Loading...
Oil prices: హోర్ముజ్‌ జలసంధిలో ఉద్రిక్తతలు.. 96 డాలర్లకు చేరువైన చమురు ధరలు
హోర్ముజ్‌ జలసంధిలో ఉద్రిక్తతలు.. 96 డాలర్లకు చేరువైన చమురు ధరలు

Oil prices: హోర్ముజ్‌ జలసంధిలో ఉద్రిక్తతలు.. 96 డాలర్లకు చేరువైన చమురు ధరలు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 02, 2026
10:17 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత ముదరడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు పెరిగాయి. ఇరాన్‌ లక్ష్యాలపై అమెరికా ఇటీవల జరిపిన దాడులు, వాటికి ప్రతిగా ఇరాన్‌ అమెరికా మిత్రదేశాలపై దాడులకు పాల్పడినట్లు వచ్చిన వార్తలు మార్కెట్లలో ఆందోళన పెంచాయి. దీంతో నవంబర్‌ డెలివరీ బ్రెంట్‌ ముడిచమురు ధర 0.92 శాతం పెరిగి బ్యారెల్‌కు 95.52 డాలర్లకు చేరింది. అక్టోబర్‌ డెలివరీ వెస్ట్‌ టెక్సాస్‌ ఇంటర్మీడియట్‌ (WTI) ధర 0.6 శాతం పెరిగి 90.76 డాలర్ల వద్ద నమోదైంది.

వివరాలు 

అమెరికా ఆధిపత్యంలోనే పరిస్థితులు: ట్రంప్

అమెరికా ఆధిపత్యంలోనే పరిస్థితులు ఉన్నాయని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్నారు.

ఇరాన్‌ను చర్చల బల్ల వద్దకు తీసుకురావడానికి తాను ప్రయత్నించడం లేదని 'ట్రూత్‌ సోషల్‌'లో వెల్లడించారు.

హోర్ముజ్‌ జలసంధిపై అమెరికాకు దాదాపు పూర్తి నియంత్రణ ఉందని, మరోవైపు ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా క్షీణిస్తోందని ట్రంప్‌ వ్యాఖ్యానించారు.

అమెరికా తాజా దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్‌.. కువైట్‌, జోర్డాన్‌, బహ్రెయిన్‌ లక్ష్యంగా డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేసినట్లు సమాచారం.

వివరాలు 

హోర్ముజ్‌ జలసంధి మీదుగా కొనసాగుతున్న చమురు ఎగుమతులు

ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పటికీ హోర్ముజ్‌ జలసంధి మీదుగా చమురు ఎగుమతులు కొనసాగుతున్నాయి.

అయితే గుర్తింపు నుంచి తప్పించుకునేందుకు పలువురు చమురు ట్యాంకర్ల నిర్వాహకులు తమ ట్రాన్స్‌పాండర్లను ఆఫ్‌ చేసినట్లు తెలుస్తోంది.

యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్‌, ఇరాక్‌ వంటి గల్ఫ్‌ దేశాలు ఈ ప్రాంతం నుంచి చమురు ఎగుమతులను కొనసాగిస్తున్నాయి.

ఇదిలా ఉండగా, ఈ మార్గంలో ప్రయాణించే నౌకలకు ముప్పు ఇంకా కొనసాగుతోందని యూకే మారిటైమ్‌ ట్రేడ్‌ ఆపరేషన్స్‌ (UKMTO) హెచ్చరించింది.

సోమవారం ఒమన్‌ సమీపంలో హోర్ముజ్‌ జలసంధి నుంచి బయటకు వస్తున్న ఓ చమురు ట్యాంకర్‌పై గుర్తుతెలియని మూడు ప్రాజెక్టైళ్లు దాడి చేసినట్లు తెలిపింది.

ADVERTISEMENT

వివరాలు 

రువైస్‌ రిఫైనరీలో పూర్తిస్థాయి కార్యకలాపాలు పునరుద్ధరణ

మరోవైపు, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల నేపథ్యంలో అబుదాబి నేషనల్‌ ఆయిల్‌ కంపెనీ (ADNOC) కీలక నిర్ణయం తీసుకుంది.

యుద్ధ పరిస్థితుల్లో గతంలో దెబ్బతిన్న రువైస్‌ చమురు శుద్ధి కర్మాగారంలో పూర్తిస్థాయి కార్యకలాపాలను పునరుద్ధరించింది.

ప్రపంచంలోని అతిపెద్ద రిఫైనరీల్లో ఒకటైన ఈ ప్లాంట్‌ గత నెల రోజులుగా పూర్తి సామర్థ్యంతో పనిచేస్తోంది.

రువైస్‌ రిఫైనరీ పూర్తి స్థాయిలో పనిచేయడం వల్ల ఇంధన సరఫరాలకు అంతరాయం ఏర్పడే అవకాశాలపై నెలకొన్న ఆందోళనలు కొంతమేర తగ్గే అవకాశం ఉంది.

ADVERTISEMENT