Virat Kohli One8: పాక్ క్రికెటర్ల కాళ్లకు కోహ్లీ బ్రాండ్.. వన్8 బూట్ల వెనుక అసలు కారణమేంటి?
ఈ వార్తాకథనం ఏంటి
మహిళల ఆసియా కప్లో పాకిస్థాన్ స్పిన్నర్ నాష్రా సంధు అద్భుత ప్రదర్శనతో సంచలనం సృష్టించింది. హాంకాంగ్పై జరిగిన మ్యాచ్లో కేవలం 7పరుగులు ఇచ్చి ఏకంగా ఆరు వికెట్లు పడగొట్టి పాక్ జట్టుకు ఘన విజయాన్ని అందించింది. అయితే ఆమె బౌలింగ్ ఎంతగా చర్చనీయాంశమైందో.. నాష్రా ధరించిన బూట్లు కూడా అంతే హాట్ టాపిక్గా మారాయి. భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీకి చెందిన వన్8 బ్రాండ్ బూట్లతో పాక్ మహిళా క్రికెటర్లు కనిపించడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మహిళల ఆసియా కప్ గ్రూప్-ఎ మ్యాచ్లో హాంకాంగ్ చైనాతో తలపడిన పాకిస్థాన్ 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో పాక్ జట్టు సెమీఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకుంది.
వివరాలు
నెటిజన్ల దృష్టిని ఆకర్షించిన వన్8 బూట్లు
ఈ మ్యాచ్లో ఎడమచేతి వాటం స్పిన్నర్ నాష్రా సంధు కేవలం 7 పరుగులే ఇచ్చి ఆరు వికెట్లు తీసుకుంది. దీంతో హాంకాంగ్ బ్యాటింగ్ ఆర్డర్ పూర్తిగా కుప్పకూలింది.
టీ20 కెరీర్లో నాష్రాకు ఇదే అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన కావడం విశేషం. నాష్రా సంధు తన సంచలన బౌలింగ్ గణాంకాలతో వార్తల్లో నిలవడంతో పాటు.. తాను ధరించిన షూస్తోనూ అందరి దృష్టిని ఆకర్షించింది.
భారత క్రికెట్ ఐకాన్ విరాట్ కోహ్లీ భాగస్వామ్యంతో రూపొందిన వన్8 స్పోర్ట్స్వేర్ బ్రాండ్కు చెందిన బూట్లను ఆమె ధరించి మైదానంలోకి దిగింది.
నాష్రా ఒక్కరే కాకుండా పాకిస్థాన్ జట్టులోని పలువురు మహిళా క్రికెటర్లు కూడా ఇదే బ్రాండ్ బూట్లతో కనిపించారు.దీంతో అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లోనూ ఈ అంశంపై చర్చ మొదలైంది.
వివరాలు
క్రీడా ప్రపంచంలో విస్తరిస్తున్న కోహ్లీ బ్రాండ్
విరాట్ కోహ్లీ సహ భాగస్వామిగా ఉన్న వన్8 బ్రాండ్ తొలుత లైఫ్స్టైల్, దుస్తుల ఉత్పత్తులకే పరిమితమైంది.
ప్రస్తుతం క్రీడాకారులకు అవసరమైన ప్రొఫెషనల్ గేర్ను కూడా ఈ బ్రాండ్ తయారు చేస్తోంది.
అగిలిటాస్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ సంస్థ క్రికెటర్ల కోసం ప్రత్యేకంగా 'సీమ్', 'కవర్ డ్రైవ్' పేర్లతో షూస్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఈ ఉత్పత్తుల డిజైనింగ్లో కోహ్లీ స్వయంగా భాగస్వామి కావడంతో వీటికి ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తున్నట్లు తెలుస్తోంది.
వివరాలు
సెమీఫైనల్పై పాక్ దృష్టి
హాంకాంగ్పై సాధించిన భారీ విజయంతో పాకిస్థాన్ సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. సెప్టెంబర్ 11న జరిగే సెమీఫైనల్లో శ్రీలంకతో పాక్ తలపడనుంది.
నాష్రా సంధు వేసిన సంచలన స్పెల్తో పాటు జట్టు సమష్టి ప్రదర్శనపై పాక్ నమ్మకంగా ఉంది. నాకౌట్ మ్యాచ్లోనూ అదే జోరును కొనసాగించి విజయం సాధించి ఫైనల్కు చేరుకోవాలని భావిస్తోంది.
మైదానంలో భారత్, పాకిస్థాన్ మధ్య పోటీ ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ.. క్రీడా పరికరాలు, బ్రాండ్ల విషయంలో ఆటగాళ్లు నాణ్యత, సౌకర్యానికే ప్రాధాన్యం ఇస్తారనడానికి ఈ ఘటన ఉదాహరణగా నిలిచింది.
అయితే పాక్ మహిళా క్రికెటర్లు ఈ బూట్లను కేవలం ఆటలో సౌకర్యం కోసం మాత్రమే ఎంచుకున్నారా? లేక దీని వెనుక మరేదైనా కారణం ఉందా? అనే చర్చ కూడా జరుగుతోంది.