Air India: విమానంలో ఒకేసారి మూడు హైడ్రాలిక్ వైఫల్యాలు.. 4 సెకన్లు తీవ్ర ఉత్కంఠ
ఈ వార్తాకథనం ఏంటి
థాయిలాండ్ నుంచి దిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానం ఇటీవల ప్రయాణ మధ్యలో తీవ్ర కుదుపులకు గురైంది. ఈ సమయంలో విమానం ఒక్కసారిగా దాదాపు 300 అడుగుల మేర కిందికి పడిపోయింది. ఘటనపై దర్యాప్తు చేపట్టిన అధికారులు కీలక విషయాలను వెల్లడించారు. విమానంలో సుమారు 4 సెకన్ల పాటు నియంత్రించలేని స్థాయిలో పలు సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు తెలిపారు. అదే సమయంలో వరుసగా మూడు హైడ్రాలిక్ వైఫల్యాలు చోటుచేసుకున్నాయని వెల్లడించారు.
వివరాలు
ఒకేసారి మూడు హైడ్రాలిక్ వ్యవస్థల్లో వైఫల్యం
దర్యాప్తు నివేదిక ప్రకారం.. సాధారణంగా విమానం మూడు వేర్వేరు హైడ్రాలిక్ వ్యవస్థలపై ఆధారపడి పనిచేస్తుంది.
వీటిలో ఒక వ్యవస్థ పనిచేయకపోయినా మిగిలిన వ్యవస్థల సాయంతో ల్యాండింగ్ గేర్లను నియంత్రించే అవకాశం ఉంటుంది.
అయితే ఈ ఘటనలో సెకన్ల వ్యవధిలోనే మూడు హైడ్రాలిక్ వ్యవస్థలు ఒకేసారి విఫలమైనట్లు అధికారులు గుర్తించారు. దీంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది.
ఎలివేటర్లోనూ లోపం.. ఆటోపైలట్ డిస్కనెక్ట్
హైడ్రాలిక్ వ్యవస్థల వైఫల్యం తర్వాత విమానం పైకి లేదా కిందికి వెళ్లేలా నియంత్రించడంలో కీలకంగా పనిచేసే ఎలివేటర్ వ్యవస్థలోనూ లోపం తలెత్తింది.
ఇదే సమయంలో ఆటోపైలట్ మోడ్ కూడా డిస్కనెక్ట్ అయింది.
దీంతో కో-పైలట్ విమానాన్నిమాన్యువల్గా నియంత్రించాల్సి వచ్చింది.ఈ పరిణామాల మధ్య విమానం వేగంగా కిందికి దూసుకెళ్లినట్లు అధికారులు తెలిపారు.
వివరాలు
ఘటన సమయంలో విమానంలో 145 మంది
ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో మొత్తం 137 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరితో పాటు ఎనిమిది మంది సిబ్బంది కూడా విమానంలో ఉన్నారు.
సాంకేతిక సమస్యలు తలెత్తిన సమయంలో విమానం ఒక్కసారిగా కిందికి పడిపోవడంతో ప్రయాణికుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
ఇండిపెండెంట్ సిస్టమ్స్లోనూ సమస్యలు
విమాన తయారీ సంస్థ ఎయిర్బస్ కూడా ఈ ఘటనపై స్పందించింది. విమానంలోని స్వతంత్ర వ్యవస్థల్లోనూ కొన్ని సమస్యలను గుర్తించినట్లు వెల్లడించింది.
అయితే విమానంలోని హైడ్రాలిక్ వ్యవస్థలు నిజంగానే విఫలమయ్యాయా? లేక వ్యవస్థల నుంచి తప్పుడు హెచ్చరికలు మాత్రమే వచ్చాయా? అనే విషయాన్ని పూర్తిగా పరిశీలించాల్సిన అవసరం ఉందని తెలిపింది.
దీనిపై దర్యాప్తు చేపట్టాలని ఎయిరిండియాను కోరింది.
వివరాలు
పైలట్ డ్రగ్ టెస్టులో కీలక విషయం
మరోవైపు ఈ విమాన ఘటనకు సంబంధించి పైలట్పై ఇప్పటికే అధికారులు కీలక విషయాన్ని వెల్లడించారు.
విమానం ప్రయాణిస్తున్న సమయంలో ఆయన గంజాయి సేవించినట్లు డ్రగ్ టెస్టులో తేలిందని తెలిపారు.
విమానం ల్యాండ్ అయిన తర్వాత కూడా ఆయన స్వయంగా నడిచి వెళ్లలేకపోయారని, దీంతో ఇతర సిబ్బంది సహాయంతో బయటకు తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు.
వివరాలు
ఇద్దరు పైలట్లపై డీజీసీఏ చర్యలు
ఘటనపై సమగ్ర విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఇద్దరు పైలట్లను డీజీసీఏ రోస్టర్ నుంచి తప్పించింది.
విమానంలో చోటుచేసుకున్న సాంకేతిక వైఫల్యాలు, హైడ్రాలిక్ వ్యవస్థల పనితీరు, ఎలివేటర్ నియంత్రణలో లోపం, ఆటోపైలట్ డిస్కనెక్ట్ వంటి అంశాలతో పాటు పైలట్ డ్రగ్ టెస్టు ఫలితాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు.