Gold Bond: రూ.3,276 పెట్టుబడికి రూ.15,102.. గోల్డ్ బాండ్లపై 361 శాతం లాభం
ఈ వార్తాకథనం ఏంటి
బంగారంలో పెట్టుబడి పెట్టిన వారికి భారీ లాభం అందనుంది. 2018-19 సిరీస్-VI సావరిన్ గోల్డ్ బాండ్ల (SGB) ముందస్తు రిడెంప్షన్ ధరను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకటించింది. ఆన్లైన్ ద్వారా ఈ బాండ్లను కొనుగోలు చేసిన పెట్టుబడిదారులకు ఒక్క యూనిట్పై దాదాపు 361 శాతం రాబడి లభించనుంది. ఆగస్టు 12నే ముందస్తు రిడెంప్షన్ తేదీ కావడం విశేషం. 2018-19 సిరీస్-VI సావరిన్ గోల్డ్ బాండ్లను 2019 ఫిబ్రవరి 12న జారీ చేశారు. అప్పట్లో ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసిన వారికి ఒక్క యూనిట్ ధర రూ.3,276గా ఉంది. అదే సమయంలో ఆఫ్లైన్లో కొనుగోలు చేసిన పెట్టుబడిదారులకు యూనిట్ ధర రూ.3,326గా నిర్ణయించారు. ఆన్లైన్ కొనుగోళ్లపై ప్రభుత్వం రూ.50 డిస్కౌంట్ అందించింది.
వివరాలు
ఆఫ్లైన్ పెట్టుబడిదారులకు దాదాపు 354 శాతం రాబడి
ఆర్బీఐ ప్రకటించిన ధర ప్రకారం.. ఆగస్టు 12న ముందస్తుగా రిడీమ్ చేసుకునే ఒక్క సావరిన్ గోల్డ్ బాండ్ యూనిట్కు రూ.15,102 చెల్లించనున్నారు.
దీంతో ఆన్లైన్లో రూ.3,276కు యూనిట్ కొనుగోలు చేసిన వారికి రూ.11,826 లాభం వస్తుంది.
అంటే పెట్టుబడిపై దాదాపు 361 శాతం రాబడి పొందినట్లవుతుంది.ఆఫ్లైన్లో రూ.3,326 చెల్లించి బాండ్ కొనుగోలు చేసిన వారికి కూడా గణనీయమైన లాభం లభిస్తుంది.
ప్రస్తుత రిడెంప్షన్ ధర రూ.15,102తో పోలిస్తే ఒక్క యూనిట్పై రూ.11,776 లాభం వస్తుంది.
ఇది దాదాపు 354 శాతం రాబడికి సమానం. ఎస్జీబీ నిబంధనల ప్రకారం.. బాండ్లు జారీ చేసిన తేదీ నుంచి ఐదేళ్లు పూర్తయిన తర్వాత పెట్టుబడిదారులు ముందస్తు రిడెంప్షన్ చేసుకునే అవకాశం ఉంటుంది.
వివరాలు
చెల్లించే రిడెంప్షన్ ధరను 999 స్వచ్ఛత కలిగిన బంగారం ధర ఆధారంగా నిర్ణయం
ఈ సందర్భంగా చెల్లించే రిడెంప్షన్ ధరను 999 స్వచ్ఛత కలిగిన బంగారం ధర ఆధారంగా నిర్ణయిస్తారు.
ముందస్తు రిడెంప్షన్ ధరను లెక్కించేందుకు ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) ప్రకటించే 999 స్వచ్ఛత గల బంగారం ధరలను పరిగణనలోకి తీసుకుంటారు.
సాధారణంగా రిడెంప్షన్కు ముందు ఉన్న మూడు పనిదినాల్లో నమోదైన ముగింపు ధరల సగటును తీసుకుని యూనిట్ విలువను నిర్ణయిస్తారు.
ఈసారి ఆగస్టు 7, 10, 11 తేదీల బంగారం ముగింపు ధరలను లెక్కలోకి తీసుకున్నారు.
వివరాలు
పెట్టుబడిదారులకు వడ్డీ కూడా
ఇక సావరిన్ గోల్డ్ బాండ్ల ద్వారా వచ్చే లాభానికి అదనంగా పెట్టుబడిదారులకు వడ్డీ కూడా లభిస్తుంది.
ఈ బాండ్లపై ఏడాదికి 2.50 శాతం వడ్డీ చెల్లిస్తారు. ఆ వడ్డీని ప్రతి ఆరు నెలలకు ఒకసారి పెట్టుబడిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు.
అయితే ఈ వడ్డీ ఆదాయంపై అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.