UPI: యూపీఐ వృద్ధి మందగమనం.. ఎండీఆర్ రుసుముపై మళ్లీ మొదలైన చర్చ
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో డిజిటల్ చెల్లింపులకు ప్రధాన వేదికగా మారిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) లావాదేవీల వృద్ధి వేగం తగ్గుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (FY27) తొలి నాలుగు నెలల్లో యూపీఐ లావాదేవీల వృద్ధిరేటు గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 10 శాతం పాయింట్లు తగ్గింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) గణాంకాల ప్రకారం.. ఏప్రిల్ నుంచి జులై వరకు మొత్తం 92 బిలియన్ యూపీఐ లావాదేవీలు జరిగాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ లావాదేవీలు 23.5 శాతం పెరిగాయి. అయితే FY26 తొలి నాలుగు నెలల్లో నమోదైన 33.5 శాతం వృద్ధితో పోలిస్తే ప్రస్తుత వృద్ధిరేటు గణనీయంగా తగ్గింది.
వివరాలు
FY25లో ఏకంగా 41 శాతం పెరిగిన యూపీఐ లావాదేవీలు
అంటే యూపీఐ లావాదేవీల సంఖ్య పెరుగుతున్నప్పటికీ.. గతంలో ఉన్నంత వేగంగా మాత్రం వృద్ధి చెందడం లేదని గణాంకాలు చెబుతున్నాయి.
రెండేళ్లలో దాదాపు సగానికి తగ్గిన వృద్ధి: యూపీఐ వృద్ధిలో ఈ మందగమనం కేవలం ఒక్క త్రైమాసికానికి పరిమితం కాలేదు.
FY25లో యూపీఐ లావాదేవీలు ఏకంగా 41 శాతం పెరిగాయి. FY26లో ఈ వృద్ధి దాదాపు 30 శాతానికి తగ్గింది.
ఇప్పుడు FY27 తొలి నాలుగు నెలల్లో మరింత మందగించింది. దీంతో గత రెండేళ్ల వ్యవధిలో యూపీఐ వృద్ధిరేటు దాదాపు సగానికి తగ్గినట్లుగా కనిపిస్తోంది.
అయితే ఇక్కడ వేర్వేరు కాల వ్యవధుల గణాంకాలను పోల్చుతున్నందున.. ఈ సంఖ్యలను నేరుగా పోల్చడం సరైనది కాదని నిపుణులు చెబుతున్నారు.
వివరాలు
ఎండీఆర్ రుసుముపై చర్చ
యూపీఐ వృద్ధి మందగిస్తున్న సమయంలో మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR)పై చర్చ మరోసారి వేడెక్కింది.
డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు 2020 నుంచి యూపీఐ లావాదేవీలపై ప్రభుత్వం జీరో ఎండీఆర్ విధానాన్ని అమలు చేస్తోంది.
అంటే యూపీఐ ద్వారా చెల్లింపులు స్వీకరించే వ్యాపారుల నుంచి బ్యాంకులు ఎలాంటి ఎండీఆర్ రుసుము వసూలు చేయవు.
అయితే జీరో ఎండీఆర్ కారణంగా బ్యాంకులు, ఫిన్టెక్, పేమెంట్ సంస్థలకు యూపీఐ ద్వారా తగిన ఆదాయ మార్గం లేకుండా పోయిందని కొన్ని సంస్థలు వాదిస్తున్నాయి.
దీంతో యూపీఐ వ్యవస్థను మరింత విస్తరించేందుకు అవసరమైన పెట్టుబడులు తగ్గాయని, ఇది ప్లాట్ఫామ్ వృద్ధిపై ప్రభావం చూపుతోందని చెబుతున్నాయి.
వివరాలు
ఎండీఆర్ విధిస్తే వృద్ధి వేగం పెరిగేదా?
కొన్ని పరిశ్రమ వర్గాలు మాత్రం యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ రుసుము విధిస్తే వృద్ధి మరింత వేగంగా జరిగేదని అభిప్రాయపడుతున్నాయి.
దీనివల్ల ఫిన్టెక్ సంస్థలకు ఆదాయం లభించి.. కొత్త వినియోగదారులను ఆకర్షించేందుకు క్యాష్బ్యాక్లు, ఇతర ప్రోత్సాహకాలు అందించే అవకాశం ఉండేదని చెబుతున్నాయి.
అలాగే ఎక్కువ మంది వ్యాపారులను యూపీఐ పరిధిలోకి తీసుకురావడానికి సేల్స్ బృందాలను విస్తరించేందుకు కూడా నిధులు ఉపయోగపడేవని వాదిస్తున్నాయి.
అయితే మరో వర్గం దీనిని వ్యతిరేకిస్తోంది. కొత్తగా డిజిటల్ చెల్లింపులు ఉపయోగించేవారిలో వేగంగా యూపీఐని విస్తరించాలంటే ఎలాంటి రుసుములు లేకపోవడమే మంచిదని చెబుతోంది.
డిజిటల్ గుర్తింపులో ఆధార్ కీలక పాత్ర పోషించినట్టే.. ఉచిత చెల్లింపు విధానం కూడా కొత్త వర్గాల ప్రజలను డిజిటల్ చెల్లింపుల వైపు తీసుకురావడంలో ఉపయోగపడుతుందని పేర్కొంటోంది.
వివరాలు
లావాదేవీల విలువ మాత్రం పెరుగుతోంది
యూపీఐ లావాదేవీల సంఖ్య వృద్ధి మందగించినప్పటికీ.. వాటి మొత్తం విలువ పెరుగుతున్న విషయం ఆసక్తికరంగా మారింది.
FY26 పూర్తి సంవత్సరంలో యూపీఐ లావాదేవీల విలువ వృద్ధి 18.5 శాతంగా ఉండగా.. FY27 తొలి నాలుగు నెలల్లో ఇది 20 శాతానికి చేరింది.
అంటే లావాదేవీల సంఖ్య గతంతో పోలిస్తే నెమ్మదిగా పెరుగుతున్నప్పటికీ.. జరుగుతున్న లావాదేవీల సగటు విలువ మాత్రం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి.