Asia Women's T20: 'ఆసియా' ఎవరిదో.. అమ్మాయిల టీ20 సమరానికి రంగం సిద్ధం!
ఈ వార్తాకథనం ఏంటి
ఆసియా మహిళల టీ20 టోర్నీకి వేళైంది. అమ్మాయిలు మెరుపు ఆటకు సిద్ధమయ్యారు. శుక్రవారం నుంచి ఈ టోర్నీలో పోటీలు ప్రారంభం కానున్నాయి. తొలి మ్యాచ్లో థాయ్లాండ్, హాంకాంగ్ జట్లు తలపడనున్నాయి. ఆదివారం థాయ్లాండ్తో జరిగే మ్యాచ్తో హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు టోర్నీని ఆరంభించనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ శ్రీలంక ఈసారి కూడా టైటిల్ కోసం బరిలోకి దిగుతోంది.
వివరాలు
ఫేవరెట్గా భారత్
ఆసియా కప్లో భారత్ మరోసారి ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది.
ఇప్పటివరకు ఈ కప్ను అత్యధికంగా ఏడు సార్లు గెలుచుకున్న ఘనత భారత జట్టుదే. వన్డే ఫార్మాట్లో నాలుగుసార్లు విజేతగా నిలిచిన భారత్.. టీ20 ఫార్మాట్లో మూడు సార్లు (2012, 2016, 2022) టైటిల్ను సొంతం చేసుకుంది.
ఈ సీజన్లో ఇప్పటివరకు 16 టీ20 మ్యాచ్లు ఆడిన భారత్.. 9 విజయాలు సాధించింది.
దీంతో ఈ టోర్నీలో భారత జట్టును అడ్డుకోవడం మిగిలిన జట్లకు అంత సులువు కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
వెస్టిండీస్పై 2-1తో, బంగ్లాదేశ్పై 3-0తో, పాకిస్థాన్పై 2-1తో సిరీస్ విజయాలు సాధించి భారత జట్టు మంచి జోరుమీదుంది.
వివరాలు
ఫార్మాట్ ఇలా..
ఈ ఆసియా కప్లో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. వీటిని రెండు గ్రూపులుగా విభజించారు.
భారత్, పాకిస్థాన్, థాయ్లాండ్, హాంకాంగ్ జట్లు గ్రూప్-ఎలో ఉన్నాయి. బంగ్లాదేశ్, ఇండోనేసియా, శ్రీలంక, యూఏఈ జట్లు గ్రూప్-బిలో తలపడనున్నాయి.
గ్రూప్ దశలో ప్రతి జట్టు.. తన గ్రూప్లోని మిగిలిన జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. గ్రూప్లో తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు సెమీఫైనల్కు అర్హత సాధిస్తాయి.
వివరాలు
సెప్టెంబర్ 5న పాక్తో ఢీ
చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో భారత్ సెప్టెంబర్ 5న తలపడనుంది. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు జరిగిన 17 టీ20 మ్యాచ్ల్లో భారత్ ఏకంగా 14 విజయాలు సాధించింది.
పాకిస్థాన్పై టీ20ల్లో భారత జట్టుకు తిరుగులేని రికార్డు ఉంది. మరోవైపు పాకిస్థాన్ ఇటీవల టీ20ల్లో పేలవ ప్రదర్శన చేస్తోంది.
వెస్టిండీస్, శ్రీలంక చేతుల్లో వరుసగా సిరీస్లు కోల్పోయింది. టీ20 ప్రపంచకప్లో ఆడిన ఐదు మ్యాచ్ల్లోనూ నాలుగు పరాజయాలను చవిచూసింది.
ఈ టోర్నీలో అన్ని మ్యాచ్లు రాత్రి 8 గంటలకు ప్రారంభం కానున్నాయి. సోనీస్పోర్ట్స్లో మ్యాచ్ల ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది.