Fuel Prices: క్రూడ్ ధరలు తగ్గినా ఇంధన ధరలు తగ్గే ఛాన్స్ లేదు.. కారణం ఇదే!
ఈ వార్తాకథనం ఏంటి
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (క్రూడ్ ఆయిల్) ధరలు ఇటీవల గణనీయంగా తగ్గినప్పటికీ, దేశంలో పెట్రోల్,డీజిల్ ధరలు ఇప్పట్లో తగ్గే అవకాశం లేదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. పశ్చిమ ఆసియా యుద్ధం కారణంగా ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు (ఓఎంసీలు) భారీ నష్టాలు చవిచూశాయి. ప్రస్తుతం ఆ నష్టాలను భర్తీ చేసుకునే ప్రయత్నంలో ఉండటంతో పాటు, శాంతి ఒప్పందం అమలు ఎలా జరుగుతుందో వేచి చూసిన తర్వాతే ధరలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
వివరాలు
నష్టాలు పూడ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కొంత సమయం ఇచ్చే అవకాశం
ఓఎంసీలు వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించే పరిస్థితి లేదని ఇంధన రంగ నిపుణుడు ఒకరు అభిప్రాయపడ్డారు. యుద్ధ సమయంలో కంపెనీలకు రోజుకు సుమారు రూ.1,000 కోట్ల వరకు నష్టాలు వచ్చాయని, తర్వాత అవి రోజుకు రూ.500-600 కోట్లకు తగ్గాయని చెప్పారు. నష్టాలు చాలా ఎక్కువగా ఉండటంతో, వాటిని కొంతవరకు పూడ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా కొంత సమయం ఇచ్చే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది మే నెలలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ విక్రయాలపై ఓఎంసీలు రోజుకు రూ.1,000 కోట్ల వరకు నష్టపోయాయి. అనంతరం పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు సుమారు రూ.7.50 మేర పెంచడంతో రోజువారీ నష్టాలు రూ.500-600 కోట్లకు తగ్గినట్లు సమాచారం.
వివరాలు
పశ్చిమ ఆసియా శాంతి ఒప్పందం అమలుపై ఇంకా అనిశ్చితి
2026 మార్చి నుంచి మే వరకు పెట్రోల్, డీజిల్, గృహ వినియోగ ఎల్పీజీ విక్రయాలపై మొత్తం అండర్ రికవరీలు సుమారు రూ.1 లక్ష కోట్లకు చేరినట్లు అంచనా. క్రిసిల్ ఇంటెలిజెన్స్కు చెందిన సెహుల్ భట్ మాట్లాడుతూ, భారత క్రూడ్ ఆయిల్ బాస్కెట్ ధర బ్యారెల్కు 90 డాలర్ల కంటే తక్కువగా కొనసాగితే ప్రస్తుతం ఉన్న నష్టాలు మరింత పెరిగే అవకాశం తక్కువేనన్నారు. అయితే పశ్చిమ ఆసియా శాంతి ఒప్పందం అమలుపై ఇంకా అనిశ్చితి ఉండటంతో ఇంధన మార్కెట్లలో ధరల హెచ్చుతగ్గులు కొనసాగవచ్చని పేర్కొన్నారు. పశ్చిమ ఆసియా ఘర్షణ ప్రభావంతో అంతర్జాతీయ ఎల్పీజీ ధరలు కూడా భారీగా పెరిగాయి.
వివరాలు
ఎల్పీజీపై మాత్రమే దాదాపు రూ.22 వేల కోట్ల నష్టాలు
భారతదేశం దిగుమతి చేసుకునే ఎల్పీజీకి ప్రమాణంగా పరిగణించే సౌదీ అరామ్కో కాంట్రాక్ట్ ధరలు 2026 ఫిబ్రవరి నుంచి జూన్ మధ్య 46 శాతం పెరిగినట్లు క్రిసిల్ వెల్లడించింది. సరఫరా అంతరాయం ఏర్పడే ప్రమాదం, రవాణా ఖర్చులు పెరగడం ఇందుకు ప్రధాన కారణాలని తెలిపింది. ఢిల్లీలో గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్పై 2026 మే నాటికి ఒక్కో సిలిండర్కు రూ.651 వరకు అండర్ రికవరీ నమోదైంది. వాణిజ్య ఎల్పీజీ ధరలు మార్కెట్కు అనుగుణంగా పెరిగినా, గృహ వినియోగదారులపై పూర్తి భారం వేయకుండా చమురు కంపెనీలే కొంత భరించాయి. దీంతో మార్చి-మే కాలంలో ఎల్పీజీపై మాత్రమే దాదాపు రూ.22 వేల కోట్ల నష్టాలు వచ్చినట్లు క్రిసిల్ గణాంకాలు చెబుతున్నాయి.
