Vijay Devarakonda: విజయ్ దేవరకొండపై వైరల్ అవుతున్న కారవాన్ వివాదం.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత
ఈ వార్తాకథనం ఏంటి
హీరో విజయ్ దేవరకొండకు సంబంధించిన ఓ ప్రచారం ఇటీవల సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం రూపొందుతున్న 'రణబాలి' సినిమా చిత్రీకరణలో భాగంగా ఆయన ఐదు కారవాన్లు ఏర్పాటు చేయాలని కోరడంతో పాటు, తన వెంట ఎక్కువ సంఖ్యలో అసిస్టెంట్లు ఉండాలని డిమాండ్ చేసినట్లు పలు కథనాలు వెలువడ్డాయి. ఈ ప్రచారంపై ఇప్పటికే విజయ్ దేవరకొండ బృందం అధికారికంగా స్పందిస్తూ వాటిని పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేసింది. తాజాగా చిత్ర నిర్మాత రవి కూడా ఇదే విషయంపై స్పష్టత ఇచ్చారు. షూటింగ్ సమయంలో అలాంటి పరిస్థితులు లేదా ఇబ్బందులు ఏవీ తలెత్తలేదని ఆయన వెల్లడించారు. విజయ్ దేవరకొండ పనిపట్ల ఎప్పుడూ నిబద్ధతతో వ్యవహరిస్తారని, ఆయనపై వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని పేర్కొన్నారు.
వివరాలు
విజయ్ దేవరకొండ టీమ్ హెచ్చరిక..
అసత్య ప్రచారాలను ఉద్దేశపూర్వకంగా వ్యాప్తి చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని విజయ్ దేవరకొండ టీమ్ హెచ్చరించింది. ఇక 'రణబాలి' సినిమా విషయానికి వస్తే.. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో ఈ చిత్రం రూపొందుతోంది. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పాలనా కాలంలో చోటుచేసుకున్న వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది. ఇప్పటికే సుమారు 90 శాతం చిత్రీకరణ పూర్తయిందని, సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్రబృందం వేగంగా పనులు పూర్తి చేస్తోందని సమాచారం.