Loading...
Andhra Pradesh: మలేరియా మాత్రలు వికటించి చిన్నారి మృతి.. 53 మందికి అస్వస్థత
మలేరియా మాత్రలు వికటించి చిన్నారి మృతి.. 53 మందికి అస్వస్థత

Andhra Pradesh: మలేరియా మాత్రలు వికటించి చిన్నారి మృతి.. 53 మందికి అస్వస్థత

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 02, 2026
10:11 am

ఈ వార్తాకథనం ఏంటి

మలేరియా నివారణకు ఇచ్చిన మాత్రలు వేసుకున్న తర్వాత ఓ ఏడేళ్ల చిన్నారి మృతి చెందడం.. మరో 53 మంది అస్వస్థతకు గురికావడం పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగుప్పలో కలకలం రేపింది. మంగళవారం గ్రామంలో వైద్య సిబ్బంది పర్యటించి 71 మందికి మలేరియా నివారణ కోసం క్లోరోక్విన్‌ మాత్రలను పంపిణీ చేశారు. పాఠశాలల్లో విద్యార్థులతోనూ ఆ మాత్రలను మింగించారు. గొల్లగుప్పకు చెందిన మడివి జమున (7) మాత్రలు వేసుకున్న అనంతరం సాయంత్రం ఇంటికి వెళ్లింది. ఆ తర్వాత ఆమెకు వాంతులు కావడంతో కుటుంబ సభ్యులు లక్ష్మీపురం ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. జమున మూడు క్లోరోక్విన్‌ మాత్రలు వేసుకున్నట్లు సమాచారం.

వివరాలు 

53 మందికి అస్వస్థత

జమున మృతి చెందిన అనంతరం గ్రామంలోని పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాలకు చెందిన చిన్నారులతో పాటు మరికొందరు అస్వస్థతకు గురయ్యారు.

మొత్తం 53 మందిలో అనారోగ్య లక్షణాలు కనిపించడంతో వారందరినీ భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు.

బాధితుల్లో 46 మంది చిన్నారులు ఉండగా.. మరో ఏడుగురు పెద్దలు ఉన్నారు.

ప్రస్తుతం అందరి ఆరోగ్యం నిలకడగానే ఉందని పోలవరం జిల్లా కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ తెలిపారు.

మాత్రలు వేసుకున్న తర్వాత అస్వస్థతకు గురికావడానికి, చిన్నారి మృతికి గల కారణాలను అధికారులు తెలుసుకుంటున్నారు.

వివరాలు 

రంగంలోకి రాపిడ్‌ రెస్పాన్స్‌ బృందాలు

ఘటనకు దారితీసిన కారణాలను గుర్తించడంతో పాటు సహాయ చర్యలను వేగవంతం చేసేందుకు అధికారులు ప్రత్యేక బృందాలను గ్రామానికి పంపుతున్నారు.

రాజమహేంద్రవరం, కాకినాడ, పాడేరు, విజయవాడ ప్రాంతాల నుంచి రాపిడ్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌లను గొల్లగుప్పకు తరలిస్తున్నారు.

గొల్లగుప్పలో జరిగిన ఘటనపై ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

పరిస్థితిని తెలుసుకుని తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

బాధితులకు అవసరమైన వైద్య సేవలు అందించడంతో పాటు ఘటనకు అసలు కారణాలను గుర్తించాలని సూచించారు.

ADVERTISEMENT