వివరాలు
6 మిలియన్ బ్యారెళ్ల లోటు
నిపుణుల అభిప్రాయం ప్రకారం, పశ్చిమ ఆసియా యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా రోజుకు 10 నుంచి 11 మిలియన్ బ్యారెళ్ల చమురు సరఫరా ప్రభావితమైంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఇలాంటి భౌగోళిక ఉద్రిక్తతలు తలెత్తినా ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు అనేక దేశాలు అదనపు క్రూడ్ ఆయిల్ నిల్వలు పెంచుకునే అవకాశముంది. అంతర్జాతీయ ఇంధన సంస్థ (IEA) ప్రకారం, సభ్య దేశాలు తమ వ్యూహాత్మక నిల్వల నుంచి రోజుకు సుమారు 4 మిలియన్ బ్యారెళ్ల చమురును మార్కెట్లోకి విడుదల చేశాయి. అయినప్పటికీ ఇంకా సుమారు 6 మిలియన్ బ్యారెళ్ల లోటు కొనసాగుతోందని విశ్లేషకులు తెలిపారు. ఈ లోటును భర్తీ చేసేందుకు దేశాలు నిల్వలను పెంచే ప్రయత్నం చేస్తాయని వారు అంచనా వేస్తున్నారు.
వివరాలు
2026 ద్వితీయార్థంలో క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్కు 80 నుంచి 90 డాలర్ల మధ్య ఉండే అవకాశం
ప్రపంచవ్యాప్తంగా చమురు నిల్వలు క్రమంగా తగ్గుతున్నందున, రాబోయే నెలల్లో క్రూడ్ ఆయిల్ ధరలు మళ్లీ పెరిగే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఓఎంసీలు పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించే అవకాశాలు మరింత తగ్గుతాయని చెబుతున్నారు. ఎస్ అండ్ పీ గ్లోబల్ ఎనర్జీ అంచనా ప్రకారం, 2026 ద్వితీయార్థంలో అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్కు 80 నుంచి 90 డాలర్ల మధ్య ఉండే అవకాశం ఉంది. పశ్చిమ ఆసియా యుద్ధం కారణంగా దెబ్బతిన్న సరఫరా వ్యవస్థ పూర్తిగా సాధారణ స్థితికి రావడానికి సమయం పడుతుందని నివేదిక పేర్కొంది.
వివరాలు
మార్కెట్ పూర్తిగా స్థిరపడేందుకు,నిల్వలు మళ్లీ పెరగడానికి కొంత సమయం
హర్ముజ్ జలసంధి తిరిగి తెరుచుకోవడంతో ఇంధన సరఫరా మెరుగుపడే అవకాశం ఉన్నప్పటికీ, మార్కెట్ పూర్తిగా స్థిరపడేందుకు, నిల్వలు మళ్లీ పెరగడానికి ఇంకా కొంత సమయం పట్టే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఐసీఆర్ఏ కార్పొరేట్ రేటింగ్స్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ వశిష్ట్ కూడా యుద్ధానికి ముందు ఉన్న స్థాయికి చమురు సరఫరా, ధరలు చేరుకోవడానికి కనీసం రెండు త్రైమాసికాలు లేదా ఏడాది వరకు సమయం పట్టవచ్చని పేర్కొన్నారు.
వివరాలు
మురు మార్కెటింగ్ సంస్థల ఆర్థిక పరిస్థితిపై ఒత్తిడి
భారత్లో పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలు 2022 ఏప్రిల్ నుంచి పెద్దగా మారలేదు. దీంతో చమురు మార్కెటింగ్ సంస్థల లాభాల మార్జిన్లు తగ్గిపోయి, వాటి ఆర్థిక పరిస్థితిపై ఒత్తిడి పెరిగింది. పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ గణాంకాల ప్రకారం,రిఫైనరీలు దిగుమతి చేసుకున్న క్రూడ్ ఆయిల్ సగటు ధర ఏప్రిల్లో బ్యారెల్కు 114.48 డాలర్లు, మేలో 106.23 డాలర్లుగా నమోదైంది.