RBI : 90 రూపాయల అంచు వద్ద రూపాయి.. ఆర్పిఐ కీలక జోక్యం
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి విలువ వరుసగా బలహీనపడుతున్న నేపథ్యంలో,భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్పిఐ) రూపాయి పతనాన్ని ఆపేందుకు కీలక చర్యలు తీసుకుంది. శుక్రవారం రూపాయి కీలక స్థాయిని దాటి దిగజారడంతో, అది 90 రూపాయల మానసిక గీతను తాకే ప్రమాదం ఉందన్న ఆందోళనలు పెరిగాయి. మార్కెట్లో నెగెటివ్ సెంటిమెంట్ పెరగకుండా, రూపాయి మరింత క్షీణించకుండా ఆర్పిఐ తీసుకున్న చర్యలు సహాయపడుతున్నాయని నిపుణుల అభిప్రాయం.
వివరాలు
డాలర్లు విక్రయించి మార్కెట్ను నిలబెట్టిన ఆర్పిఐ
రూపాయి విలువను నిలబెట్టేందుకు ఆర్పిఐ ఆర్డర్-మ్యాచింగ్ ప్లాట్ఫారమ్తో పాటు 'నాన్ డెలివరబుల్ ఫార్వర్డ్ మార్కెట్'లో కూడా డాలర్లు అమ్మింది. దీంతో మార్కెట్లో ఒత్తిడి కొంత తగ్గి, రూపాయి మరింత పడిపోకుండా ఆపగలిగింది. శుక్రవారం రూపాయి 88.80 స్థాయిని దాటి దిగజారడం, గత కొన్ని వారాలుగా ఆర్పిఐ కాపాడుతున్న రేంజ్నే బ్రేక్ చేసినట్టుగా బ్యాంకర్లు చెబుతున్నారు. ఆ రోజు రూపాయి ఒక దశలో 89.16 వద్ద ట్రేడ్ అయి, ఇది ఇప్పటివరకు నమోదైన కనిష్ట స్థాయి.
వివరాలు
భారత-అమెరికా వాణిజ్య ఒప్పందం రూపాయికి బలం ఇవ్వొచ్చు
ఇటీవల రూపాయి బలహీనతకు అధిక డాలర్ డిమాండ్నే ప్రధాన కారణమని ఆర్పిఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టం చేశారు. భారత్-అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరితే ఈ ఒత్తిడి తగ్గే అవకాశం ఉందని ఆయన చెప్పారు. దేశ విదేశీ మారక నిల్వలు తగిన భరోసా ఇస్తాయని కూడా ఆయన పేర్కొన్నారు. అయితే అమెరికా-భారత్ వాణిజ్య చర్చల్లో స్పష్టత లేకపోవడం మార్కెట్ సెంటిమెంట్ను ఇంకా బలహీనపరుస్తోందని ట్రేడర్లు అంటున్నారు.