Page Loader
Arjun S/o Vyjayanthi teaser: వైజాగ్‌ను శాసించేది పోలీస్ బూట్లు,నల్ల కోట్లు కాదు.. కళ్యాణ్ రామ్ సినిమా టీజర్ ఎలా ఉందంటే?

Arjun S/o Vyjayanthi teaser: వైజాగ్‌ను శాసించేది పోలీస్ బూట్లు,నల్ల కోట్లు కాదు.. కళ్యాణ్ రామ్ సినిమా టీజర్ ఎలా ఉందంటే?

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 17, 2025
11:52 am

ఈ వార్తాకథనం ఏంటి

నందమూరి కళ్యాణ్ రామ్,విజయశాంతి తల్లీకొడుకులుగా నటించిన భారీ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి'. ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు. విడుదలైన టీజర్ చూస్తుంటే, ఈ చిత్రంలో తల్లీకొడుకుల పాత్రల మధ్య ముఖ్యమైన భావోద్వేగ సంబంధాలు ఉంటాయని స్పష్టమవుతోంది. సోమవారం ఈ చిత్ర టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఇంతకు ముందు వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్, హీరో కళ్యాణ్ రామ్, ఆయన మదర్ రోల్ చేసిన విజయశాంతి లుక్స్, ప్రీ టీజర్ సినిమాపై స్ట్రాంగ్ ఇంపాక్ట్‌‌ని క్రియేట్ చేయగా.. ఇప్పుడు వచ్చిన టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది.

వివరాలు 

టీజర్ విశేషాలు 

"10 సంవత్సరాల నా కెరీర్‌లో ఇలాంటి ఎన్నో ఆపరేషన్స్. కానీ, చావుకు ఎదురెళుతున్న ప్రతిసారి, నా కళ్ల ముందు కనిపించే ముఖం నా కొడుకు అర్జున్'' అని రాములమ్మ వాయిస్‌తో ప్రారంభమైన ఈ టీజర్, ప్రేక్షకులను ఆకట్టుకునేలా కట్ చేశారు. సినిమా పేరు 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' అయినప్పటికీ, టీజర్‌లో మాత్రం 'అర్జున్ సన్నాఫ్ విశ్వనాథ్' అని ఉండటం ఆసక్తికరంగా మారింది. విజయశాంతి కళ్యాణ్ రామ్‌కు పోలీస్ యూనిఫాం అందించేటప్పుడు, దానిపై "అర్జున్ విశ్వనాథ్" అని కనిపించడం, సినిమా కథలో ప్రధాన మలుపు ఉందని చూపిస్తుంది.

వివరాలు 

ఇంటెన్స్ యాక్షన్, పవర్‌ఫుల్ డైలాగ్స్ 

ఈ టీజర్‌లో ప్రతినాయకుల పరిచయం ఒక్కసారిగా తీవ్రతను పెంచింది. పృథ్వీ పోలీస్ వ్యవస్థ గురించి చెప్పే డైలాగ్ తర్వాత భీకరమైన పోరాట దృశ్యాలు ప్రారంభమవుతాయి. "రేపటి నుంచి వైజాగ్‌ని పోలీస్ బూట్లు, నల్ల కోట్లు కాదు.. ఈ అర్జున్ విశ్వనాథ్ కనుసైగ శాసిస్తుంది!" అని కళ్యాణ్ రామ్ చెప్పే ఈ డైలాగ్ మాస్ ప్రేక్షకులకు పండగే అనిపిస్తుంది. అంతే కాదు, రాములమ్మ పాత్రలోని మరో కోణాన్ని చూపించేలా - "నేను డ్యూటీలో ఉన్నా, లేకున్నా... చచ్చింది శత్రువైనా, చంపింది బంధువైనా... నా కళ్ల ముందు నేరం జరిగితే వదిలిపెట్టే ప్రసక్తే లేదు!" - అని విజయశాంతి చెప్పే డైలాగ్ టీజర్ హైలైట్‌గా నిలిచింది.

వివరాలు 

సినిమాపై పెరుగుతున్న అంచనాలు 

కథను పూర్తిగా బయటపెట్టకుండా, టీజర్‌ను ఆసక్తికరంగా కట్ చేయడం, యాక్షన్, డైలాగ్స్, భావోద్వేగ దృశ్యాలు బలంగా నిలవడం ఈ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. అజనీస్ లోక్‌నాథ్ అందించిన నేపథ్య సంగీతం, రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి ప్రధాన హైలైట్స్. కథానాయికగా సాయి మంజ్రేకర్ నటిస్తుండగా, శ్రీకాంత్ విస్సా కథను అందించారు. ఈ అద్భుతమైన యాక్షన్ ఎంటర్‌టైనర్ ఈ వేసవిలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నిర్మాణ సంస్థ చేసిన ట్వీట్