RBI: ఫోన్ ఈఎంఐ బకాయిలపై వినియోగదారులకు ఊరట.. ఆర్బీఐ కొత్త ఆదేశాలు
ఈ వార్తాకథనం ఏంటి
స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లు, ల్యాప్టాప్లను ఈఎంఐ పద్ధతిలో కొనుగోలు చేసే వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రుణగ్రహీతల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్ బి ఐ) కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. వాయిదాలు ఆలస్యమయ్యాయని చెప్పి వెంటనే ఫోన్ను రిమోట్ ద్వారా లాక్ చేసే విధానంపై స్పష్టమైన పరిమితులు విధించింది. ఈ కొత్త నిబంధనలు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఆర్బీఐ తాజా మార్గదర్శకాల ప్రకారం,ఈఎంఐ చెల్లింపులో జాప్యం జరిగిన వెంటనే ఫోన్ను లాక్ చేయడానికి రుణదాతలకు అనుమతి ఉండదు. ఫోన్ కొనుగోలుకు తీసుకున్న రుణం 30 రోజుల పాటు బకాయిగా ఉన్న తర్వాత మాత్రమే కొన్ని పరిమితులు విధించే అవకాశం ఉంటుంది.
వివరాలు
60 రోజులు దాటితేనే పూర్తి స్థాయిలో ఫోన్ లాక్
పూర్తిగా ఫోన్ను లాక్ చేయాలంటే బకాయి 60రోజులు దాటిన తర్వాతే ఆ చర్య తీసుకోవాలి.
ఈ నిబంధనలు కేవలం ఫోన్, ట్యాబ్లెట్,ల్యాప్టాప్ కొనుగోలుకు తీసుకున్న రుణాలకు మాత్రమే వర్తిస్తాయని ఆర్బీఐ స్పష్టం చేసింది.
వ్యక్తిగత రుణం లేదా ఇతర రకాల రుణాల పేరుతో ఇప్పటికే వినియోగంలో ఉన్న ఫోన్ను రిమోట్ ద్వారా లాక్ చేసే అధికారం రుణ సంస్థలకు ఉండదని వెల్లడించింది.
ఫోన్పై పరిమితులు విధించిన సందర్భంలో కూడా కొన్ని కీలక సేవలు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని ఆర్బీఐ ఆదేశించింది.
ముఖ్యంగా ఇన్కమింగ్ కాల్స్, ఎస్ఎంఎస్లు, అత్యవసర ఎస్వోఎస్ సదుపాయం,ఉద్యోగానికి అవసరమైన ముఖ్యమైన ఫీచర్లు నిరంతరంగా పనిచేసేలా చూడాలని సూచించింది.
దీంతో రుణగ్రహీతలు పూర్తిగా ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది.
వివరాలు
వినియోగదారుల వ్యక్తిగత సమాచారానికి కూడా ఆర్బీఐ రక్షణ
వినియోగదారుల వ్యక్తిగత గోప్యతకు కూడా ఆర్బీఐ ప్రాధాన్యం ఇచ్చింది. ఫోన్లోని కాంటాక్టులు, ఫొటోలు, వీడియోలు, ఎస్ఎంఎస్లు, కాల్ వివరాలు, లొకేషన్ హిస్టరీ వంటి వ్యక్తిగత సమాచారాన్ని రుణ సంస్థలు యాక్సెస్ చేయరాదని స్పష్టం చేసింది.
డేటా రక్షణకు సంబంధించిన నిబంధనలను ప్రతి రుణదాత తప్పనిసరిగా పాటించాలని ఆదేశించింది.
అలాగే ఫోన్పై పరిమితులు అమలు చేసే ముందు వినియోగదారుడికి ముందస్తుగా సమాచారం ఇవ్వాలని పేర్కొంది.
రుణం మంజూరు చేసే సమయంలోనే ఈ నిబంధనల గురించి స్పష్టంగా వివరించాల్సి ఉంటుంది.
పరిమితులు అమలు చేసే ముందు మరోసారి నోటీసు ఇచ్చి బకాయిలు చెల్లించేందుకు తగిన అవకాశం కల్పించాలని సూచించింది.
వివరాలు
ఆలస్యమైతే గంటకు రూ.250 పరిహారం
బకాయి మొత్తాన్ని పూర్తిగా చెల్లించిన తర్వాత సాధారణంగా గంటలోపు ఫోన్పై విధించిన పరిమితులను తొలగించాలని ఆర్బీఐ ఆదేశించింది.
ఒకవేళ గంట దాటినా ఫోన్ను అన్లాక్ చేయకపోతే, ప్రతి గంట ఆలస్యానికి రూ.250 చొప్పున పరిహారం వినియోగదారుడికి చెల్లించాలని రుణ సంస్థలకు స్పష్టం చేసింది.