Andhra Pradesh: ఎల్నినో ప్రభావం.. పెరుగుతున్న విద్యుత్తు డిమాండ్.. అధికారులకు విజయానంద్ కీలక సూచనలు
ఈ వార్తాకథనం ఏంటి
ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో విద్యుత్తు వినియోగం మరింత పెరిగే అవకాశాల నేపథ్యంలో, పెరుగుతున్న డిమాండ్కు ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్తు సరఫరా చేయాలని సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ విద్యుత్తు సంస్థల ఉన్నతాధికారులను ఆదేశించారు. ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకు అవసరమయ్యే విద్యుత్తు డిమాండ్, అందుబాటులో ఉండే ఉత్పత్తి సామర్థ్యం, థర్మల్ విద్యుత్తు కేంద్రాల్లో బొగ్గు నిల్వలు, అలాగే బహిరంగ మార్కెట్ నుంచి విద్యుత్తు కొనుగోళ్లపై అనుసరించాల్సిన వ్యూహాన్ని గురువారం వీడియో కాన్ఫరెన్స్లో సమీక్షించారు. ఈ సందర్భంగా విజయానంద్ మాట్లాడుతూ, జులై 15న రాష్ట్రంలో విద్యుత్తు వినియోగం 285 మిలియన్ యూనిట్లకు చేరి కొత్త రికార్డు నమోదైందని తెలిపారు.
వివరాలు
బొగ్గు నిల్వలపై ప్రత్యేక దృష్టి
రాష్ట్ర విద్యుత్తు రంగ చరిత్రలో జులై నెలలో నమోదైన అత్యధిక డిమాండ్ ఇదేనని పేర్కొన్నారు.
రానున్న నెలల్లో వినియోగం మరింత పెరిగే అవకాశమున్నందున, అవసరాలను ముందుగానే అంచనా వేసి విద్యుత్తు ఎక్స్ఛేంజీలు, టర్మ్ అహెడ్ మార్కెట్ ద్వారా డిస్కంలు ముందస్తుగా విద్యుత్తు కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
అలాగే థర్మల్ విద్యుత్తు కేంద్రాల్లో బొగ్గు నిల్వలు తగిన స్థాయిలో ఉండేలా జెన్కోలు ప్రత్యేక దృష్టి పెట్టాలని, విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాల నిర్వహణను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.
సాంకేతిక సమస్యలు తలెత్తిన వెంటనే వాటిని పరిష్కరించి విద్యుత్తు సరఫరాలో అంతరాయం లేకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు.
వివరాలు
37 నిమిషాల్లో సరఫరాను పునరుద్ధరించాం
విద్యుత్తు ప్రసార వ్యవస్థలో ఏర్పడిన సాంకేతిక లోపం కారణంగా ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రభావితమైన ప్రాంతాలకు కేవలం 37 నిమిషాల్లోనే విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించినట్లు విజయానంద్ వెల్లడించారు.
గురువారం ఉదయం 11.53 గంటలకు వేమగిరి ఉపకేంద్రంలో సాంకేతిక లోపం చోటుచేసుకుందని ఆయన తెలిపారు.
220 కేవీ బస్ కప్లర్ సమీపంలో జంపర్ తెగిపోవడంతో సబ్స్టేషన్ పరిధిలోని ఐసీటీలు ట్రిప్ అయ్యాయని వివరించారు.
వివరాలు
37 నిమిషాల్లో సరఫరాను పునరుద్ధరించాం
దీంతో గుడ్డిగూడెం, కామవరపుకోట సబ్స్టేషన్లలోని 220 కేవీ ట్రాన్స్ఫార్మర్లు ఓవర్లోడ్కు గురయ్యాయని చెప్పారు.
అయితే విద్యుత్తు శాఖ సిబ్బంది సమన్వయంతో వేగంగా స్పందించడంతో మధ్యాహ్నం 12.30 గంటలకే విద్యుత్తు సరఫరాను పూర్తిగా పునరుద్ధరించామని విజయానంద్ తెలిపారు.
ఈ ఘటనకు గల కారణాలపై సమగ్రంగా విశ్లేషణ చేపడుతున్నామని, భవిష్యత్లో ఇటువంటి సమస్యలు పునరావృతం కాకుండా ప్రసార వ్యవస్థను మరింత బలోపేతం చేసే చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.