పుష్ప ఫేమ్ జగదీష్ ప్రతాప్ నటించిన సత్తిగాని రెండెకరాలు టీజర్ రిలీజ్
పుష్ప సినిమాల్లో అల్లు అర్జున్ స్నేహితుడిగా కేశవ పాత్రలో నటించిన జగదీష్ ప్రతాప్, ఆ సినిమాతో ఎంతో పేరు తెచ్చుకున్నాడు. అంతకుముందు మల్లేశం సినిమాలో కనిపించినా పెద్దగా పేరు రాలేదు. పుష్ప మూవీతో జగదీష్ రాత మారిపోయిందని చెప్పవచ్చు. ప్రస్తుతం జగదీష్ ప్రతాప్ ప్రధాన పాత్రలో ఒక మూవీ రిలీజవుతోంది. అయితే థియేటర్లలో కాదు, ఓటీటీలో. అది కూడా మైత్రీ మూవీస్ నిర్మాతలుగా కావడం విశేషం. అవును, ఆహాలో సత్తిగాని రెండెకరాలు పేరుతో సినిమా వస్తోంది. ఆహా ఒరిజినల్ గా వస్తున్న ఈ చిత్ర టీజర్ రిలీజైంది. సత్తి పాత్రలో కనిపించిన జగదీష్ కి డబ్బు అవసరం పడుతుంది. దానికోసం తన పొలం అమ్మాలని డిసైడ్ అవుతాడు.
పొలంలో మర్డర్, హంతకుడి కోసం గాలింపు
డబ్బుల కోసం పొలం అమ్మాలని అనుకుంటుండగా, అనుకోకుండా తన పొలంలో ఎవరిదో హత్య జరుగుతుంది? ఆ హత్య ఎవరు చేసారు? ఎందుకు చేసారు? అన్నదే కథ అని టీజర్ ద్వారా అర్థమవుతోంది. కమెడియన్స్ ఎక్కువగానే ఉన్నా ఇది పూర్తి కామెడీ చిత్రంలా అనిపించట్లేదు. డార్క్ కామెడీ జోనర్ లో రూపొందినట్లుగా అర్థమవుతోంది. జగదీష్ ప్రతాప్ తో పాటు వెన్నెల కిషోర్, బిత్తిరి సత్తి, రియాజ్ ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇంకా, మోహన శ్రీ సురాగ, అనీష ధర్మ ఉన్నారు. అభినవ్ దండు దర్శకత్వం వహించిన ఈ మూవీ, మార్చ్ 17వ తేదీన ఆహాలోకి అందుబాటులోకి వస్తుంది. మరి జగదీష్ ప్రతాప్ కి ఓటీటీ ద్వారా హిట్ లభిస్తుందా లేదా చూడాలి.