Mahendragiri varahi trailer: ఆ మరణాలకు వారాహి మాత శాపమే కారణమా? 'మహేంద్రగిరి వారాహి' ట్రైలర్ అదిరిపోయిందిగా!
ఈ వార్తాకథనం ఏంటి
''ఈ వారాహికి ఎదురెళ్లి.. ఆవిడతోనే ఈ శాపం తప్పిస్తాను'' అంటున్నారు కథానాయకుడు సుమంత్. ఆయన హీరోగా, ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'మహేంద్రగిరి వారాహి'. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాను లక్ష్మణ్, కలిపు మధు నిర్మించారు. ఈ చిత్రం సెప్టెంబరు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్రబృందం శుక్రవారం హైదరాబాద్లో ట్రైలర్ను విడుదల చేసింది.
వివరాలు
కీలక పాత్రలో సిద్దూ జొన్నలగడ్డ..
''చరిత్రకి అందని నగరం.. ఆ పరమశివుడు నివసించే ప్రదేశం.. వారణాసి.
ఆ వారణాసి గ్రామ దేవతే వారాహి'' అంటూ ప్రారంభమైన ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తోంది.
మహేంద్రగిరి రాజకుటుంబంలో వరుసగా జరుగుతున్న మరణాల వెనుక అసలు కారణమేంటి? ఆ మరణాలకు వారాహి మాత శాపమే కారణమా? అనే ఆసక్తికర అంశాలతో కథ సాగనున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
వారాహి మాత శాపాన్ని ఛేదించేందుకు కథానాయకుడు చేసే సాహసాలు.. రాజకుటుంబం చుట్టూ అల్లుకున్న రహస్యాలు.. ఆధ్యాత్మికత, థ్రిల్లింగ్ అంశాలతో ట్రైలర్ను ఆసక్తికరంగా రూపొందించారు.
ఈ సినిమాలో హీరో సిద్ధు జొన్నలగడ్డ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.
వివరాలు
'ప్రతి ఆధ్యాత్మిక సినిమా మన సంస్కృతిని చెబుతుంది'
ట్రైలర్ విడుదల కార్యక్రమంలో దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. ''ప్రతి ఆధ్యాత్మిక సినిమా మన సంస్కృతిని చెబుతుంది.
ఇలాంటి సినిమాలను మనం సపోర్ట్ చేయాలి. వాటి నుంచి నేర్చుకోవాలి.
'మహేంద్రగిరి వారాహి' పెద్ద విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నా'' అన్నారు.
దర్శకుడు సంతోష్ జాగర్లపూడి మాట్లాడుతూ.. ''ప్రేక్షకులకు చాలా అద్భుతమైన అనుభూతిని అందించే చిత్రమిది'' అన్నారు.
వివరాలు
మూడేళ్లు ఈ సినిమా కోసం ప్రయాణించా: సుమంత్
హీరో సుమంత్ మాట్లాడుతూ.. ''ట్రైలర్ అందరికీ నచ్చడం చాలా ఆనందంగా ఉంది.
ఈ చిత్రంతో దాదాపు మూడేళ్లుగా ప్రయాణించాను. చాలా పెద్ద బడ్జెట్తో, భారీ స్థాయిలో తెరకెక్కించాల్సిన సినిమా ఇది.
నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించారు. ఈ చిత్రంపై మేమంతా ఎంతో నమ్మకంగా ఉన్నాం.
ట్రైలర్ చూసిన తర్వాత ఆ నమ్మకం ప్రేక్షకులకూ కలిగిందని ఆశిస్తున్నాను.
ఈ సినిమాపై మేము పెట్టుకున్న నమ్మకం ఏంటో సెప్టెంబరు 11న అందరూ థియేటర్లలో చూస్తారు'' అని అన్నారు.
ఈ కార్యక్రమంలో నిర్మాతలు మధు, లక్ష్మణ్, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, మీనాక్షి గోస్వామి తదితరులు పాల్గొన్నారు.