Amaravati: పర్యాటక రంగంలో కొత్త అడుగు.. 4 కొత్త గమ్యస్థానాలకు గ్రీన్సిగ్నల్!
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్లో పర్యాటక మౌలిక వసతులను మరింత అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్వదేశ్ దర్శన్ 2.0, ప్రసాద్ పథకాల కింద రాష్ట్రంలోని అరకు, అరసవల్లి, గన్నవరం, వేదగిరి ప్రాంతాల అభివృద్ధికి మొత్తం రూ.419.30 కోట్ల విలువైన ప్రభుత్వ ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులకు సంబంధించిన పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం త్వరలో టెండర్లను ఆహ్వానించనుంది. ఇప్పటికే స్వదేశ్ దర్శన్ పథకం కింద రూ.152 కోట్లతో అరకు గుహలు, సూర్యలంక బీచ్ను అభివృద్ధి చేయడంతో పాటు నాగార్జునసాగర్ వద్ద బౌద్ధ అనుభవ కేంద్రం (బుద్ధిస్ట్ ఎక్స్పీరియన్స్ సెంటర్) నిర్మాణం చేపడుతున్నారు.
వివరాలు
అరకు కల్చరల్ ఎక్స్పీరియన్స్ సెంటర్
అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో రూ.101.07 కోట్లతో అరకు కల్చరల్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు.
కొత్తవలసలో ఐటీడీఏకు చెందిన 19.23 ఎకరాల స్థలంలో ఈ కేంద్రాన్ని అభివృద్ధి చేయనున్నారు.
గిరిజన సంస్కృతి, స్థానిక వంటకాలు, అరకు కాఫీ, చిరుధాన్యాల ప్రత్యేకతలను పర్యాటకులకు పరిచయం చేసేలా ఈ కేంద్రాన్ని తీర్చిదిద్దనున్నారు.
వివరాలు
అరసవల్లిలో 'సన్ ఎక్స్పీరియన్స్ సెంటర్'
శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయం పరిసరాలను ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు రూ.107.94 కోట్లతో 'అరసవల్లి సన్ ఎక్స్పీరియన్స్ సెంటర్' ఏర్పాటు చేయనున్నారు.
నాగావళి నది ఒడ్డున ఉన్న చారిత్రక డచ్ హెరిటేజ్ భవనాన్ని పునరుద్ధరించి వినియోగంలోకి తీసుకురానున్నారు.
డిజిటల్ ప్రదర్శనలు, మ్యూజియం, హస్తకళల అనుభవాలు తదితర సదుపాయాలను ఏర్పాటు చేయడంతో పాటు నాగావళి రివర్ ఫ్రంట్ను కూడా అభివృద్ధి చేయనున్నారు.
వివరాలు
గన్నవరంలో 'మైస్ సెంటర్'
విజయవాడ విమానాశ్రయానికి కేవలం కిలోమీటరు దూరంలో సుమారు ఐదెకరాల విస్తీర్ణంలో రూ.176 కోట్లతో 'గన్నవరం మైస్ సెంటర్' ఏర్పాటు చేయనున్నారు.
రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సందర్శకులకు పరిచయం చేసేలా ఇమ్మర్సివ్ థియేటర్ ను ఏర్పాటు చేస్తారు.
దీనితో పాటు రాష్ట్రంలోని ప్రసిద్ధ స్వీట్లు, జ్ఞాపికలను విక్రయించే కేంద్రాలను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు.
వివరాలు
వేదగిరి ఆలయానికి కొత్త రూపు
నెల్లూరు జిల్లాలోని వేదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని రూ.34.29 కోట్లతో ప్రసాద్ పథకం కింద అభివృద్ధి చేయనున్నారు.
పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా రాకపోకలు, క్యూల నిర్వహణ, వేచి ఉండే ప్రాంతాల్లో భక్తులకు అవసరమైన సౌకర్యాలను మెరుగుపరచనున్నారు.
ఇందులో భాగంగా టూరిస్ట్ అమెనిటీ సెంటర్, వెయిటింగ్ హాళ్లు, కొత్త అన్నదాన భవనం, వంటశాల, ప్రవేశ ద్వారం, నడక మార్గాలు, ల్యాండ్స్కేపింగ్, భక్తుల పార్క్, కూర్చునే ప్రదేశాలు, భద్రతా ఏర్పాట్లు కల్పించనున్నారు.
వివరాలు
మరిన్ని ప్రాంతాలపై దృష్టి
స్వదేశ్ దర్శన్ 2.0 కింద రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది.
వీటిలో మచిలీపట్నంలో కోస్టల్ ఎక్స్పీరియన్స్, మంగళగిరి ఆలయ పరిసరాల్లో పర్యాటక సదుపాయాల కల్పన, మంగళగిరి ఎకో పార్క్ అభివృద్ధి, నంద్యాల జిల్లాలోని బెలూం గుహల్లో కేవ్ లైటింగ్, సందర్శకులకు అవసరమైన సౌకర్యాల ఏర్పాటు వంటి ప్రతిపాదనలు ఉన్నాయి.
ఈ ప్రాజెక్టులు పూర్తయితే రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాంతాలకు మరింత మెరుగైన మౌలిక వసతులు అందుబాటులోకి రావడంతో పాటు పర్యాటకుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.