Page Loader
Stock market: రెండో రోజూ లాభాల్లో సూచీలు.. నిఫ్టీ @ 22,500 

Stock market: రెండో రోజూ లాభాల్లో సూచీలు.. నిఫ్టీ @ 22,500 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 06, 2025
04:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు రెండో రోజు కూడా లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాల ప్రభావంతో మన మార్కెట్‌లో కొనుగోళ్లకు మద్దతు లభించింది. ఉదయం కొన్ని ఒడుదొడుకులు ఎదురైనప్పటికీ, మధ్యాహ్నం తర్వాత మార్కెట్ స్థిరంగా లాభాలను కొనసాగించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో పాటు ఇంధన, మెటల్ స్టాక్స్‌లో జరిగిన కొనుగోళ్లు సూచీలకు సహాయంగా నిలిచాయి. వరుస నష్టాల కారణంగా స్టాక్స్‌ ధరలు తగ్గిన వేళ,మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపడం ప్రధాన కారణంగా మారింది. ఈ రోజు సెన్సెక్స్ 600 పాయింట్ల మేర లాభపడగా, నిఫ్టీ 22,500 మార్కును దాటి స్థిరపడింది.స్మాల్, మిడ్‌క్యాప్ సూచీలూ మంచి ప్రదర్శన కనబరిచాయి. సెన్సెక్స్ ఉదయం 74,308.30 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 73,730.23)లాభాల్లో ప్రారంభమైంది.

వివరాలు 

డాలరుతో రూపాయి మారకం విలువ 87.12

అయితే, కొద్ది సమయానికే నష్టాల్లోకి వెళ్లింది. 73,415.68వద్ద కనిష్ఠ స్థాయిని తాకిన సూచీ, అనంతరం వేగంగా పుంజుకుని ఇంట్రాడేలో 74,390.80పాయింట్ల గరిష్ఠాన్ని చేరుకుంది. చివరకు 609.86 పాయింట్ల లాభంతో 74,340.09వద్ద ముగిసింది. నిఫ్టీ 207.40పాయింట్ల లాభంతో 22,544.70 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 6 పైసలు బలహీనపడి 87.12వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 సూచీలో ఏషియన్ పెయింట్స్, ఎన్టీపీసీ, రిలయన్స్, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. టెక్ మహీంద్రా,కోటక్ మహీంద్రా బ్యాంక్, జొమాటో,టాటా మోటార్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టాలను చవిచూశాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 69.51 డాలర్ల వద్ద కొనసాగుతుండగా, బంగారం ఔన్సు 2,901 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.