Stock Market: పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం.. వరుసగా మూడోరోజూ నష్టాల్లో సూచీలు
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియా ఉద్రిక్తతలు,చమురు ధరల పెరుగుదల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాలతో ముగిశాయి. అమెరికా భవిష్యత్తులో వడ్డీ రేట్లను పెంచే అవకాశాలపై నెలకొన్న ఆందోళనలు కూడా మదుపర్ల సెంటిమెంట్ను దెబ్బతీశాయి. ముఖ్యంగా ఐటీ, రియాల్టీ, ఆటో రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. దీంతో వరుసగా మూడో సెషన్లోనూ సెన్సెక్స్,నిఫ్టీ నష్టాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 76,471.32 పాయింట్ల వద్ద నష్టాలతో రోజును ప్రారంభించింది. మంగళవారం సూచీ 76,944.28 వద్ద ముగిసిన విషయం తెలిసిందే. బుధవారం ట్రేడింగ్ మొత్తం ప్రతికూలంగానే సాగింది. ఒక దశలో సెన్సెక్స్ 700 పాయింట్లకు పైగా క్షీణించింది. ఇంట్రాడేలో 76,135.72 పాయింట్ల కనిష్ఠ స్థాయిని తాకింది. చివరికి 373.93 పాయింట్లు తగ్గి 76,570.35 వద్ద స్థిరపడింది.
వివరాలు
డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 94.97గా నమోదు
నిఫ్టీ కూడా ఇదే బాటలో పయనించింది. సూచీ 141.35 పాయింట్లు కోల్పోయి 23,914.45 వద్ద ట్రేడింగ్ను ముగించింది.
మరోవైపు డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 94.97గా నమోదైంది.
సెన్సెక్స్ 30లో ఏషియన్ పెయింట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్సీఎల్, బీఈఎల్, ఇన్ఫోసిస్ షేర్లు ప్రధానంగా నష్టాలను చవిచూశాయి.
వీటికి భిన్నంగా ఆదానీ పోర్ట్స్, బజాజ్ ఫిన్సర్వ్, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, టైటాన్, రిలయన్స్ షేర్లు లాభాల్లో ముగిశాయి.
వివరాలు
ఆసియా మార్కెట్లపైనా ప్రతికూల ప్రభావం
అంతర్జాతీయ మార్కెట్లోనూ ముడిచమురు ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 95.09 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
మరోవైపు బంగారం ఔన్స్ ధర 4,303.19 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లపైనా ప్రతికూల ప్రభావం కనిపించింది.
దక్షిణ కొరియా, జపాన్, షాంఘై, హాంకాంగ్ మార్కెట్ సూచీలు కూడా బుధవారం నష్టాలతో ముగిశాయి.