33ఏళ్లకు ఆయనతో సినిమా.. నా గుండె ఆనందంతో ఉప్పొంగుతోందన్న తలైవా
ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కలిసి వెండితెరపై సందడి చేయనున్నారు. ఈ ఇద్దరు లెజెండ్స్ కలిసి దాదాపు 33 ఏళ్ల తర్వాత సెట్స్లో అడుగుపెట్టారు. ఈ మేరకు ఈ ఇద్దరు కలిసి ఇవాళ షూటింగ్ చేశారు. ఇందులో భాగంగానే తలైవర్ ఆ ఫోటోలను నెట్టింట పంచుకున్నారు. తలైవర్ 170 సినిమా చిత్రీకరణలో రజనీ హీరోగా 'జై భీమ్' ఫేమ్ టి.జె. జ్ఞానవేల్ దర్శకత్వంలో ఓ భారీ సినిమా తీర్చిదిద్దనున్నారు. ఈ మూవీలో అమితాబ్ బచ్చన్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం రజనీ, బచ్చన్ పై సన్నివేశాలు తెరకెక్కుతున్నాయి. 33 ఏళ్ల తర్వాత గురువు అమితాబ్ బచ్చన్ తో నటిస్తున్నానని, తన మనసు ఆనందంతో ఉప్పొంగుతోందని రజనీకాంత్ తెలిపారు.