Page Loader
Stock Market : అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల నడుమ నష్టాల్లో ట్రేడవుతున్న సూచీలు 
అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల నడుమ నష్టాల్లో ట్రేడవుతున్న సూచీలు

Stock Market : అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల నడుమ నష్టాల్లో ట్రేడవుతున్న సూచీలు 

వ్రాసిన వారు Sirish Praharaju
May 16, 2025
10:02 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ షేర్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్‌ను నష్టాలతో ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుండి కలగలిపిన సంకేతాలు, భారతీ ఎయిర్‌టెల్‌, ఇన్ఫోసిస్‌, ఎస్‌బీఐ వంటి కీలక కంపెనీల షేర్లలో అమ్మకాల ప్రభావంతో మార్కెట్ సూచీలు కిందకి జారుకున్నాయి. ఈ పరిణామాలతో సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:25 గంటల సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్‌ 235 పాయింట్లు పడిపోయి 82,295 వద్ద కొనసాగగా, ఎన్ఎస్‌ఈ నిఫ్టీ 51 పాయింట్ల నష్టంతో 25,010 వద్ద కొనసాగుతోంది.

వివరాలు 

బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 64.51 డాలర్లు 

సెన్సెక్స్‌లో ఉన్న 30 ప్రధాన షేర్లలో భారతీ ఎయిర్‌టెల్‌, ఎస్‌బీఐ, ఇండస్ఇండ్‌ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌, సన్‌ఫార్మా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌, మహీంద్రా అండ్ మహీంద్రా, టీసీఎస్‌, టైటాన్‌, ఏషియన్ పెయింట్స్‌, టెక్ మహీంద్రా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో బజాజ్ ఫిన్‌సర్వ్‌, బజాజ్ ఫైనాన్స్‌, అల్ట్రాటెక్ సిమెంట్‌, ఎటర్నల్, ఎన్టీపీసీ, మారుతీ సుజుకీ, టాటా స్టీల్‌, అదానీ పోర్ట్స్ షేర్లు లాభాలతో కదలాడుతున్నాయి. రూపాయి విలువ అమెరికన్ డాలర్‌తో పోల్చితే 85.42 వద్ద ట్రేడింగ్‌ను మొదలుపెట్టింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 64.51 డాలర్ల వద్ద కొనసాగుతోంది. బంగారం ధర ఔన్సుకు 3,213 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

వివరాలు 

మిశ్రమ ధోరణిలో ఆసియా-పసిఫిక్ మార్కెట్లు

అమెరికాలోని ప్రధాన సూచీలు అయిన ఎస్‌ అండ్‌ పీ 500, డోజోన్స్ గత ట్రేడింగ్ సెషన్‌ను లాభాలతో ముగించగా,నాస్‌డాక్ మాత్రం స్థిరంగా (ఫ్లాట్‌గా) ముగిసింది. ఆసియా-పసిఫిక్ మార్కెట్లు ఈరోజు మిశ్రమ ధోరణిని ప్రదర్శిస్తున్నాయి. ఆస్ట్రేలియాలోని ఏఎస్‌ఎక్స్‌ సూచీ 0.62 శాతం లాభంతో ట్రేడవుతుండగా, జపాన్ నిక్కీ 0.25 శాతం, చైనా షాంఘై సూచీ 0.54 శాతం, హాంకాంగ్ హాంగ్‌సెంగ్ సూచీ 0.75 శాతం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. గత ట్రేడింగ్ సెషన్‌లో విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) నికరంగా రూ.5,393 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) రూ.1,668 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు.