Yash: గొప్ప సినిమాటిక్ అనుభూతిని అందించే సినిమా 'టాక్సిక్': యశ్
ఈ వార్తాకథనం ఏంటి
'టాక్సిక్' సినిమా కొత్త ఒరవడిని సృష్టిస్తుందని, ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా ఉంటుందని కథానాయకుడు యశ్ అన్నారు. 'కేజీఎఫ్' చిత్రాల తర్వాత ఆయన నటిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాకు గీతూ మోహన్దాస్ దర్శకత్వం వహించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. కియారా అడ్వాణీ హీరోయిన్గా నటించగా.. నయనతార, రుక్మిణీ వసంత్, హ్యూమా ఖురేషి, తారా సుతారియా తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా ఈ నెల 26న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం రాత్రి హైదరాబాద్లో చిత్ర ప్రీరిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు.
వివరాలు
ఇప్పుడు మనదంతా ఒక్కటే సినిమా..
యశ్ మాట్లాడుతూ తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. '''కేజీఎఫ్' సినిమాపై మీరు చూపించిన ప్రేమ మాకు ఎంతో నమ్మకాన్ని ఇచ్చింది.
భారతీయ చిత్ర పరిశ్రమలోని ప్రతి ఒక్కరికీ ఒక భరోసా కల్పించారు.
ఎవరైనా నిజాయతీగా, ప్యాషన్తో కష్టపడి పనిచేస్తే ప్రేక్షకులు ఎప్పుడూ అండగా నిలుస్తారనే నమ్మకాన్ని ఇచ్చారు.
నాలాంటి సామాన్య వ్యక్తి కూడా పెద్ద కలలు కనొచ్చని ధైర్యం ఇచ్చారు'' అని అన్నారు.
''సినిమాకు ఎలాంటి సరిహద్దులు లేవు. భాషా భేదాలు కూడా లేవు. వాటన్నింటికంటే మానవత్వం, ప్రేమ, నిజాయతీ ముఖ్యమని తెలుగు ప్రేక్షకులు చూపించారు.
ఇప్పుడు మనదంతా ఒక్కటే సినిమా.. ఇండియన్ సినిమా. త్వరలో మనమంతా కలిసి ప్రపంచ పటంలో భారతీయ సినిమాను సగర్వంగా నిలబెడతాం'' అని యశ్ పేర్కొన్నారు.
వివరాలు
సినిమాను మరీ సీరియస్గా తీసుకోవద్దు..
యువతకు కూడా యశ్ పలు సూచనలు చేశారు. ''సినిమాను మరీ సీరియస్గా తీసుకోవద్దు.
మీరు ఒక కలను ఏర్పరచుకుని.. దాన్ని సాధించేందుకు నిజాయతీగా కష్టపడితే ఏ రంగంలోనైనా గౌరవం దక్కుతుంది.
విజయం కూడా తప్పకుండా వరిస్తుంది'' అని చెప్పారు. ''మన దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి.
ప్రతి ఒక్కరికీ ప్రత్యేకమైన భాష ఉంది. అందరూ తమ భాషలను ఎంతో ప్రేమిస్తారు. కానీ ఇప్పుడు మనమంతా ఒక్కటవ్వాలి.
ఎవరైనా మనల్ని విడదీయాలని చూసినా, రాజకీయాలు చేయాలని చూసినా వాటిని పట్టించుకోకూడదు.
నార్త్, సౌత్ అనే విభేదాలు వద్దు. మనం కష్టపడితే దేశంలో ఎక్కడికి వెళ్లినా అదే ప్రేమ, ఆదరణ లభిస్తుంది.
'టాక్సిక్' గొప్ప సినిమాటిక్ అనుభూతిని అందించే సినిమా'' అని యశ్ అన్నారు.