Loading...
Junior Asia Cup Hockey: చివరి నిమిషంలో గోల్‌.. ఓటమిని తప్పించుకున్న భారత్
చివరి నిమిషంలో గోల్‌.. ఓటమిని తప్పించుకున్న భారత్

Junior Asia Cup Hockey: చివరి నిమిషంలో గోల్‌.. ఓటమిని తప్పించుకున్న భారత్

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 07, 2026
09:11 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌ పురుషుల జట్టు జూనియర్‌ ఆసియా కప్‌లో జపాన్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో చివరి నిమిషంలో గోల్‌ చేసి ఓటమి నుంచి బయటపడింది. మరోవైపు మహిళల జట్టు మలేసియాపై ఏకపక్ష ఆధిపత్యంతో 11-1 తేడాతో ఘన విజయం సాధించి టోర్నీలో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది.

వివరాలు

పురుషుల జట్టుకు ఉత్కంఠభరిత డ్రా

జూనియర్‌ ఆసియా కప్‌ హాకీ టోర్నీలో భారత పురుషుల జట్టు జపాన్‌తో మ్యాచ్‌ను 3-3తో డ్రాగా ముగించింది.

తొలి మ్యాచ్‌లో ఇండోనేసియాను 14-0తో చిత్తు చేసిన భారత్‌.. ఆదివారం పూల్‌-ఎలో జపాన్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో మాత్రం చివరి నిమిషం వరకు పోరాడాల్సి వచ్చింది.

మ్యాచ్‌ ఆరంభంలో భారత్‌ ఆధిపత్యం ప్రదర్శించింది. నాలుగో నిమిషంలో లభించిన పెనాల్టీ స్ట్రోక్‌ను కెప్టెన్‌ అన్మోల్‌ గోల్‌గా మలచడంతో భారత్‌ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.

పదో నిమిషంలో అషు మౌర్య పెనాల్టీ కార్నర్‌ను సద్వినియోగం చేసుకుని భారత్‌ ఆధిక్యాన్ని 2-0కు పెంచాడు.

వివరాలు

ఇరు జట్లు గోల్స్ కోసం తీవ్రంగా పోటీ పడ్డాయి

అయితే ఆ వెంటనే జపాన్‌ పుంజుకుంది. 11వ నిమిషంలో రయుషిన్‌ ససాకి గోల్‌ చేయడంతో ఆ జట్టు 1-2తో నిలిచింది.

ఆ తర్వాత రెండో, మూడో క్వార్టర్లలో ఇరు జట్లు గోల్స్‌ కోసం తీవ్రంగా ప్రయత్నించినా ఫినిషింగ్‌లో విఫలమయ్యాయి.

ఆఖరి క్వార్టర్‌లో మ్యాచ్‌ పూర్తిగా ఉత్కంఠగా మారింది. 48వ నిమిషంలో జపాన్‌ కెప్టెన్‌ నకనిషి గోల్‌ చేసి స్కోరును 2-2తో సమం చేశాడు.

59వ నిమిషంలో మరోసారి నకనిషి గోల్‌ చేయడంతో జపాన్‌ 3-2 ఆధిక్యంలోకి వెళ్లి విజయానికి చేరువైంది.

మ్యాచ్‌ ముగియడానికి కేవలం 59 సెకన్లు మాత్రమే మిగిలి ఉండగా భారత్‌కు పెనాల్టీ కార్నర్‌ లభించింది. ఈ కీలక అవకాశాన్ని కెప్టెన్‌ అన్మోల్‌ గోల్‌గా మలిచి భారత్‌ను ఓటమి నుంచి కాపాడాడు.

ADVERTISEMENT

వివరాలు

మహిళల జట్టుకు భారీ విజయం

దీంతో మ్యాచ్‌ 3-3తో డ్రాగా ముగిసింది. భారత్‌ మంగళవారం కొరియాతో తదుపరి మ్యాచ్‌లో తలపడనుంది. మహిళల జూనియర్‌ ఆసియా కప్‌లో భారత జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది.

ఆదివారం మలేసియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ ఏకంగా 11-1 తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్‌ మొదటి నిమిషం నుంచే భారత జట్టు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది.

పూజ సాహో 1వ, 42వ నిమిషాల్లో, పూర్ణిమ యాదవ్‌ 4వ, 17వ నిమిషాల్లో, గీత యాదవ్‌ 28వ, 53వ నిమిషాల్లో, సనిక మానె 43వ, 58వ నిమిషాల్లో రెండేసి గోల్స్‌ చేశారు.

మలేసియా తరఫున నూర్‌ మహ్మద్‌ 38వ నిమిషంలో ఏకైక గోల్‌ చేసింది. దీంతో భారత్‌ 11-1తో భారీ విజయాన్ని అందుకుంది.

ADVERTISEMENT