Andhra Pradesh : ఏపీ మిర్చికి విదేశాల్లో భారీ డిమాండ్.. ఐదేళ్లలో రూ.28 వేల కోట్ల ఎగుమతులు
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ నుంచి గత ఐదేళ్లలో భారీగా మిర్చి ఎగుమతులు జరిగినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ కాలంలో రాష్ట్రం నుంచి మొత్తం 13.26 లక్షల టన్నుల మిర్చి ఎగుమతి కాగా, వీటి విలువ రూ.28,767 కోట్లుగా ఉందని కేంద్ర వాణిజ్యశాఖ సహాయమంత్రి జితిన్ ప్రసాద తెలిపారు. మంగళవారం లోక్సభలో ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. ఏపీ నుంచి ఎగుమతి అవుతున్న మిర్చికి చైనా, బంగ్లాదేశ్, థాయిలాండ్, శ్రీలంక, ఇండోనేసియా, మలేసియా, అమెరికా ప్రధాన మార్కెట్లుగా ఉన్నాయని మంత్రి తెలిపారు. ముఖ్యంగా ప్రతి ఏడాది ఏపీ నుంచి ఎగుమతి చేసే మొత్తం మిర్చిలో 30 శాతానికిపైగా చైనాకే వెళ్తున్నట్లు వివరించారు.
వివరాలు
రైతు కుటుంబాల నెలవారీ ఆదాయం రూ.10,480
ఆంధ్రప్రదేశ్లో రైతు కుటుంబాల సగటు నెలవారీ ఆదాయం రూ.10,480గా ఉన్నట్లు కేంద్ర వ్యవసాయశాఖ సహాయమంత్రి రామ్నాథ్ ఠాకూర్ తెలిపారు.
2019 జనవరి నుంచి డిసెంబర్ వరకు నిర్వహించిన సిచ్యుయేషన్ అసెస్మెంట్ సర్వేలో ఈ వివరాలు వెల్లడైనట్లు చెప్పారు.
అదే సమయంలో రాష్ట్రంలో అప్పుల్లో ఉన్న వ్యవసాయ కుటుంబాల సంఖ్య కూడా పెరిగినట్లు కేంద్రం తెలిపింది.
2012-13లో నిర్వహించిన సర్వే ప్రకారం ఏపీలో 92.9 శాతం వ్యవసాయ కుటుంబాలు అప్పుల్లో ఉండగా.. 2018-19 నాటికి ఈ శాతం 93.2కి పెరిగినట్లు రామ్నాథ్ ఠాకూర్ వెల్లడించారు.
వివరాలు
గ్రామీణ ఇళ్ల నిర్మాణం 36.69 శాతమే
ప్రధానమంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ) పథకం కింద ఆంధ్రప్రదేశ్కు మంజూరైన ఇళ్లలో ఇప్పటి వరకు 36.69శాతం మాత్రమే పూర్తయ్యాయి.
2016 ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రానికి మంజూరైన ఇళ్ల నిర్మాణ పురోగతిపై కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ లోక్సభలో వివరాలు వెల్లడించారు.
అమలాపురం తెదేపా ఎంపీ జీఎంహెచ్ బాలయోగి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ.. ఏపీకి ఇప్పటి వరకు మొత్తం 2,46,929ఇళ్లు మంజూరైనట్లు తెలిపారు.
వీటిలో ఎస్సీ వర్గాలకు 31.62 శాతం,ఎస్టీలకు 18.06 శాతం,ఇతర వర్గాలకు 50.30 శాతం ఇళ్లు కేటాయించినట్లు వివరించారు.
మంజూరైన ఇళ్లలో ఇప్పటి వరకు 90,601 ఇళ్ల నిర్మాణం పూర్తయినట్లు పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.
వివరాలు
విపత్తుల నివారణకు రూ.6,533 కోట్లు
పూర్తయిన ఇళ్లలో ఎస్సీలకు చెందినవి 28.11 శాతం, ఎస్టీలకు చెందినవి 19.09 శాతం, ఇతర వర్గాలకు చెందినవి 52.79 శాతంగా ఉన్నట్లు వెల్లడించారు.
ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాలను ఎదుర్కొనేందుకు ఆంధ్రప్రదేశ్కు రాష్ట్ర విపత్తు స్పందన నిధి (ఎస్డీఆర్ఎఫ్) కింద 16వ ఆర్థిక సంఘం కాలంలో రూ.6,533 కోట్లు కేటాయించనున్నట్లు కేంద్ర వ్యవసాయశాఖ సహాయమంత్రి రామ్నాథ్ ఠాకూర్ తెలిపారు.
ఈ నిధులను 2026-27 నుంచి 2030-31 వరకు ఐదేళ్లలో విడుదల చేయనున్నట్లు చెప్పారు.
2026-27లో రూ.1,182 కోట్లు, 2027-28లో రూ.1,241 కోట్లు, 2028-29లో రూ.1,303 కోట్లు, 2029-30లో రూ.1,368 కోట్లు, 2030-31లో రూ.1,439 కోట్లు కేటాయించనున్నట్లు వెల్లడించారు.