chiranjeevi punadhirallu:'పునాది రాళ్లు' షూటింగ్ అనుభవాన్ని పంచుకున్న మెగాస్టార్
ఈ వార్తాకథనం ఏంటి
తన నటన, నృత్యం, పోరాట సన్నివేశాలతో తెలుగువారి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న అగ్ర కథానాయకుడు చిరంజీవి. 70 ఏళ్ల వయసులోనూ యువ హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా స్క్రీన్ఫై అదరగొడుతున్నారు. దీనికి నిదర్శనమే ఇటీవల విడుదలైన 'మన శంకరవరప్రసాద్గారు' చిత్రం. చిరంజీవి నటించిన తొలి చిత్రం 'పునాది రాళ్లు' అయినప్పటికీ, వెండితెరపై ఆయనను ప్రేక్షకులు తొలిసారి చూసింది 'ప్రాణం ఖరీదు' సినిమా ద్వారానే. 'పునాది రాళ్లు' చిత్రానికి తొలిసారి కెమెరా ముందు నిలిచిన సందర్భాన్ని చిరంజీవి తాజాగా గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఎక్స్ వేదికగా భావోద్వేగభరితమైన పోస్ట్ను పంచుకున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
చిరంజీవి చేసిన ట్వీట్
ఈరోజు “పునాదిరాళ్లు” సినిమా కోసం జీవితంలో కెమెరా ముందు నిలిచిన తొలి రోజు.
— Chiranjeevi Konidela (@KChiruTweets) February 11, 2026
ఆ రోజు నాలో కలిగిన ఆత్రుత, ఆనందం, బాధ్యత, భావోద్వేగం మాటల్లో వర్ణించలేనిది. ఆ క్షణం ఇప్పటికీ నిన్న, మొన్న జరిగిందేమో అన్నట్టు అనిపిస్తుంది.
ఒక అందమైన చందమామ కథ లాంటి అనుభూతి.
ఈ ప్రత్యేక సందర్భంలో, నాకు… pic.twitter.com/Rsc6UYmgiK
వివరాలు
చిరు ఆలోచన మెచ్చుకున్న కెమెరామెన్..
"1978 ఫిబ్రవరి 11న 'పునాది రాళ్లు' సినిమా కోసం నేను మొదటిసారి కెమెరా ముందుకు వచ్చాను. ఆ రోజు ఒక సన్నివేశం చిత్రీకరించాల్సి ఉంది. స్నేహితులంతా నీటి తొట్టివద్ద కాళ్లు కడుక్కొని భోజనానికి వెళ్లే సీన్ అది. ఆ సన్నివేశంలో 'మహానటి' సావిత్రి గారు మాకు అన్నం వడ్డిస్తారు. అందరినీ వరుసలో నిలబడమని చెప్పారు. కెమెరామెన్గా పీఎస్ నివాస్ గారు ఉన్నారు. ఆ సీన్లో పాల్గొన్నవారిలో నేను చివరి వ్యక్తిని. మిగతావాళ్ల సీన్ పూర్తయ్యే వరకు నేను అక్కడే నిలబడి ఉండాల్సి వచ్చింది. అయితే, ఏ కారణమో తెలియదు కానీ నాకు కొద్దిగా అసౌకర్యంగా అనిపించింది.
వివరాలు
పొలంలో గడ్డి కోసి వస్తారు
దాంతో అక్కడే ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్ వద్దకు వెళ్లి, 'ఈ సన్నివేశానికి ముందు మనం ఏ పని చేసి వస్తాం?' అని అడిగాను. అందుకు ఆయన, 'పొలంలో గడ్డి కోసి వస్తారు' అని చెప్పారు. అప్పుడు సమీపంలోనే ఒక గడ్డివాము కనిపించింది. అక్కడి నుంచి కొద్దిగా గడ్డిని తీసుకుని ఒంటిపై వేసుకుని వచ్చాను. షాట్ రెడీ అనగానే సీన్లోకి వెళ్లాను. కెమెరా రన్ అవుతుండగా, నేను ఒంటిపై వేసుకున్న గడ్డిని తీస్తూ నటించాను. అది గమనించిన కెమెరామెన్ నన్ను పిలిచి పేరు అడిగారు. నేను 'చిరంజీవి' అని చెప్పాను. అప్పుడాయన, 'ముందు సన్నివేశం ఏమిటో తెలుసుకుని, దానికి తగ్గట్టుగా ఈ సీన్లో నువ్వు చేసిన ప్రయత్నం నాకు చాలా నచ్చింది' అని ప్రశంసించారు.
వివరాలు
నిజాయితీగా ప్రయత్నిస్తే.. ఒక ప్రత్యేక గుర్తింపు తప్పకుండా ఉంటుంది
ఆ మాటలు నాకు అపారమైన ఉత్సాహాన్ని ఇచ్చాయి. అప్పటి నుంచీ ప్రతి సినిమాలో నా పాత్ర పరిధిలో నేను ఏమి చేయగలను, ఎలా కనిపించగలను అనే విషయాలపై ఆలోచిస్తూ వస్తున్నాను. అలా నిజాయితీగా ప్రయత్నిస్తే చాలు. మనం ముందు వరుసలో ఉన్నా, వెనుక వరుసలో ఉన్నా—మనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తప్పకుండా ఉంటుంది" అని చిరంజీవి తన అనుభవాన్ని పంచుకున్నారు.