Vijay Mallya PMLA case: అప్పు రికవరీ అయినంత మాత్రాన నేరం మాఫీ కాదు.. విజయ్ మాల్యా కేసులో ఈడీ
ఈ వార్తాకథనం ఏంటి
పరారీలో ఉన్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక వాదన చేసింది. బ్యాంకులకు చెల్లించాల్సిన బకాయిల్లో భారీ మొత్తం తిరిగి వసూలైనప్పటికీ.. ఆయనపై నమోదైన మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కేసులను, వాటికి సంబంధించిన క్రిమినల్ ప్రొసీడింగ్స్ను రద్దు చేయడం సాధ్యం కాదని బాంబే హైకోర్టుకు స్పష్టం చేసింది. ఈ మేరకు కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో తన అభిప్రాయాన్ని వెల్లడించింది.
వివరాలు
రూ.15 వేల కోట్ల రికవరీపై మాల్యా వాదన..
ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియానికి విజయ్ మాల్యా చెల్లించాల్సిన అసలు బకాయి సుమారు రూ.6,203 కోట్లు.
దీనికి వడ్డీని కలిపి దాదాపు రూ.15,000 కోట్లు ఇప్పటికే రికవరీ అయినట్లు మాల్యా తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఈ నేపథ్యంలో తనపై కొనసాగుతున్న కేసులను కూడా ముగించాలని వారు కోరుతున్నారు.
ఈ వాదనను ఈడీ మాత్రం తీవ్రంగా వ్యతిరేకించింది. బ్యాంకులకు సంబంధించిన బకాయిల రికవరీ ఒక సివిల్ అంశమని పేర్కొంది.
బకాయిలు తిరిగి చెల్లించబడినంత మాత్రాన మనీలాండరింగ్ వంటి క్రిమినల్ నేరం తీవ్రత తగ్గదని స్పష్టం చేసింది.
సివిల్ వివాదానికి సంబంధించిన పరిష్కారాన్ని ఆధారంగా చేసుకుని క్రిమినల్ నేరంపై కొనసాగుతున్న విచారణను నిలిపివేయడం సరికాదని తెలిపింది.
వివరాలు
మనీలాండరింగ్ తీవ్రమైన ఆర్థిక నేరం
మనీలాండరింగ్ తీవ్రమైన ఆర్థిక నేరమని, అందువల్ల దానిపై చట్ట ప్రకారం విచారణ కొనసాగాల్సిందేనని ఈడీ పేర్కొంది.
పీఎంఎల్ఏలోని సెక్షన్ 8(8) ప్రకారం.. చట్టబద్ధమైన హక్కులు కలిగిన బ్యాంకులకు సుమారు రూ.14,131.60 కోట్ల విలువైన ఆస్తులను పునరుద్ధరించి అప్పగించినట్లు వివరించింది.
అయితే, ఆస్తులను బ్యాంకులకు తిరిగి ఇవ్వడం వల్ల బాధితులకు ఆర్థిక ఉపశమనం లభిస్తుంది తప్ప.. నేరం జరగలేదని భావించడానికి అది కారణం కాదని ఈడీ స్పష్టం చేసింది.
అలాగే ఆస్తుల పునరుద్ధరణ జరిగిందనే కారణంతో క్రిమినల్ విచారణను నిలిపివేయాల్సిన అవసరం లేదని పేర్కొంది.
వివరాలు
2016 నుంచి భారత్కు దూరంగా మాల్యా
విజయ్ మాల్యా 2016 నుంచి భారత్కు తిరిగి రాకుండా విదేశాల్లోనే ఉంటున్నారని ఈడీ కోర్టుకు గుర్తుచేసింది.
2019లో ఆయనను 'పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడు'గా ప్రకటించిన విషయాన్ని ప్రస్తావించింది.
ఇప్పటివరకు క్రిమినల్ కోర్టు అధికార పరిధికి మాల్యా లొంగలేదని తెలిపింది.
ఈ పరిస్థితుల్లో భారత్కు తిరిగి రావాలన్న ఉద్దేశం తనకు ఉందా? లేదా? అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేయాలని బాంబే హైకోర్టు మాల్యాకు తుది అవకాశం ఇచ్చింది.
ఈ కేసుకు సంబంధించిన పిటిషన్పై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.