Varanasi: 'వారణాసి' కథ వినిపించే సమయంలో నాకు చలి.. రాజమౌళి మాత్రం చెమటలతో తడిసిపోయారు: పృథ్వీరాజ్
ఈ వార్తాకథనం ఏంటి
సూపర్స్టార్ మహేష్ బాబు హీరోగా, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక యాక్షన్-అడ్వెంచర్ చిత్రం 'వారణాసి'పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో 'కుంభ' అనే శక్తివంతమైన ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు పృథ్వీరాజ్ సుకుమారన్. తాజాగా తన కొత్త సినిమా 'ఐ, నోబడీ' ప్రమోషన్స్లో పాల్గొంటూ 'వారణాసి' సినిమా, రాజమౌళి కథ చెప్పే విధానం, చిత్రీకరణ అనుభవాల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
వివరాలు
రాజమౌళి చెప్పిన కథ అద్భుతం.. తెరపై అది వంద రెట్లు గొప్పగా కనిపిస్తుంది..
పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. ''నేను 'ఎంపురాన్' చిత్రీకరణలో బిజీగా ఉన్న సమయంలో రాజమౌళి సర్ నుంచి 'మీకు కాల్ చేయొచ్చా?' అంటూ ఒక సందేశం వచ్చింది. వెంటనే నేను ఆయనకు ఫోన్ చేశాను. ప్రస్తుతం ఓ కథ సిద్ధం చేస్తున్నానని, అందులో విలన్ పాత్ర ఎంతో కీలకంగా ఉంటుందని చెప్పారు. ఆ పాత్రపై మీకు ఆసక్తి ఉంటే కథ వినాలని ఆహ్వానించారు. నా షూటింగ్ షెడ్యూల్ ముగిసిన వెంటనే హైదరాబాద్కు వెళ్లాను. అక్కడికి వెళ్లాక అది సినిమా కార్యాలయంలా కాకుండా ఒక కుటుంబ వాతావరణంలా అనిపించింది. అందరూ ఎంతో ఆత్మీయంగా పలకరించారు. కొద్దిసేపు సాధారణంగా మాట్లాడుకున్న తర్వాత రాజమౌళి సర్ 'వారణాసి' కథను వివరించడం ప్రారంభించారు.
వివరాలు
మూడున్నర గంటలు కథ చెప్పిన రాజమౌళి..
దాదాపు మూడున్నర గంటల పాటు ఒక్క క్షణం కూడా బోర్ కొట్టకుండా కథ చెప్పారు. ఆయన ఆలోచన ఎంత స్పష్టంగా ఉందో, ప్రతి సన్నివేశాన్ని ఎంత జీవంతో ఊహించుకున్నారో వినగానే అర్థమైంది. ఆ సమయంలో గది పూర్తిగా చల్లగా ఉన్నా నాకు మాత్రం చలి అనిపించింది. కానీ కథ ముగిసే సమయానికి రాజమౌళి సర్ చెమటలతో పూర్తిగా తడిసిపోయారు. కథను చెప్పడంలో ఆయన చూపించే అంకితభావం అద్భుతం. రాజమౌళి సర్ కథను వివరిస్తుంటే ప్రతి సన్నివేశం నా కళ్లముందే జరుగుతున్నట్లుగా అనిపించింది. అయితే ఆయన మాటల్లో వినిపించిన దానికంటే షూటింగ్, ఎడిటింగ్ పూర్తయ్యాక ప్రేక్షకులు తెరపై చూసేది కనీసం వంద రెట్లు గొప్పగా ఉంటుంది'' అని అన్నారు.