Manipur: దిల్లీలో మణిపురి సంగీత కళాకారుడి దారుణ హత్య.. ఎనిమిది మంది అరెస్ట్
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీలో ఇంటి బయట జరుగుతున్న గోల, అరుపులపై అభ్యంతరం వ్యక్తం చేసిన 54 ఏళ్ల మణిపురి సంగీత కళాకారుడు చోంగ్తామ్ విక్రమ్ సింగ్ దాడిలో మృతి చెందారు. ఆగ్నేయ దిల్లీలోని కిలోకరి గ్రామంలో ఆయన నివాసం ఉంటున్నారు. ఇంటి బయట పనిచేస్తున్న డెలివరీ సిబ్బంది,ధాబా సిబ్బందితో జరిగిన వివాదం చివరకు దాడికి దారితీసినట్లు పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన సింగ్ను హోలీ ఫ్యామిలీ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందారు. సింగ్ తన ఇంటి బయట కొందరు గట్టిగా అరుస్తూ, ఇబ్బంది కలిగిస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేసినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ క్రమంలో మొదలైన వాగ్వాదం తీవ్రరూపం దాల్చి దాడికి దారితీసినట్లు తెలుస్తోంది.
వివరాలు
పోలీసులు అదుపులో బాలుడు,మరో ఏడుగురు అరెస్టు
దాడిలో తీవ్రంగా గాయపడిన సింగ్ను ఆసుపత్రికి తరలించినప్పటికీ.. ఆయన పరిస్థితి విషమంగా మారి ప్రాణాలు కోల్పోయారు.
ఘటనపై హత్యకు సంబంధించిన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ కేసులో ఏడుగురుని అరెస్టు చేయడంతో పాటు ఓ బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
దాడి జరిగిన సమయంలో అసలు ఏం జరిగింది? ఇందులో ఎవరి పాత్ర ఎంత ఉంది? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను కూడా పోలీసులు సేకరించినట్లు సింగ్ బంధువు తెలిపారు.
వివరాలు
కొవ్వొత్తుల ప్రదర్శన
సింగ్ మృతి నేపథ్యంలో దిల్లీలో మణిపూర్కు చెందిన పలువురు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు.
ఆయనపై స్థానికులు అత్యంత దారుణంగా దాడి చేశారని బంధువు ఆరోపించారు.
దాడి తర్వాత సింగ్ కదల్లేని పరిస్థితిలో ఉన్నారని, ఆసుపత్రికి తరలించే సమయానికి ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉందని చెప్పారు.
ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత వైద్యులు సింగ్ పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని తెలిపినట్లు బంధువు వెల్లడించారు.
వైద్యులు పలుమార్లు సీపీఆర్ చేసిన తర్వాత కొద్దిసేపు శ్వాస తీసుకున్నప్పటికీ.. ఆ తర్వాత రక్త ప్రసరణ, గుండె పనితీరు క్రమంగా క్షీణించాయని చెప్పారు.
చివరకు ఉదయం 6.52 గంటలకు సింగ్ మృతి చెందినట్లు ఆయన భార్య నుంచి సమాచారం అందిందని తెలిపారు.
వివరాలు
దర్యాప్తు చేస్తున్న దిల్లీ పోలీసులు
ఈ ఘటనపై బంధువు జాతివివక్ష అంశాన్ని కూడా ప్రస్తావించారు.
ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ప్రజలపై జరుగుతున్న వివక్ష, దాడులకు ముగింపు పలికి తమకు న్యాయం చేయాలని ఆమె కోరారు.
తాము భారత పౌరులమని, ఇలాంటి దాడుల నుంచి రక్షణ, న్యాయం కావాలని అన్నారు.
అయితే ఈ ఘటన వెనుక జాతివివక్షే కారణమన్న ఆరోపణలు ఇప్పటివరకు పోలీసుల దర్యాప్తులో నిర్ధారణ కాలేదు.
దాడికి దారితీసిన కారణాలు, నిందితుల పాత్ర, ఘటనకు సంబంధించిన ఇతర పరిస్థితులపై దర్యాప్తు చేస్తున్నట్లు దిల్లీ పోలీసులు తెలిపారు.
వివరాలు
స్పందించిన ఏబీవీపీ
సింగ్ మృతిపై అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) కూడా స్పందించింది.
మణిపూర్కు చెందిన పౌరుడైన చోంగ్తామ్ విక్రమ్ సింగ్ దారుణంగా హత్యకు గురికావడాన్ని తీవ్రంగా ఖండించింది.
ఎలాంటి వివాదమైనా ఇలాంటి హింసను సమర్థించలేదని పేర్కొంది.
కేసులో నిష్పక్షపాతంగా, నిర్ణీత గడువులో దర్యాప్తు పూర్తి చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
బాధితుడి కుటుంబానికి పూర్తి న్యాయం చేయాలని కోరింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.