ఆస్కార్ అవార్డ్స్: గునిత్ మోంగా మాటలను ఆపేయడంపై ఇంటర్నెట్ లో చర్చ
95వ ఆస్కార్ అవార్డ్స్ భారతీయులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు పాటకు ఆస్కార్ రావడం, అలాగే డాక్యుమెంటరీ షార్ట్ విభాగంలో ది ఎలిఫెంట్ విష్పర్స్ కు ఆస్కార్ రావడం ఇందుకు కారణం. అయితే ఆస్కార్ అవార్డులు ఆనందాన్నిచ్చిన మాట వాస్తవమే అయినా కానీ, ఆస్కార్ అందుకున్న వాళ్ళకు మాట్లాడే అవకాశం మరీ తక్కువగా ఇవ్వడంపై ఇంటర్నెట్ లో చర్చ జరుగుతోంది. అవార్డ్ అందుకున్న ది ఎలిఫెంట్ విష్పర్స్ చిత్ర నిర్మాత గునిత్ మోంగా, వేదిక మీద మాట్లాడుతుండగా, సడెన్ గా మ్యూజిక్ ప్లే అయ్యింది. దాంతో ఆమె తన మాటలను పూర్తి చేయకుండానే వెళ్ళిపోయింది. ఈ విషయం మీద సర్వత్రా చర్చ జరుగుతోంది.
ఆస్కార్ వేదిక ఎక్కువ సేపు మాట్లాడ్డానికి అవకాశం లేదా?
కనీసం మాట్లాడ్డానికి సరైన సమయం ఎందుకివ్వరంటూ చాలామంది నెటిజన్లు ఆస్కార్ మీద విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆస్కార్ నియమాల గురించి తెలుసుకుందాం. ఆస్కార్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రిక్కీ క్రిష్ నర్, సీఎన్ఎన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఆస్కార్ అందుకున్నాక హృదయాలను హత్తుకునే ఉపన్యాసం ఇస్తే, మాట్లాడేందుకు సమయం ఉంటుందనీ, అలా కాకుండా రేపేం చేయాలనుకుంటున్నారనే దాని గురించి ఎక్కువ మాట్లాడితే మ్యూజిక్ వచ్చేస్తుందని అన్నారు. 2003లో మోరిస్ మూరే దర్శకత్వం వహించిన బౌలింగ్ ఫర్ కొలంబైన్ డాక్యుమెంటరీకి బెస్ట్ డాక్యుమెంటరీ ఫీఛర్ గా అవార్డ్ వచ్చింది. తన ఉపన్యాసంలో జార్జ్ బుష్ పై పరోక్షంగా వ్యాఖ్యలు చేసాడు మోరిస్. దాంతో మ్యూజిక్ ప్లే అయ్యింది.