58ఏళ్ల వయసులో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సిద్ధూ మూసేవాలా తల్లి
దివంగత పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా ఇంట్లో ఆనందం వెల్లివిరిసింది. సిద్ధూ మూసేవాలా తల్లి చరణ్కౌర్ 58ఏళ్ల వయసులో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. తమ చిన్నారి కొడుకు చిత్రాన్ని సిద్ధూ మూసేవాలా తండ్రి బల్కౌర్ సింగ్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ఆ ఫొటోకు క్యాప్షన్గా బల్కౌర్ సింగ్ ఇలా రాసుకొచ్చారు. 'శుభదీప్ (సిద్ధూ )ని ప్రేమించే లక్షలాది మంది ప్రజల ఆశీర్వాదంతో దేవుడు మనకు శుభ్ తమ్ముడిని ఇచ్చాడు. మమ్మల్ని ప్రేమించిన శ్రేయోభిలాషులందరికీ కృతజ్ఞతలు' అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు అభిమానులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
సిద్ధూ ఎప్పుడు చనిపోయాడు?
సిద్ధూ మూసేవాలా ప్రముఖ పంజాబీ గాయకుడు. అతనికి దేశవ్యాప్తంగా చాలా బలమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సిద్ధూ 29 మే 2022న కాల్చి చంపబడ్డాడు. సిద్ధూను తామే చంపినట్లు గ్యాంగ్స్టర్లు లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్ ప్రకటించారు. అతను చనిపోయి రెండేళ్లవుతున్నా.. ఇప్పటికీ అభిమానులు ఆయన్ను మరిచిపోలేకపోతున్నారు. సిద్ధూ తన తల్లిదండ్రులకు ఒక్కడే సంతానం. దీంతో అతను చనిపోవడంతో తల్లిదండ్రులు డిప్రెషన్లోకి వెళ్లారు. సిద్ధూ మూసేవాలా జ్ఞాపకాల నుంచి బయటపడేందుకు ఆయన తల్లితండ్రులు IVF టెక్నిక్ ద్వారా మళ్లీ తల్లిదండ్రులు కావాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో 58 సంవత్సరాల వయస్సులో.. చరణ్ కౌర్ ఒక కొడుకుకు జన్మనిచ్చింది.