Loading...
PM Modi: కోటి మంది యువతకు ఏఐ స్కిల్స్‌.. పోటీ పరీక్షలకు ఫ్రీ ఆన్‌లైన్‌ కోచింగ్‌ : మోదీ
కోటి మంది యువతకు ఏఐ స్కిల్స్‌.. పోటీ పరీక్షలకు ఫ్రీ ఆన్‌లైన్‌ కోచింగ్‌ : మోదీ

PM Modi: కోటి మంది యువతకు ఏఐ స్కిల్స్‌.. పోటీ పరీక్షలకు ఫ్రీ ఆన్‌లైన్‌ కోచింగ్‌ : మోదీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 15, 2026
11:07 am

ఈ వార్తాకథనం ఏంటి

ఎర్రకోట వేదికగా 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ యువతను లక్ష్యంగా చేసుకుని పలు కీలక కార్యక్రమాలను ప్రకటించారు. దేశవ్యాప్తంగా కోటి మంది యువతకు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) నైపుణ్యాల్లో శిక్షణ అందిస్తామని వెల్లడించారు. అలాగే పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ఉచిత ఆన్‌లైన్‌ కోచింగ్‌ అందించనున్నట్లు తెలిపారు. పేద, మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గించడమే ఈ ఉచిత కోచింగ్‌ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని చెప్పారు. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న జనగణనలో యువత చురుగ్గా పాల్గొనాలని ప్రధాని పిలుపునిచ్చారు. యువత తమ సమయం నుంచి ఒకటి, రెండు గంటలు కేటాయించి జనగణనలో భాగస్వాములు కావాలని కోరారు.

వివరాలు

జనగణనకు అనుకూలమైన వాతావరణం ఉండాలి

జనగణన కోసం కేటాయించే ఆ కొద్దిపాటి సమయం దేశానికి ఎలా ఉపయోగపడుతుందనే సందేహం యువతకు ఉండొచ్చని మోదీ అన్నారు.

అయితే వారి భాగస్వామ్యంతో ప్రతి ఇంట్లో జనగణనకు అనుకూల వాతావరణం ఏర్పడుతుందని చెప్పారు.

జనగణన అంటే కేవలం లెక్కలను ఒకచోట నమోదు చేయడం కాదని.. ప్రజలు అందించే వివరాల ఆధారంగానే జాతీయ విధానాలు, సంక్షేమ పథకాలు రూపొందుతాయని వివరించారు.

దేశ ప్రగతికి జనాభా లెక్కలు ఒక సూచికగా పనిచేస్తాయని, అందువల్ల ప్రతి ఒక్కరూ కచ్చితమైన, స్పష్టమైన సమాచారం అందించడం అత్యంత కీలకమని పేర్కొన్నారు.

వివరాలు

'దిమాగీ నక్సల్స్‌'పై మోదీ హెచ్చరిక

'దిమాగీ నక్సల్స్‌' గురించి కూడా ప్రధాని మోదీ తన ప్రసంగంలో ప్రస్తావించారు. వారిని దేశానికి కొత్త శత్రువులుగా అభివర్ణించారు.

ఎన్నో ఏళ్లుగా మావోయిస్టు భావజాలాన్ని కలిగిన వ్యక్తులు దేశంలో బలంగా పాతుకుపోయారని చెప్పారు.

అడవుల్లో సాయుధ నక్సల్స్‌ను నిర్మూలించి, ఆ సంక్షోభం నుంచి దేశాన్ని విముక్తి చేయడంలో ప్రభుత్వం విజయం సాధించిందని మోదీ తెలిపారు.

అయితే సాయుధ నక్సల్స్‌ కనుమరుగైనప్పటికీ 'దిమాగీ నక్సల్స్‌' ఇంకా మిగిలి ఉన్నారని అన్నారు. వారు సరైన అవకాశం కోసం ఎదురుచూస్తూ సమాజాన్ని తప్పుడు మార్గంలోకి మళ్లించేందుకు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారని పేర్కొన్నారు.

అలాంటి వారిని గుర్తించి సమాజంలో ఏకాకిని చేయాలని ప్రధాని ప్రజలకు సూచించారు.

ADVERTISEMENT

వివరాలు

'సప్తధార' రోడ్‌మ్యాప్‌ ప్రకటన

దేశ భవిష్యత్తు అభివృద్ధికి సంబంధించిన 'సప్తధార' రోడ్‌మ్యాప్‌ను కూడా ప్రధాని మోదీ ప్రకటించారు.

తయారీ, వ్యవసాయం, సాంకేతికత, మౌలిక సదుపాయాలు, రక్షణ రంగం, గ్రీన్‌ అండ్‌ బ్లూ ఎకానమీ, భారత సాఫ్ట్‌ పవర్‌ వంటి ఏడు కీలక రంగాలను దేశ ప్రగతికి చోదక శక్తులుగా పేర్కొన్నారు.

మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై పిలుపు

మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై ప్రతిష్ఠంభన కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ తన ప్రసంగంలో ఈ అంశాన్ని కూడా ప్రస్తావించారు.

రాజకీయ విభేదాలను పక్కనపెట్టి పార్లమెంట్‌, శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పించేలా సహకరించాలని ప్రతిపక్ష పార్టీలను కోరారు.

ADVERTISEMENT