Loading...
IRCTC: పుణ్యక్షేత్రాల దర్శనానికి ఐఆర్‌సీటీసీ ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే!
పుణ్యక్షేత్రాల దర్శనానికి ఐఆర్‌సీటీసీ ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే!

IRCTC: పుణ్యక్షేత్రాల దర్శనానికి ఐఆర్‌సీటీసీ ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 29, 2026
08:58 am

ఈ వార్తాకథనం ఏంటి

పుణ్యక్షేత్రాలకు వెళ్లే యాత్రికుల సౌకర్యార్థం భారత్‌ గౌరవ్‌ టూరిస్ట్‌ ప్రత్యేక రైలును నడుపుతున్నట్లు ఐఆర్‌సీటీసీ విజయవాడ ప్రాంతీయ అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 'అయోధ్య, కాశీ, బైద్యనాథ్‌ ధామ్‌' పేరుతో ఈ టూర్‌ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చారు. మొత్తం 10 పగళ్లు, 9 రాత్రులతో కూడిన ఈ ప్యాకేజీలో భాగంగా రైలు అక్టోబరు 24న సికింద్రాబాద్‌ నుంచి బయల్దేరనుంది. ఈ ప్రత్యేక రైలు విజయవాడ, గుడివాడ, భీమవరం, తణుకు, నిడదవోలు, రాజమహేంద్రవరం, సామర్లకోట, తుని మీదుగా ప్రయాణించనుంది. ఈ యాత్రలో పూరీ జగన్నాథ ఆలయం, కోణార్క్‌ సూర్య దేవాలయం, బైద్యనాథ్‌ ఆలయం, వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయం, కాశీ విశాలాక్షి, అన్నపూర్ణ ఆలయాలను యాత్రికులు దర్శించుకోవచ్చు.

వివరాలు

టికెట్‌ ధరలు ఇలా..

అలాగే వారణాసిలో సాయంత్రం గంగా హారతి, అయోధ్యలో రామజన్మభూమి, హనుమాన్‌ ఆలయం, సరయూ నది హారతి, ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం తదితర పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశం ఉంటుంది.

యాత్ర అనంతరం రైలు నవంబరు 2వ తేదీన తిరుగు ప్రయాణం అవుతుంది. ఈ ప్యాకేజీలో టీ, టిఫిన్, భోజనం, రవాణా, హోటల్‌ గదులు, ఇన్సూరెన్స్‌ వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి.

ఒక్కొక్కరికీ టికెట్‌ ధర స్లీపర్‌ తరగతిలో రూ.17 వేలు, థర్డ్‌ ఏసీలో రూ.26,400, సెకెండ్‌ ఏసీలో రూ.34,400గా నిర్ణయించారు.

టికెట్ల బుకింగ్‌, ఇతర వివరాల కోసం 92810 30714 ఫోన్‌ నంబర్‌లో సంప్రదించాలని ఐఆర్‌సీటీసీ విజయవాడ ప్రాంతీయ అధికారులు కోరారు.

ADVERTISEMENT