Stock Market: స్వల్ప లాభాలతో ముగిసిన సెన్సెక్స్.. నిఫ్టీకి 20 పాయింట్లు
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం స్వల్ప మార్పులతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు రావడం, భౌగోళిక రాజకీయ పరిణామాలతో చమురు ధరలు పెరుగుతుండటం వంటి అంశాలు మదుపర్లను అప్రమత్తంగా వ్యవహరించేలా చేశాయి. దీంతో రోజంతా లాభనష్టాల మధ్య ఊగిసలాడిన సూచీలు.. చివరికి దాదాపు స్థిరంగానే ముగిశాయి. ఈ ఉదయం 77,701 వద్ద స్వల్ప లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్ (Sensex).. కొద్దిసేపటికే 77,725 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. అయితే ఈ లాభాలు ఎక్కువసేపు నిలవలేదు. కీలక రంగాల్లో మదుపర్లు అమ్మకాలకు మొగ్గుచూపడంతో సూచీ లాభనష్టాల మధ్య కదలాడింది. ఒక దశలో 77,445 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. చివరకు కేవలం 3 పాయింట్ల లాభంతో 77,540 వద్ద స్థిరపడింది.
వివరాలు
రూపాయి @ 95.71
మరోవైపు నిఫ్టీ (Nifty) 20పాయింట్లు లాభపడి 24,252 వద్ద ముగిసింది.
డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 3పైసలు బలపడి 95.71 వద్ద స్థిరపడింది.
నిఫ్టీ-50లో పవర్గ్రిడ్ కార్పొరేషన్, హెచ్డీఎఫ్సీ లైఫ్, నెస్లే, కొటక్ మహీంద్రా బ్యాంక్, భారత్ ఎలక్ట్రానిక్స్ షేర్లు స్వల్ప లాభాలను నమోదు చేశాయి.
మరోవైపు మారుతి సుజుకీ,ట్రెంట్, ఇంటర్గ్లోబ్ ఏవియేషన్, సిప్లా, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ షేర్లు నష్టాలను చవిచూశాయి.
రంగాల వారీగా చూస్తే లోహ, ప్రభుత్వ రంగ బ్యాంకింగ్, రియల్టీ షేర్లలో కొనుగోళ్ల ఆసక్తి కనిపించింది.
దీనికి భిన్నంగా ఐటీ,ఆటో,మీడియా,ఫార్మా రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.
మొత్తంగా అంతర్జాతీయ పరిణామాలు,పెరుగుతున్న చమురు ధరల ప్రభావంతో దేశీయ మార్కెట్లు వారాంతపు సెషన్లో పెద్దగా కదలిక లేకుండా ముగిశాయి.