Budget Session: రేపటి నుంచి బడ్జెట్ సమావేశాలు.. విపక్ష ఎంపీలందరిపై సస్పెన్షన్ ఎత్తివేత
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు బుధవారం(జనవరి 31) నుంచి ఫిబ్రవరి 9 వరకు జరగనున్నాయి. ఈ క్రమంలో గత పార్లమెంట్ సెషన్లో సస్పెండ్ అయిన విపక్ష ఎంపీలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో విపక్ష ఎంపీలందరిపై సస్పెన్షన్ను ఎత్తివేసినట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. శీతాకాల సమావేశాల సందర్భంగా సస్పెండ్ చేసిన విపక్ష ఎంపీల సస్పెన్షన్ను రద్దు చేస్తామన్నారు. శీతాకాల సమావేశాల్లో 146 మంది ఎంపీలను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. లోక్సభలో భద్రతా లోపంపై కేంద్ర హోంమంత్రి ప్రకటన చేయాలని విపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు. దీంతో తీవ్ర గందరగోళం మధ్య విపక్ష ఎంపీలను సస్పెండ్ చేశారు.
జోషి ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ప్రహ్లాద్ జోషి నేతృత్వంలో మంగళవారం అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గత సెషన్లో సస్పెండ్ అయిన ఎంపీలను ఈ సమావేశాలకు అనుమతిస్తారా? అని విపక్షాలు అధికార పక్షాన్ని అడిగాయి. అయితే సస్పెన్షన్కు గురైన ఎంపీల సస్పెన్షన్ను రద్దు చేస్తామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. విషయంపై తాను ఇప్పటికే నేను లోక్సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్తో మాట్లాడినట్లు వెల్లడించారు. 146మంది ఎంపీల్లో 132మందిని శీతాకాల సమావేశాల వరకు మాత్రమే సస్పెండ్ చేశారు. మిగిలిన 14మందిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అందులో 11మంది రాజ్యసభ నుంచి, 3మంది లోక్సభ నుంచి ఉన్నారు. ఇప్పుడు ఆ 14మందిపై కూడా సస్పెన్షన్ ఎత్తివేస్తామని ప్రహ్లాద్ జోషి చెప్పారు.