Loading...
UPI Transaction: యూపీఐపై ఎండీఆర్‌ ఇప్పుడే కాదు.. ఆర్‌బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు
యూపీఐపై ఎండీఆర్‌ ఇప్పుడే కాదు.. ఆర్‌బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు

UPI Transaction: యూపీఐపై ఎండీఆర్‌ ఇప్పుడే కాదు.. ఆర్‌బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 05, 2026
03:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్‌) విధింపుపై ఇప్పుడే ఎలాంటి తుది నిర్ణయానికి రావడం సరైనది కాదని ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టం చేశారు. డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను సమర్థంగా నిర్వహించాలంటే దానికి అయ్యే వ్యయాన్ని ఎవరో ఒకరు భరించాల్సిందేనని, అయితే ఆ భారం నేరుగా సాధారణ వినియోగదారులపై పడుతుందని ఇప్పుడే చెప్పడం సరికాదన్నారు. ద్రవ్య విధాన సమీక్ష అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన మల్హోత్రా.. యూపీఐపై ఎండీఆర్‌ అమలు అంశం ప్రస్తుతం ప్రారంభ దశలోనే ఉందని తెలిపారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ ప్రక్రియను కొనసాగిస్తోందని, తుది నిర్ణయం వెలువడే వరకు వేచి చూడాల్సిందేనని చెప్పారు.

వివరాలు 

నిర్వహణ వ్యయాన్ని ఎవరో ఒకరు భరించాల్సిందేనన్న ఆర్‌బీఐ గవర్నర్

వ్యవస్థ నిర్వహణకు అయ్యే ఖర్చు తప్పదని,ఆ వ్యయాన్ని ఏదో ఒక వర్గం భరించాల్సి ఉంటుందని ఆయన వివరించారు.

అయితే ఆ మొత్తం నేరుగా వినియోగదారుల నుంచే వసూలు చేస్తారని భావించడం సరికాదన్నారు.

పరోక్షంగా ఆర్థిక వ్యవస్థ ద్వారానే ఆ వ్యయం భరించే అవకాశం కూడా ఉందని పేర్కొన్నారు.

ఇటీవల పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్'చట్ట సవరణ బిల్లు ద్వారా యూపీఐ,రూపే వంటి డిజిటల్ చెల్లింపు విధానాలపై భవిష్యత్తులో ఎండీఆర్‌ విధించే అవకాశానికి చట్టపరమైన వెసులుబాటు కల్పించాలని ప్రతిపాదించింది.

ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టం ప్రకారం ప్రభుత్వం నోటిఫై చేసిన డిజిటల్ చెల్లింపు విధానాలపై బ్యాంకులు లేదా చెల్లింపు సేవల సంస్థలు ఎండీఆర్‌ను వసూలు చేసే అవకాశం లేదు.

వివరాలు 

రోజువారీ యూపీఐ వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు 

అయితే ప్రతిపాదిత సవరణ అమల్లోకి వస్తే ఏ డిజిటల్ చెల్లింపు విధానాలపై ఛార్జీలు విధించాలి, ఏ వాటికి మినహాయింపు ఇవ్వాలనే అంశాన్ని ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా నిర్ణయించే అధికారం పొందుతుంది.

ఇదిలా ఉండగా, రోజువారీ యూపీఐ వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఇప్పటికే స్పష్టం చేశాయి.

ప్రస్తుతం పరిశీలనలో ఉన్న ప్రతిపాదన ప్రకారం రూ.2,000కు మించిన వ్యాపార లావాదేవీలపై మాత్రమే ఎండీఆర్‌ విధించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం.

పాలు, కూరగాయలు, కిరాణా వంటి చిన్న మొత్తాల యూపీఐ చెల్లింపులు యథావిధిగా ఉచితంగానే కొనసాగించే అవకాశముందని పేర్కొన్నాయి.

ADVERTISEMENT

వివరాలు 

కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు 

ప్రస్తుతం క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డుల ద్వారా జరిగే లావాదేవీలపై ఎండీఆర్‌ అమల్లో ఉన్నప్పటికీ, ఎక్కువ సందర్భాల్లో ఆ వ్యయాన్ని వ్యాపారులే భరిస్తున్నారు.

యూపీఐ విషయంలో కూడా తుది విధానం ఎలా ఉండాలనే అంశంపై కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, అలాగే ఆర్‌బీఐ కూడా ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రతిపాదన ప్రకటించలేదని గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టం చేశారు.

ADVERTISEMENT