LOADING...
Gurugram: గురుగ్రామ్‌లో కాల్పుల కలకలం.. పోలీసుల ఎదురుకాల్పుల్లో నలుగురు గ్యాంగ్‌స్టర్ల మృతి
పోలీసుల ఎదురుకాల్పుల్లో నలుగురు గ్యాంగ్‌స్టర్ల మృతి

Gurugram: గురుగ్రామ్‌లో కాల్పుల కలకలం.. పోలీసుల ఎదురుకాల్పుల్లో నలుగురు గ్యాంగ్‌స్టర్ల మృతి

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 10, 2026
10:35 am

ఈ వార్తాకథనం ఏంటి

హర్యానాలోని గురుగ్రామ్‌లో పోలీసులు, గ్యాంగ్‌స్టర్ల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు దుండగులు మృతిచెందారు. వీరు గ్యాంగ్‌స్టర్ దీపక్ నందల్ ముఠాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో ముగ్గురు పోలీసు సిబ్బంది గాయపడగా, నిందితుల వద్ద నుంచి పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం, గురువారం అర్ధరాత్రి సమయంలో సుశాంత్ లోక్ ఫేజ్-2 ప్రాంతంలో ఓ కారులో కొందరు సాయుధ వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తున్నట్లు పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి క్రైమ్ బ్రాంచ్ బృందాలకు సమాచారం అందింది. వెంటనే పోలీసులు ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు.

వివరాలు 

ముగ్గురు పోలీసులకు గాయాలు 

ఈ క్రమంలో స్థానికంగా నివసించే ప్రముఖ వ్యాపారవేత్త ఇంటి వద్ద కొందరు షూటర్లు కాల్పులకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే వారిని చుట్టుముట్టి లొంగిపోవాలని హెచ్చరించినా, దుండగులు పోలీసులపైనే కాల్పులు ప్రారంభించారు. దీంతో పోలీసులు ఎదురు కాల్పులు జరపగా, నలుగురు గ్యాంగ్‌స్టర్లు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులకు గాయాలయ్యాయి. ప్రాథమిక దర్యాప్తులో భాగంగా, ప్రస్తుతం విదేశాల్లో ఉన్న గ్యాంగ్‌స్టర్ దీపక్ నందల్ నుంచి ఆ వ్యాపారవేత్తకు గతంలో పలుమార్లు బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు.

వివరాలు 

సంబంధిత వ్యక్తుల పాత్రపై దర్యాప్తు

ఆ బెదిరింపుల నేపథ్యంలోనే వ్యాపారవేత్త నివాసంపై దాడి చేసేందుకు షూటర్లు వచ్చినట్లు అనుమానిస్తున్నట్లు తెలిపారు. వ్యాపారవేత్తకు ముప్పు ఉందన్న సమాచారంతో ముందస్తు జాగ్రత్తగా ఆయన నివాసం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసి, కాల్పుల వెనుక ఉన్న పూర్తి కుట్రతో పాటు ఇతర సంబంధిత వ్యక్తుల పాత్రపై దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.

Advertisement