Andhra pradesh: అనకాపల్లి ఉక్కు కర్మాగారం నిర్మాణానికి ముందడుగు.. ప్రత్యేక స్టీల్ ఫ్యాబ్రికేషన్ యూనిట్ ఏర్పాటు
ఈ వార్తాకథనం ఏంటి
అనకాపల్లి జిల్లాలోని రాజయ్యపేటలో ప్రతిపాదించిన ఆర్సెలార్ మిత్తల్-నిప్పన్ స్టీల్ (ఏఎంఎన్ఎస్) సమీకృత ఉక్కు కర్మాగారానికి అనుబంధంగా ప్రత్యేక స్టీల్ ఫ్యాబ్రికేషన్ యూనిట్ను ఏర్పాటు చేయడానికి సంస్థ ముందడుగు వేసింది. ఈ యూనిట్ నిర్మాణంలో అనుభవం ఉన్న సంస్థలను ఎంపిక చేయడానికి ఏఎంఎన్ఎస్ ఆసక్తి వ్యక్తీకరణ (ఈవోఐ)ను విడుదల చేసింది. ఎంపికైన సంస్థలు ఈ స్టీల్ ఫ్యాబ్రికేషన్ యూనిట్ను నాలుగేళ్లలో పూర్తిచేయాల్సి ఉంటుంది. రాజయ్యపేటలో మొదటి దశలో ఏటా 8.20 మిలియన్ మెట్రిక్ టన్నుల (ఎంఎంటీపీఏ) ఉత్పత్తి సామర్థ్యంతో సమీకృత ఉక్కు కర్మాగారం నిర్మించేందుకు ఏఎంఎన్ఎస్ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది.
వివరాలు
17.80 ఎంఎంటీపీఏ సామర్థ్యంతో ఏఎంఎన్ఎస్ ప్రణాళిక
ఈ ప్రాజెక్టు అమలు కోసం దాదాపు ఒక మిలియన్ టన్నుల ఫ్యాబ్రికేటెడ్ స్టీల్ స్ట్రక్చర్ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ భారీ ప్రాజెక్టుతో పాటు సంస్థ ఒక ప్రత్యేక పోర్టును కూడా అభివృద్ధి చేయాలని యోచిస్తోంది. మొత్తం రెండు దశల్లో ఈ ఉక్కు కర్మాగారం ఏర్పాటుకాగా,పూర్తి స్థాయిలో సంవత్సరానికి 17.80 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఇది పనిచేయనుంది. అదే సమయంలో,ఛత్తీస్గఢ్లోని ఎన్ఎండీసీకి చెందిన బైలదిల్లా గనుల నుంచి ఐరన్ ఓర్ స్లరీని విశాఖలో ఉన్న పెల్లెట్స్ తయారీ సంస్థకు తరలించేందుకు సుమారు 244కిలోమీటర్ల పొడవైన పైపులైన్ను ఏఎంఎన్ఎస్ ఇప్పటికే నిర్వహిస్తోంది. ఈ పైపులైన్ను అనకాపల్లి జిల్లాలో నిర్మించనున్న కొత్త ఉక్కు కర్మాగారం వరకు విస్తరించేందుకు ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చింది.