగిస్తున్నాయి.

కొన్ని కార్యకలాపాలు నిలిచిపోవడంతో మధ్యప్రాచ్యం నుంచి అంతర్జాతీయ మార్కెట్‌కు వచ్చే చమురు సరఫరా మరింత తగ్గవచ్చన్న భయాలు నెలకొన్నాయి.

కేవలం సరఫరా వైపు సమస్యలే కాకుండా డిమాండ్‌కు సంబంధించిన పరిణామాలు కూడా క్రూడాయిల్‌ ధరల పెరుగుదలకు దోహదం చేస్తున్నాయి.

ప్రపంచంలోనే అతిపెద్ద ముడిచమురు దిగుమతిదారైన చైనా ఇటీవల కొన్ని వారాలుగా తన కొనుగోళ్లను పెంచింది.

చైనా ఇదే స్థాయిలో చమురు కొనుగోళ్లను కొనసాగిస్తే.. ఇప్పటికే ఉన్న సరఫరా అంతరాయాల ప్రభావం మరింత తీవ్రం కావచ్చని మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు.

ఫలితంగా అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు మరింత పైకి వెళ్లే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

వివరాలు 

క్రూడాయిల్‌ అంటే ఏమిటి?

ఇదే సమయంలో సౌదీ అరేబియాలో చమురు ఉత్పత్తి ఏడాదిలోనే కనిష్ఠ స్థాయికి పడిపోయినట్లు నివేదికలు వెల్లడించాయి.

దీంతో ప్రపంచ మార్కెట్‌లో ఇప్పటికే నెలకొన్న సరఫరా ఒత్తిడికి ఈ పరిణామం మరింత తోడైంది.

భూమి నుంచి వెలికితీసే ముడి చమురునే క్రూడాయిల్‌ అంటారు. దీనిని శుద్ధి ప్రక్రియకు గురిచేసి పెట్రోల్‌,డీజిల్‌,విమాన ఇంధనం, ఎల్‌పీజీ వంటి ఇంధనాలను తయారు చేస్తారు.

అంతేకాకుండా ప్లాస్టిక్‌, పెయింట్లు, వివిధ రసాయనాలు సహా అనేక పారిశ్రామిక ఉత్పత్తుల తయారీలోనూ ముడిచమురు కీలకమైన ముడి పదార్థంగా ఉపయోగపడుతుంది.

ప్రపంచ మార్కెట్‌లో క్రూడాయిల్‌ ధరలను సాధారణంగా బ్యారెల్‌ ప్రాతిపదికన లెక్కిస్తారు.

అంతర్జాతీయంగా ముడిచమురు ధర పెరిగినప్పుడు దాని ప్రభావం ఇంధన ధరలకే పరిమితం కాదు.

వివరాలు 

భారత్‌పై పడనున్న ప్రభావం

రవాణా వ్యయాలు పెరిగి.. చివరకు నిత్యావసర వస్తువుల ధరలపైనా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.

అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్‌ ధరలు భారీగా పెరగడం భారత్‌కు కీలక పరిణామం.

దేశీయ అవసరాల్లో గణనీయమైన భాగాన్ని భారత్‌ దిగుమతుల ద్వారానే తీర్చుకుంటోంది.

దీంతో ప్రపంచ మార్కెట్‌లో చమురు ధరలు పెరిగితే దేశం చెల్లించాల్సిన దిగుమతి బిల్లు పెరుగుతుంది.

దీనివల్ల కరెంట్‌ అకౌంట్‌ లోటుపై ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంది.

అదే సమయంలో రూపాయి విలువపైనా ప్రభావం పడొచ్చు.పెట్రోల్‌,డీజిల్‌ ధరలను పెంచాల్సిన పరిస్థితి ఏర్పడితే రవాణా ఖర్చులు పెరుగుతాయి.

దాని ప్రభావం నిత్యావసర సరుకులు, కూరగాయలు,ఇతర వస్తువుల ధరలపైనా పడే అవకాశం ఉంటుంది.

దీంతో క్రూడాయిల్‌ ధరల పెరుగుదల భారత్‌లో ద్రవ్యోల్బణంపై ఆందోళనలను కూడా తీవ్రతరం చేయొచ్చు.

వివరాలు 

120 డాలర్లకు చేరే అవకాశం ఉందా?

పశ్చిమాసియాలో ప్రస్తుత పరిస్థితులు ఇలాగే కొనసాగితే ముడిచమురు ధరలు మరింత పెరిగే అవకాశాన్ని మార్కెట్‌ విశ్లేషకులు కొట్టిపారేయడం లేదు.

యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే బ్రెంట్‌ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 120 డాలర్ల వరకు వెళ్లే అవకాశం ఉందని గోల్డ్‌మన్‌ శాక్స్‌ ఇప్పటికే హెచ్చరించింది.

ఈ ఏడాది ఇప్పటివరకు బ్రెంట్‌ క్రూడాయిల్‌ ధర దాదాపు 80 శాతం పెరిగింది.

యుద్ధ సమయంలో నమోదైన గరిష్ఠ ధర ఏప్రిల్‌ 30న బ్యారెల్‌కు 126 డాలర్లుగా ఉంది. దీంతో ప్రస్తుతం నమోదవుతున్న ధరలు కూడా ఆ స్థాయికి క్రమంగా చేరువవుతున్నాయి.

వివరాలు 

ఎంతకాలం కొనసాగుతుందో కీలకం

క్రూడాయిల్‌ ధరల ప్రస్తుత ర్యాలీ ఇంకా ఎంతకాలం కొనసాగుతుందనేది ప్రధానంగా కొన్ని అంశాలపై ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

పశ్చిమాసియాలో యుద్ధ తీవ్రత ఎలా మారుతుంది? కీలక సముద్ర మార్గాల్లో చమురు రవాణా సాధారణ స్థితికి వస్తుందా? చైనా తన కొనుగోళ్లను ఇదే స్థాయిలో కొనసాగిస్తుందా? అనే అంశాలు ధరల దిశను నిర్ణయించనున్నాయి.

మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మాత్రం నవంబర్‌లో జరిగే మధ్యంతర ఎన్నికల తర్వాత యుద్ధం ముగుస్తుందని, అనంతరం చమురు ధరలు భారీగా తగ్గుతాయని పేర్కొన్నారు.

అయితే ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న పరిణామాలు మాత్రం సమీప భవిష్యత్తులో ఉద్రిక్తతలు తగ్గే అవకాశాలపై అనుమానాలను మరింత పెంచుతున్నాయి.

ADVERTISEMENT