Retro Photo Scam: 1980 రెట్రో ఫొటో ఎడిటింగ్.. సైబర్ నేరగాళ్ల ఉచ్చుగా మారొచ్చు!
ఈ వార్తాకథనం ఏంటి
సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ట్రెండవుతున్న '1980 రెట్రో ఫొటో ఎడిటింగ్' పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడే అవకాశం ఉందని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ) డైరెక్టర్ శిఖా గోయల్ హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సాధారణ ఫొటోలను రెట్రో ఫొటోలుగా మార్చుతామంటూ ఆకర్షణీయమైన ప్రకటనలు, సందేశాలతో సైబర్ ముఠాలు ప్రచారం చేస్తున్నాయని తెలిపారు. ఇలాంటి అనుమానాస్పద లింకులను క్లిక్ చేయకూడదని, వాట్సప్లో ఎవరైనా షేర్ చేసే ఏపీకే ఫైళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ డౌన్లోడ్ చేసుకోవద్దని సూచించారు. ఉచితంగా, అపరిమితంగా రెట్రో ఫొటో ఎడిటింగ్ సదుపాయం కల్పిస్తామంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు గుర్తించామని శిఖా గోయల్ శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
వివరాలు
సైబర్ మోసాల నుంచి రక్షణకు సూచనలు
ఈ తరహా మోసాలకు సైబర్ నేరగాళ్లకు చిక్కకుండా ప్రజలు కొన్ని జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
యాప్ స్టోర్లలో కాకుండా ఇతర లింకుల ద్వారా యాప్లను డౌన్లోడ్ చేసుకోవద్దు.
తెలియని వ్యక్తులు పంపించే ఏపీకే ఫైళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ డౌన్లోడ్ చేసుకోవద్దు.
ఒకవేళ సైబర్ మోసానికి గురైతే 1930 టోల్ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయాలి.
అలాగే cybercrime.gov.in వెబ్సైట్ ద్వారా లేదా 87126 72222 వాట్సప్ నంబర్కు ఫిర్యాదు చేయాలని టీజీసీఎస్బీ సూచించింది