Page Loader
Whatsapp Payment: త్వరలో దేశవ్యాప్తంగా అందుబాటులోకి వాట్సప్‌ పేమెంట్‌.. పరిమితిని ఎత్తేసిన ఎన్‌పీసీఐ
త్వరలో దేశవ్యాప్తంగా అందుబాటులోకి వాట్సప్‌ పేమెంట్‌

Whatsapp Payment: త్వరలో దేశవ్యాప్తంగా అందుబాటులోకి వాట్సప్‌ పేమెంట్‌.. పరిమితిని ఎత్తేసిన ఎన్‌పీసీఐ

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 01, 2025
08:51 am

ఈ వార్తాకథనం ఏంటి

వాట్సాప్‌లో ఇప్పుడు అందరికీ నగదు బదిలీ చేసే వెసులుబాటు అందుబాటులోకి రానుంది. ఇప్పటివరకు కేవలం కొందరు యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ సదుపాయం, దేశవ్యాప్తంగా అందరికీ లభించనుంది. భారత్‌లో టెక్స్ట్ మెసేజ్‌లు, ఫోటోలు, ఆడియోలు, వీడియోలు షేర్ చేయడంలో అగ్రగామి సామాజిక మాధ్యమంగా ఉన్న వాట్సాప్, ఇప్పుడు పేమెంట్ యాప్‌గా కూడా ఎదగడానికి మంచి అవకాశాలను పొందింది. దేశంలోని ఆన్‌లైన్ చెల్లింపులను పర్యవేక్షించే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) గతంలో 10 కోట్ల యూజర్లకు మాత్రమే వాట్సాప్ పేమెంట్స్ ఆప్షన్ అందుబాటులో ఉంచింది.

వివరాలు 

85 శాతం గూగుల్ పే, ఫోన్‌పే యాప్‌ల ద్వారానే యూపీఐ లావాదేవీలు

తాజాగా, ఈ పరిమితిని ఎత్తివేయడంతో, వాట్సాప్ యూజర్లు అందరూ ఇప్పుడు నగదు బదిలీ సేవలను వినియోగించుకోవచ్చు. "వాట్సాప్ పే" అనేది దీనికి సంబంధించి అధికారికంగా నోటిఫికేషన్ ఇచ్చింది. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) చెల్లింపుల విస్తరణను దృష్టిలో ఉంచుకుని, 2020లో కేవలం 4 కోట్ల మంది యూజర్లకు ఈ సదుపాయం ఇచ్చారు. తర్వాత, 10 కోట్లకు విస్తరించారు. డిజిటల్ చెల్లింపుల విస్తృతిని గమనించి, ఎన్‌పీసీఐ ఈ పరిమితిని పూర్తిగా ఎత్తేసింది. భారత్‌లో యూపీఐ లావాదేవీలు క్షణక్షణం పెరుగుతున్నాయి. నెలకు 1300 కోట్ల లావాదేవీలు జరగుతుండగా, వాటిలో 85 శాతం గూగుల్ పే, ఫోన్‌పే యాప్‌ల ద్వారానే జరుగుతున్నాయి. వాట్సాప్‌ను 50 కోట్ల మంది వినియోగించుకుంటున్నారు.

వివరాలు 

వాట్సాప్ మాతృసంస్థ మెటాకు పెద్ద ప్రయోజనం

ఇంతటి విస్తృత యూజర్ బేస్ ఉన్న వాట్సాప్,యూపీఐ సేవలను మరింత విస్తరిస్తే, దేశంలో అగ్రగామి పేమెంట్ యాప్‌గా ఎదగనుంది. దీనివల్ల వాట్సాప్ మాతృసంస్థ మెటాకు పెద్ద ప్రయోజనం కలగనుంది. తాజాగా, మెటా తమ కొత్త కృత్రిమ మేథోపాయాన్ని కూడా అందుబాటులోకి తెచ్చింది,దీనికి భారత్‌లో మంచి ఆదరణ లభించింది. వాట్సాప్ పే యూపీఐ సేవల కోసం థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్, భారతీయ బ్యాంకుల సమాఖ్య సంయుక్తంగా ఎన్‌పీసీఐ ద్వారా యూపీఐ చెల్లింపుల వ్యవస్థను నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు భారత డిజిటల్ చెల్లింపుల రంగంలో గూగుల్ పే, ఫోన్‌పే కీలక పాత్ర పోషించినా, వాట్సాప్ తన స్థానం మునుపటి కంటే మరింత బలోపేతం చేసుకునే అవకాశం ఉంది.