Pune Murder Case: బాలి ట్రిప్ కోసం పాస్పోర్ట్ చింపేసిన వధువు.. పూణె వ్యాపారి హత్య కేసులో సంచలన నిజాలు!
ఈ వార్తాకథనం ఏంటి
పూణెకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కుమారుడు కేతన్ విశాల్ అగర్వాల్ (26) హత్య కేసులో రోజురోజుకూ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. లోహగఢ్ కోట సమీపంలోని లోయలోకి నెట్టి హత్య చేయడానికి ముందే కేతన్ను బాలి ట్రిప్కు వెళ్లకుండా అడ్డుకునేందుకు పక్కా ప్రణాళిక రూపొందించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో అరెస్టైన కాబోయే వధువు సియా గోయల్ (20), ఆమె ప్రియుడు చేతన్ బాబూలాల్ చౌదరి (22)లను వాడ్గావ్ మావల్ కోర్టు మంగళవారం జూన్ 29 వరకు ఏడు రోజుల పోలీసు కస్టడీకి అప్పగించింది.
వివరాలు
బాలి ట్రిప్ ఆపేందుకే పాస్పోర్ట్ ధ్వంసం
పూణె రూరల్ పోలీస్ సూపరింటెండెంట్ సందీప్ సింగ్ గిల్ వెల్లడించిన వివరాల ప్రకారం.. కేతన్, సియాల ప్రీ-వెడ్డింగ్ ఫొటోషూట్ను బాలి ద్వీపంలో ఘనంగా నిర్వహించేందుకు జూన్ మొదటి వారంలో ఏర్పాట్లు చేశారు. ప్రయాణానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే ముంబై విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత కేతన్ పాస్పోర్ట్ కనిపించకుండా పోవడంతో ఆ ట్రిప్ రద్దయింది. దర్యాప్తులో బయటపడిన వివరాల ప్రకారం.. అంతర్జాతీయ ప్రయాణం జరగకుండా చూడాలనే ఉద్దేశంతో సియానే కావాలని ఈ పని చేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రయాణానికి వెళ్తున్న సమయంలో టిఫిన్ కోసం హోటల్ వద్ద ఆగినప్పుడు కేతన్ పాస్పోర్ట్ను చింపేసి, హోటల్ వాష్రూమ్లో పడేసినట్లు విచారణలో వెల్లడైంది.
వివరాలు
మొదటి ప్రయత్నం విఫలం.. పుట్టినరోజు పేరుతో రెండో ప్లాన్
బాలి ట్రిప్ రద్దయిన తర్వాత సియా, చేతన్లు తమ హత్యా ప్రణాళికను లోహగఢ్ కోట ప్రాంతానికి మార్చినట్లు పోలీసులు తెలిపారు. జూన్ 14న కేతన్ను హత్య చేయడానికి చేసిన తొలి ప్రయత్నం విఫలమైంది. అనంతరం జూన్ 18న సియా పుట్టినరోజు వేడుకల పేరుతో కేతన్ను మళ్లీ అక్కడికి తీసుకెళ్లారు. అక్కడ ఎండ తీవ్రంగా ఉన్నప్పటికీ చేతన్ ముఖానికి హుడీ ధరించి వారిని వెంబడించినట్లు దర్యాప్తులో తేలింది. ఫొటోలకు పోజులు ఇస్తున్న సమయంలో కేతన్ను ఒంటరి ప్రాంతానికి తీసుకెళ్లి, సుమారు 400 అడుగుల లోతున్న లోయలోకి నెట్టివేసినట్లు పోలీసులు వెల్లడించారు.
వివరాలు
రూ.17 కోట్ల పెళ్లి వద్దనుకున్న సియా
దర్యాప్తులో బయటపడిన వివరాల ప్రకారం.. సియా, చేతన్లు గత ఏడాది కాలంగా ప్రేమలో ఉన్నారు. తమ సంబంధానికి కేతన్ అడ్డుగా ఉన్నాడని భావించిన ఈ జంట హత్యకు పథకం రచించినట్లు పోలీసులు తెలిపారు. నవంబర్లో జరగాల్సిన వివాహం కోసం కేతన్ కుటుంబ సభ్యులు జైపూర్లోని ఓ విలాసవంతమైన ప్యాలెస్ను సుమారు రూ.17 కోట్ల వ్యయంతో బుక్ చేసినట్లు తెలిసింది. అయితే ఆ వివాహంపై ఆసక్తి లేని సియా, తన ప్రియుడు చేతన్తో కలిసి ఈ హత్యకు పాల్పడినట్లు విచారణలో ఇద్దరు నిందితులు అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు.
వివరాలు
శవం వద్ద కన్నీరు కూడా పెట్టలేదు
సియాను తమ సొంత కూతురిలా చూసుకున్నామని, కానీ ఆమె చేసిన మోసం తమను తీవ్రంగా కలచివేసిందని కేతన్ తండ్రి విశాల్ అగర్వాల్ ఆవేదన వ్యక్తం చేశారు. కేతన్ మృతదేహాన్ని పోలీసులు తీసుకువచ్చిన సమయంలో కూడా సియా ముఖంలో ఎలాంటి బాధ కనిపించలేదని, కన్నీటి చుక్క కూడా రాలేదని చెప్పారు. ఆమె ప్రవర్తనే తమలో అనుమానాలకు కారణమైందని వెల్లడించారు. పెళ్లి ఇష్టం లేకపోతే నిశ్చితార్థాన్ని రద్దు చేసుకోవచ్చని, కానీ ప్రాణాలు తీయడం ఎందుకని ప్రశ్నించారు. ఈ ఘటన వెనుక మరెవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు.