PM Modi's 5-Nation Tour: మోదీ 5 దేశాల పర్యటన ఫలితం.. రూ.3.5 లక్షల కోట్ల పెట్టుబడులు, భారత్కు గ్లోబల్ బలం
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల చేపట్టిన ఐదు దేశాల విదేశీ పర్యటన భారత్కు భారీ ఆర్థిక, వ్యూహాత్మక లాభాలను తీసుకొచ్చింది. ఈ పర్యటనలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ కంపెనీలు, భాగస్వామ్య దేశాలతో జరిగిన సమావేశాల ద్వారా దాదాపు 40 బిలియన్ డాలర్ల (సుమారు రూ.3.5 లక్షల కోట్లు) పెట్టుబడుల హామీలు లభించాయి. సెమీకండక్టర్లు, మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్స్, టెక్నాలజీ, తయారీ రంగాలకు చెందిన 50కి పైగా అంతర్జాతీయ కంపెనీల సీఈవోలు, సీనియర్ ప్రతినిధులతో మోదీ సమావేశమయ్యారు. ఈ సంస్థల మొత్తం మార్కెట్ విలువ దాదాపు 3 ట్రిలియన్ డాలర్ల వరకు ఉంటుందని, ఇప్పటికే భారత్లో వీటి పెట్టుబడులు, వ్యాపార విస్తరణలు సుమారు 180 బిలియన్ డాలర్ల మేర ఉన్నాయని అధికారులు వెల్లడించారు.
వివరాలు
మోదీ పర్యటనలో ఈ దేశాలు
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) భారత్లో మరో 5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. భారత్లో పెరుగుతున్న వినియోగ మార్కెట్, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని అనేక కంపెనీలు తమ కార్యకలాపాలను విస్తరించేందుకు ఆసక్తి చూపుతున్నాయి. మోదీ పర్యటనలో యూఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా సరఫరా వ్యవస్థలు, ఇంధన భద్రత, భౌగోళిక రాజకీయ సమీకరణాల్లో మార్పులు జరుగుతున్న సమయంలో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. "చైనా ప్లస్ వన్" వ్యూహంలో భాగంగా భారత్ను విశ్వసనీయ తయారీ, టెక్నాలజీ భాగస్వామిగా ప్రపంచానికి పరిచయం చేసే ప్రయత్నం ఈ పర్యటన ద్వారా జరిగింది.
వివరాలు
ప్రధాన ఆకర్షణగా సెమీకండక్టర్ రంగం
సెమీకండక్టర్ రంగం ఈ పర్యటనలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా యూరప్ దేశాలతో చిప్ ఎకోసిస్టమ్, సరఫరా వ్యవస్థలపై కీలక చర్చలు జరిగాయి. ASML-టాటా భాగస్వామ్యంతో సెమీకండక్టర్ రంగంలో కొత్త అవకాశాలపై చర్చించగా, కృత్రిమ మేధస్సు (AI), స్వచ్ఛ ఇంధనం, ఆధునిక సాంకేతిక రంగాల్లో సహకారాన్ని కూడా భారత్ ముందుకు తీసుకెళ్లింది. ఆర్థిక రంగానికే పరిమితం కాకుండా దౌత్య పరంగానూ భారత్కు ఈ పర్యటన బలాన్ని ఇచ్చింది.
వివరాలు
"స్పెషల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్" స్థాయికి అప్గ్రేడ్ అయిన భారత్-ఇటలీ సంబంధాలు
భారత్-నెదర్లాండ్స్ మధ్య వాణిజ్యం, రక్షణ, సెమీకండక్టర్లు, గ్రీన్ హైడ్రోజన్ రంగాల్లో వ్యూహాత్మక రోడ్మ్యాప్ విడుదలైంది. స్వీడన్తో సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి తీసుకెళ్లగా, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో జరిగిన చర్చల తర్వాత భారత్-ఇటలీ సంబంధాలను "స్పెషల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్" స్థాయికి అప్గ్రేడ్ చేశారు. భారత్ కేవలం వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగానే కాకుండా, భవిష్యత్ ప్రపంచ ఆర్థిక, భౌగోళిక రాజకీయ వ్యవస్థలో కీలక పాత్ర పోషించే దేశంగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.