Pawan Kalyan Birthday: వెండితెర 'పవర్ స్టార్' నుంచి డిప్యూటీ సీఎంగా ప్రభంజనం..
ఈ వార్తాకథనం ఏంటి
వెండితెరపై పవర్ఫుల్ నటుడిగా కోట్లాది మంది అభిమానులను అలరించడం ఒక ఎత్తయితే.. అదే ప్రజలను తన సిద్ధాంతాలతో చైతన్యపరచి, ప్రజామోదం పొందిన నాయకుడిగా ఎదగడం మరో ఎత్తు. నటుడిగా, రాజకీయ నాయకుడిగా రెండు విభిన్న రంగాల్లోనూ తనదైన ముద్ర వేసి కోట్లాది మంది గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న అరుదైన వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్. ఆయన జన్మదినం సందర్భంగా నటుడిగా, ప్రజా నాయకుడిగా ఆయన సాగించిన ప్రస్థానంపై ప్రత్యేక కథనం. తెలుగు చిత్రసీమలోకి 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాతో అడుగుపెట్టిన పవన్ కల్యాణ్.. అతి తక్కువ సమయంలోనే యూత్ ఐకాన్గా మారారు.
వివరాలు
ప్రత్యేకమైన మేనరిజమ్..
నటనతో పాటు మార్షల్ ఆర్ట్స్, డాన్స్, ఫైట్స్, ప్రత్యేకమైన మేనరిజమ్తో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్టైల్ను ఏర్పరుచుకున్నారు.
'తొలిప్రేమ', 'తమ్ముడు', 'బద్రి', 'ఖుషి' సినిమాలతో వరుస విజయాలు అందుకున్నారు.
'తొలిప్రేమ' జాతీయ అవార్డును సొంతం చేసుకోగా.. 'ఖుషి' సినిమా పవన్ కల్యాణ్ క్రేజ్ను మరో స్థాయికి తీసుకెళ్లింది.
కొన్నేళ్ల విరామం తర్వాత వచ్చిన 'గబ్బర్ సింగ్' సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకుంది.
ఆ తర్వాత 'అత్తారింటికి దారేది', 'వకీల్ సాబ్', 'భీమ్లా నాయక్' వంటి సినిమాలతో తన మాస్ ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించారు.
మార్షల్ ఆర్ట్స్ కొరియోగ్రఫీలోనూ తనదైన ముద్ర వేశారు. 'సత్యాగ్రహి' వంటి విభిన్న ఆలోచనలతో కొత్త తరహా ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారు.
వివరాలు
న్యాయం కోసం పోరాటం..
సినిమాల్లో అగ్ర కథానాయకుడిగా కొనసాగుతున్న సమయంలోనే సమాజానికి ఏదైనా చేయాలనే ఆలోచనతో పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2014 మార్చి 14న జనసేన పార్టీని స్థాపించారు.
తక్షణ రాజకీయ ప్రయోజనాల కంటే సిద్ధాంతాలకు ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగారు.
ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యను జాతీయ స్థాయికి తీసుకెళ్లడం నుంచి కౌలు రైతుల కుటుంబాలకు అండగా నిలవడం, సుగాలి ప్రీతి కేసులో న్యాయం కోసం పోరాడటం వరకు పలు ప్రజా సమస్యలపై ఆయన స్పందించారు.
వివరాలు
పిఠాపురం నుంచి భారీ మెజార్టీతో విజయం..
ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో స్వయంగా తెలుసుకునేందుకు పవన్ కల్యాణ్ చేపట్టిన 'వారాహి యాత్ర' ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక మలుపుగా నిలిచింది.
గ్రామాలు, ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ క్రమంలో 2024 అసెంబ్లీ ఎన్నికలు ఆయన రాజకీయ ప్రస్థానంలో అత్యంత కీలకమైన ఘట్టంగా నిలిచాయి.
2024 ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లోనూ విజయం సాధించింది.
అలాగే రెండు పార్లమెంట్ స్థానాల్లోనూ గెలుపొందింది. దీంతో 100 శాతం విజయంతో రాజకీయాల్లో అరుదైన రికార్డు సృష్టించింది.
పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కల్యాణ్ భారీ మెజారిటీతో విజయం సాధించారు.
వివరాలు
అభిమానుల గుండెల్లో నిలిచిన పవన్..
ప్రస్తుతం పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అడవులు, పర్యావరణ శాఖలకు మంత్రిగా కూడా కొనసాగుతున్నారు.
గ్రామ స్వరాజ్యం, పర్యావరణ పరిరక్షణ, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి.
వెండితెరపై 'పవర్ స్టార్'గా అభిమానుల గుండెల్లో నిలిచిన పవన్ కల్యాణ్.. ఇప్పుడు ప్రజా నాయకుడిగా, ఉపముఖ్యమంత్రిగా తనదైన ముద్ర వేస్తున్నారు.