Pedapudi Farmer: నీటి ప్రవాహంతోనే సాగునీరు.. పెదపూడి రైతు హైడ్రోలిఫ్ట్కు రాష్ట్రపతి ప్రశంస
ఈ వార్తాకథనం ఏంటి
ఇంధనం అవసరం లేకుండా నీటిని ఎత్తిపోసే వినూత్న హైడ్రోలిఫ్ట్ను కాకినాడ జిల్లా పెదపూడి మండలానికి చెందిన రైతు పంపన శ్రీనివాస్ రూపొందించారు. విద్యుత్తు అందుబాటులో లేని ప్రాంతాల్లోనూ పంట కాలువలు, వాగుల్లోని నీటిని మెట్ట ప్రాంతాలకు మళ్లించేందుకు ఈ పద్ధతి ఉపయోగపడుతుందని ఆయన చెబుతున్నారు. సాధారణంగా పంట కాలువలు, వాగుల నుంచి నీటిని ఎత్తిపోసేందుకు మోటార్లు అవసరం. వాటిని నడిపించాలంటే విద్యుత్తు లేదా డీజిల్, పెట్రోల్ వంటి ఇంధనాలు కావాలి. అయితే వీటితో సంబంధం లేకుండా నీటిని పైకి పంపించే విధానాన్ని శ్రీనివాస్ అభివృద్ధి చేశారు.
వివరాలు
వర్సిటీ ప్రాజెక్టుకు రూ.5 లక్షల వరకు ఆర్థిక సహాయం
ఐటీఐ చదివిన శ్రీనివాస్ కొన్నేళ్లుగా వ్యవసాయం చేస్తున్నారు. ఈ క్రమంలో తొలుత హైడ్రోలిఫ్ట్ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రొటోటైప్ను తయారు చేశారు.
అనంతరం కేఎల్ విశ్వవిద్యాలయాన్ని సంప్రదించారు. అటల్ ఇన్నోవేషన్ మిషన్తో కలిసి ఆ వర్సిటీ ప్రాజెక్టుకు రూ.5 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించింది.
దీనికి శ్రీనివాస్ మరికొంత మొత్తాన్ని జోడించి ప్రయోగాన్ని ముందుకు తీసుకెళ్లారు. వేట్లపాలెంలోని ఓ స్లూయిస్ వద్ద హైడ్రోలిఫ్ట్ ప్రయోగాన్ని నిర్వహించారు.
స్లూయిస్ నుంచి నీరు వేగంగా కిందికి ప్రవహించే ప్రాంతాన్ని ఇందుకోసం ఎంపిక చేశారు. అక్కడ ఇనుముతో తయారు చేసిన రెండు టర్బైన్లను ఏర్పాటు చేశారు.
వివరాలు
పంపులు సమర్థంగా పనిచేసేలా గేర్ బాక్స్ల ఏర్పాటు
నీటి ప్రవాహం ఉద్ధృతంగా ఉండటంతో టర్బైన్లు వేగంగా తిరుగుతాయి. వాటికి అనుసంధానించిన రెండు పంపులు ఈ యాంత్రిక శక్తిని ఉపయోగించుకుని నీటిని సుమారు 10 మీటర్ల ఎత్తుకు ఎత్తిపోస్తాయి.
పంపులు సమర్థంగా పనిచేసేలా గేర్ బాక్స్లను కూడా ఏర్పాటు చేశారు.
ఈ హైడ్రోలిఫ్ట్ను రోజంతా వినియోగిస్తే దాదాపు 25 లక్షల లీటర్ల నీటిని ఎత్తిపోసే సామర్థ్యం ఉందని శ్రీనివాస్ తెలిపారు.
సుమారు 10 నెలల పాటు నిర్వహించిన ప్రయోగాలు విజయవంతం కావడంతో ఆయనతో కలిసి పనిచేసిన సాంకేతిక బృందం హర్షం వ్యక్తం చేస్తోంది.
వివరాలు
రాష్ట్రపతి భవన్కు ఆహ్వానం
దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 26 మంది గ్రాస్రూట్ ఇన్నోవేటర్లను ఇటీవల రాష్ట్రపతి భవన్కు ఆహ్వానించారు.
వారిలో శ్రీనివాస్ కూడా ఉన్నారు. అక్కడ తన హైడ్రోలిఫ్ట్ ప్రాజెక్టు నమూనా, దాని పనితీరును రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వివరించారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో వాగుల నుంచి నీరు వృథాగా ప్రవహించి వెళ్లిపోకుండా, తక్కువ ఖర్చుతో దాన్ని ఎత్తిపోసి ఉపయోగించుకునేందుకు ఈ ఆవిష్కరణ ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్రపతి ప్రశంసించినట్లు శ్రీనివాస్ తెలిపారు.
వివరాలు
బెస్ట్ గ్రాస్రూట్ ఇన్నోవేటర్ పురస్కారం
శ్రీనివాస్ రూపొందించిన హైడ్రోలిఫ్ట్ ఆవిష్కరణకు మరో గుర్తింపు లభించింది. కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్రసింగ్ చేతుల మీదుగా ఆయన 'బెస్ట్ గ్రాస్రూట్ ఇన్నోవేటర్' పురస్కారాన్ని అందుకున్నారు.
రైతు స్వయంగా రూపొందించిన ఈ ఇంధన రహిత నీటి ఎత్తిపోతల విధానం సాగునీటి అవసరాలు ఉన్న ప్రాంతాలకు ఉపయోగకరమైన పరిష్కారంగా నిలిచే అవకాశం ఉంది.