Salman Khan : మోసం ఆరోపణల కేసు.. సల్మాన్ ఖాన్, అల్విరా ఖాన్కు కోర్టు సమన్లు
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మరోసారి న్యాయపరమైన వివాదంలో చిక్కుకున్నారు. 'బీయింగ్ హ్యూమన్' జ్యువెలరీ షోరూమ్ పేరుతో పెట్టుబడిదారుడిని మోసం చేశారనే ఆరోపణలపై నమోదైన కేసులో సల్మాన్ ఖాన్తో పాటు ఆయన సోదరి అల్విరా ఖాన్కు చండీగఢ్ జిల్లా కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి అక్టోబర్ 5న కోర్టు ఎదుట వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది. అలాగే ఈ వ్యవహారంలో భాగమైన 'స్టైల్ అండ్ కంటెంట్ జ్యువెలరీ ప్రైవేట్ లిమిటెడ్' సంస్థ డైరెక్టర్లకు కూడా సమన్లు పంపింది. చండీగఢ్కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ గుప్తా దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగానే కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
వివరాలు
అభివృద్ధి పనుల కోసం రూ.కోటి ఖర్చు..
ఫిర్యాదు వివరాల ప్రకారం.. చండీగఢ్లోని మణిమజ్రా ప్రాంతంలో 'బీయింగ్ హ్యూమన్' జ్యువెలరీ షోరూమ్ ఏర్పాటు చేయాలని కంపెనీ ప్రతినిధులు ఇచ్చిన హామీలను నమ్మి తాను సుమారు రూ.3 కోట్ల వరకు పెట్టుబడి పెట్టినట్లు అరుణ్ గుప్తా తెలిపారు.
ఇందులో షోరూమ్ అభివృద్ధి పనుల కోసం మాత్రమే రూ.1 కోటి వెచ్చించినట్లు పేర్కొన్నారు.
ఒప్పందంలో ఉన్న అన్ని నిబంధనలను తాను పూర్తిగా పాటించినప్పటికీ, షోరూమ్ ప్రారంభమైన తర్వాత కంపెనీ నుంచి ఎలాంటి వ్యాపార సహకారం అందలేదని ఆరోపించారు.
వివరాలు
అక్టోబర్ 5కు కోర్టు వాయిదా..
అంతేకాకుండా, 2020 ఫిబ్రవరి నుంచి నగల సరఫరా చేసే ప్రధాన స్టోర్ మూతపడటంతో వ్యాపారం తీవ్రంగా దెబ్బతిని భారీ ఆర్థిక నష్టం వాటిల్లిందని ఫిర్యాదులో వెల్లడించారు.
మరోవైపు, ఈ ఆరోపణలను సంబంధిత సంస్థ గతంలోనే ఖండించింది.
2018లో స్థానిక వ్యాపారవేత్తతో కుదిరిన ఒప్పందంలో సల్మాన్ ఖాన్కు ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేదని అప్పట్లో స్పష్టం చేసింది.
ఈ కేసుపై తదుపరి విచారణను అక్టోబర్ 5కు కోర్టు వాయిదా వేసింది.